
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: పట్టణానికి సమీపంలో పెదపల్లి హైవే కూడలి వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యలమంచిలి పాతవీధికి చెందిన ఎడ్ల సన్యాసినాయుడు(37) దుర్మరణం పొందాడు. పట్టణంలో ఓ ఎలక్ట్రికల్ ఉపకరణాలు విక్రయించే దుకాణంలో సన్యాసినాయుడు రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. మున్సిపాలిటీ పరిధి పెదపల్లిలో ఉన్న తన అత్తవారింటికి వెళ్లడానికి పెదపల్లి హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సన్యాసినాయుడు నడుం భాగం నుంచి కింద శరీర భాగాలన్నీ నుజ్జయ్యాయి. దీంతో ఆయన ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్తవారింటికి వెళ్తుండగా ఊహించనిరీతిలో రోడ్డు ప్రమాదం ఇంటి పెద్దను మృత్యువు కబళించడంతో భార్య, పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. భార్య కరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ సావిత్రి తెలిపారు.