
మత్స్యావతారంలో జగన్నాథుడు
డాబాగార్డెన్స్(విశాఖ): టర్నర్ చౌల్ట్రీలో కొలువైన జగన్నాథస్వామి శనివారం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగరం నుంచేకాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 నుంచి 6 వరకు స్వామివారికి మేలుకొలుపు, నాదస్వరం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం 6–7 గంటల వరకు నిత్యపూజ నిర్వహించారు. ఉదయం 7–9:30 గంటల వరకు జగన్నాథస్వామి ప్రార్థనా సంఘం ఆధ్వర్యంలో ప్రార్థనా తరంగిణి కార్యక్రమం జరిగింది. 9.30 –10:30 వరకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. మధ్యాహ్నం 3:30 – సాయంత్రం 5 గంటల వరకు సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 –రాత్రి 9:30 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జగన్నాథస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి టి. రాజగోపాల్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఫెస్టివల్ ఆఫీసర్ టి. అన్నపూర్ణతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.