
భగ్గుమన్న దళిత సంఘాలు
నక్కపల్లి: ఆవేదన చెందారు.. ఆగ్రహించారు.. దళితులంటే అంత చులకనా అని నిలదీశారు.. ఈ రోజుల్లో కూడా ఇదెక్కడి దారుణమని ప్రశ్నించారు.. డొంకాడ ఘటనపై పలు ప్రజా, దళిత సంఘాలు నక్కపల్లిలో శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్విగ్నంగా సాగింది. సాక్షాత్తూ దళితురాలైన హోం మంత్రి అనిత నియోజకవర్గంలోనే ఈ దారుణం జరగడం, ఆమె కనీసం బాధితుల పరామర్శకు రాకపోవడం వారిని కలచివేసింది. శుక్రవారం దళిత హక్కుల ఐక్యవేదిక, సీపీఎం, సీపీఐ వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది దళితులు నక్కపల్లి జాతీయరహదారిపై భారీ ర్యాలీ, ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ చేసి సీఐ, ఎస్ఐలను కలిసి కేసు నమోదుపై వినతిపత్రాలు అందజేశారు. ఆందోళనకు నాసా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సోనీవుడ్, డీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకుడు, విశ్రాంత ఆర్జేడీ జేవీ ప్రభాకర్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు నాయకత్వం వహించారు. వారు మాట్లాడుతూ.. వివాహ కార్యక్రమానికి లైటింగ్ పనుల కోసం వచ్చిన 8మంది దళిత యువకులపై సెల్ఫోన్ చోరీ అభియోగం మోపారని, కులం పేరుతో దూషించి కర్రలతో దాడి చేసారన్నారు. 18వ తేదీ రాత్రి పంచాయతీకి పిలిచి లైట్లు ఆర్పేసి తెల్లవార్లు యువకులను కర్రలతో కొడుతూ వేధించారన్నారు. పోలీసులు టీడీపీకి చెందిన అగ్రవర్ణాల వారికి కొమ్ముకాస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా, బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాశారని ఆరోపించారు.
పక్షపాత ధోరణిలో డీఎస్పీ విచారణ
డీఎస్పీ చేసిన విచారణ పక్షపాతంగా సాగిందని, బాధితులను సమగ్రంగా విచారించలేదన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా హోమ్ మంత్రి దగ్గరకు వెళ్తే తక్షణమే కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించకపోగా గ్రామానికి వచ్చి ఇరువర్గాలతో చర్చలు జరిపి రాజీ కుదురుస్తానని చెప్పడం శోచనీయమన్నారు. అవసరమయితే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు.
డొంకాడ దాడి కేసు నిందితులను అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం
హోం మంత్రి నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదని ఆవేదన
వందలాది మందితో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ
చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

భగ్గుమన్న దళిత సంఘాలు