
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
నర్సీపట్నం: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, గొలుగొండ, నర్సీపట్నం ఎస్సైలు రామారావు, రాజారావు, సిబ్బంది గొలుగొండ మండలం పాలకలపాడు గ్రామ శివారులో మాటు వేశారు. మారుతి ఎర్టిగా కారులో గంజాయి తీసుకొస్తుండగా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వెంటపడి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారయ్యారు. జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ దబ్బకోట గ్రామానికి కర్రి అప్పన్న(27), కర్రి రాజు(36), కర్రి దార(21)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కారు డోర్ అరలో అర కిలో, కిలో చొప్పున 50 కిలోల గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తున్నారు. సిబ్బంది చాకచక్కంగా వ్యవహరించి పట్టుకున్నారు. దీని విలువ రూ.2.5 లక్షలుగా అంచనా వేశారు. ఒడిశాలోని జనపాయ గ్రామం వద్ద గంజాయి కొనుగోలు చేసి తుని తరలిస్తుండగా పట్టుబడ్డారు. కిలో రూ.5 వేలకు కొని ఇతర రాష్ట్రాల్లో రూ.25 వేలకు అమ్ముతున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. గంజాయిని పట్టుకునేందుకు రిస్క్ చేసిన సిబ్బంది చిన్నారావు, బాబ్జి, త్రిమూర్తులు, సాయి, సురేష్లను అభినందించి, నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
మరొకరు పరారీ
రూ.2.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం