
ఇంటి నుంచి పరారైన ముగ్గురు బాలురు క్షేమం
ఎస్.రాయవరం : ఇంటినుంచి పరారైన ముగ్గురు బాలురను సికింద్రాబాద్లో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించినట్టు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. దార్లపూడి గ్రామానికి చెందిన గొన్నా వెంకట నితిన్ పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు అదే గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న స్నేహితుడు చంద్రశేఖర్తో కలిసి ఈ నెల 20న చినగుమ్ములూరు వెళ్లారు. చినగుమ్ములూరులో మరో స్నేహితుడు 8వ తరగతి చదువుతున్న గుడాల పండుతో కలిసి ట్రైన్లో విశాఖపట్నం వెళ్లారు. విశాఖ బీచ్లో కేక్ కట్ చేసుకుని పుట్టినరోజు జరుపుకొన్నారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోయిన నితిన్కి తండ్రి నాగేశ్వరరావు పదేపదే ఫోన్ చేసినప్పటికీ నితిన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడ నుంచి విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ వెళ్లారు. ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో చేతిలో సెల్ఫోన్ అమ్మివేసి ఆ డబ్బులు కూడా ఖర్చు చేశారు. తిరిగి వచ్చేందుకు వీలుకుదరక సిక్రిందాబాద్లో ఉండిపోయారు. రెండు రోజుల పాటు తమ కుమారుడు ఆచూకీ తెలియకపోవడంతో నితిన్ తండ్రి ఎస్.రాయవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు దర్యాప్తు జరిపి మైనర్ బాలురు ముగ్గురూ సికింద్రాబాద్లో ఉన్నట్టు గుర్తించి వారిని పట్టుకున్నారు. శనివారం వారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.