
భూ వివాదంలో ఘర్షణ
బుచ్చెయ్యపేట: మండలంలో శివారు గ్రామం మల్లాం భూపతిపాలెం(ఎంబీ పాలెం)లో భూమి గట్టు వివాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉండగా అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎంబీపాలేనికి చెందిన కలం చంటమ్మ, మహాలక్ష్మిల భూములు పక్క పక్కనే ఉన్నాయి. వీరిద్దరూ భూముల గట్టు విషయమై పలుమార్లు గొడవలకు దిగారు. మంగళవారం మహాలక్ష్మి కుటుంబ సభ్యులు పొలం గట్టు వేస్తుండగా చంటమ్మ అల్లుడు అప్పాన కొండలరావు అడ్డుకున్నాడు. దీంతో ఇరువురు మధ్య గొడవ జరిగింది. ఈ దాడిలో కొండలరావు తలపై తీవ్ర గాయమై రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కుట్లు వేసి వైద్య సేవలందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఒకరికి తీవ్ర గాయాలు