
ఉత్తమ నాటికగా ‘జనరల్ బోగీలు’
కశింకోట: ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలో గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సాయి ఆర్ట్స్ వారి ‘జనరల్ బోగీలు’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఇదే నాటికకు అత్యధికంగా పలు విభాగాల్లో నాలుగు బహుమతులు లభించాయి. స్థానిక గవరపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అశోక్ ఫ్రెండ్స్ క్లబ్ సాంస్కృతిక కళా పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా పది నాటికలను ప్రదర్శించారు. పోటీలో 9 నాటికలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో ఉత్తమ ద్వితీయ, తృతీయ ప్రదర్శనలు వరుసగా విశాఖపట్నం తెలుగు కళా సమితి వారి ‘నిశ్శబ్దమా? నీ ఖరీదెంత?’, గుడివాడకు చెందిన కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘ద్వార బంధాల చంద్రయ్యనాయుడు’, స్పెషల్ జ్యూరీ ప్రదర్శన ప్రథమ, ద్వితీయంగా గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారి ‘నాన్నా నేను వచ్చేస్తా’, హైదరాబాద్ గోవాడ ఆర్ట్స్ వారి ‘మూల్యం’ బహుమతులు గెలుచుకున్నాయి. ఉత్తమ నటునిగా పెందుర్తి డ్రమెటిక్ అసోసియేషన్ వారి ‘శిథిల జీవి’ నాటికలో అయలయ్య పాత్రధారి బీసీహెచ్ శేఖర్, ద్వితీయ ఉత్తమ నటునిగా హైదరాబాద్ గోవాడ ఆర్ట్స్ వారి ‘మూల్యం’ నాటికలో సోమ సుందర్ పాత్రధారి భాగి శివశంకర్శాస్త్రి, ఉత్తమ నటిగా గుంటూరు జిల్లా కోలకలూరు సాయి ఆర్ట్స్ వారి ‘జనరల్ బోగీలు’లో సావిత్రమ్మ పాత్రధారి సురభి ప్రభావతి, ద్వితీయ ఉత్తమ నటిగా గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారి ‘నాన్నా నేనొచ్చేస్తా’ నాటికలో సావిత్రి పాత్రధారి ఎస్. అమృత వర్థిని, ఉత్తమ ప్రతి నాయకునిగా ‘జనరల్ బోగీలు’ నాటికలో సీఐ పాత్రధారి, సినీ,రంగస్థల నటుడు గోపరాజు విజయ్, ఉత్తమ దర్శకునిగా విశాఖపట్నం తెలుగు కళా సమితి వారి ‘నిశ్శబ్దమా? నీ ఖరీదెంత? నాటిక దర్శకుడు చలసాని కృష్ణప్రసాద్, ఉత్తమ సహాయ నటునిగా విజయవాడ గురజాడ కళామందిర్ వారి ‘ మహా ప్రస్థానంలో సింహాద్రి పాత్రధారి బి. నరేన్, ఉత్తమ సహాయ నటిగా కాకినాడ బీవీకే క్రియేషన్స్ వారి ‘తితిక్ష’ నాటికలో భారతి పాత్రధారి ఎస్. జ్యోతిరాణి, ఉత్తమ హాస్య నటుడు ‘నిశ్శబ్దమా? నీ ఖరీదెంతలో వామనరావు పాత్రధారి డి. కన్నబాబు, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా ‘ద్వారబంధాల చంద్రయ్యనాయుడు’ నాటికలో చంద్రయ్యనాయుడు పాత్రధారి సీఆర్వీఏ నరసింహారావు బహుమతులను గెలుచుకున్నారు. ఉత్తమ రచనగా జనరల్ బోగీలు నాటిక రచయిత పీటీ మాధవ్, ఉత్తమ సంగీతంగా ‘చీకటి పువ్వు’ నాటికకు అందించిన సురభి నాగరాజుకు, ఉత్తమ రంగాలంకరణ ‘తితిక్ష’ నాటికలో సురభి సంతోష్కు, ఉత్తమ ఆహార్యం (మేకప్ మెన్)గా ‘ద్వారబంధాలు చంద్రయ్యనాయుడు’లో పి. శేషగిరి, పి.వి. సత్యనారాయణ, జ్యూరీ అవార్డులుగా ‘చీకటిపువ్వు’ నాటికలో వాటికల్ సిద్దార్థ పాత్రధారి ఎన్. సూర్య, ‘నాన్నా నేనొచ్చేస్తా’లో శ్రీరాం పాత్రధారి ఎస్కె.డి. హసన్కు లభించాయి. బహుమతులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తదితరులు అందజేశారు. సూరిశెట్టి రాము, భీమిశెట్టి వేణుగోపాలకృష్ణ, పొన్నాడ ముత్యాలరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెంటకోట శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ముగిసిన
ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలు