
నేరేడు బందలో ఆరుగురికి మలేరియా జ్వరాలు
జ్వర పీడితులకు ఆర్టీడీ టెస్ట్లు చేస్తున్న మలేరియా అధికారులు
రావికమతం : చీమలపాడు శివారు కొండ శిఖర గ్రామం నేరేడుబందలో ఆరుగురికి మలేరియా జ్వరాలు ఉన్నట్టు ఆర్టీడీ టెస్టులు (రక్త పరీక్షలు) ద్వారా మలేరియా అధికారులు నిర్దారించారు. నేరేడుబందలో విష జ్వరాలు ప్రబలి 13 మందికి పైగా మంచం పట్టారు. విష జ్వరాలపై మంగళవారం సబ్ యూనిట్ మలేరియా అధికారి రమణ, ఎల్.టి.మహేష్ , హెచ్.ఎస్.రమణ నేరేడుబందకు వెళ్లి జ్వరాలపై ఆరా తీశారు. జ్వరాల నిర్ధారణకు జ్వర పీడితులకు ఆర్టీడీ టెస్టు ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి ఆరుగురికి మలేరియా జ్వరాలు ఉన్నట్టు నిర్ధారించారు. వారికి అవసరమైన మందులు అందచేసినట్టు మలేరియా అధికారి రమణ చెప్పారు. మలేరియా కారక దోమల నిర్మూలనకు ఇంటింటా స్ప్రేయింగ్ చేయించారు. దోమ తెరలు వాడాలని, రోజూ కాచి వడపోసిన వేడి నీటిని తాగాలని ఇళ్ల వద్ద మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజనులకు సూచించినట్టు చోడవరం సబ్ యూనిట్ మలేరియా ఆధికారి రమణ తెలిపారు.