
సింహగిరిపై ఒడిశా భక్తుల సందడి
సింహాచలం: సింహగిరిపై నిత్యకల్యాణం ప్రాంగణం ఒడిశా భక్తులతో కిటకిటలాడింది. ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్నాయక్ దాస్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి జరిపించిన నిత్యకల్యాణంలో పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలకు విశేష పూలాలంకరణ చేసి వేదికపై అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీకాంత్నాయక్ దాస్ వింజామరతో స్వామికి సేవలందించారు. భక్తులకు స్వామి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అప్పన్నకు నిత్యకల్యాణం జరిపించిన దాసుడు