
ఇంత.. నిర్లక్ష్యమా?
● పాడేరు వైద్య కళాశాలపై
కూటమి ప్రభుత్వం చిన్నచూపు
● నత్తనడకన నిర్మాణాలు
● బిల్లులు చెల్లించకపోవడంతో
ముందుకు సాగని పనులు
● వసతి సమస్య ఎదుర్కొంటున్న
విద్యార్థులు, సిబ్బంది
● గిరిజనులకు కార్పొరేట్
వైద్యంపై ప్రభావం
ఆశయానికి కూటమి తూట్లు
పాడేరులో వైద్య కళాశాలను గొప్పగా ప్రారంభించి, గిరిజనులకు అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ వైద్యం అందించాలన్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వైద్య కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బిల్లులు చెల్లింపులతో పాటు భవన నిర్మాణాల పర్యవేక్షణలోను ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అన్యాయం. రానున్న మూడు నెలల్లో అయినా ఆస్పత్రి భవనంతో పాటు మిగతా పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే
పనుల్లో నిర్లక్ష్యంపైప్రభుత్వానికి లేఖ
వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ఇతర సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖమంత్రితో పాటు ప్రభుత్వానికి లేఖ రాశాం. వైద్య కళాశాలను గత ఏడాది 50 సీట్లతో ప్రారంభించిన ప్రభుత్వం, పెండింగ్ భవన నిర్మాణాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు లేవు. వైద్యులు కూడా వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి భవన నిర్మాణాలు చురుగ్గా జరగడం లేదు.ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – కె.అజశర్మ, కన్వీనర్,
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
సాక్షి,పాడేరు: జిల్లాకేంద్రమైన పాడేరులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టిన వైద్య కళాశాలపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. 2021లో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో గత ప్రభుత్వం శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఎన్సీసీ నిర్మాణ సంస్థ భవన నిర్మాణ పనులను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటి నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టకపోవడంతో నత్తనడకన తలపిస్తున్నాయి. తొలి ఏడాది 50 సీట్లతో కళాశాల ప్రారంభమైంది. ఇప్పటివరకు ఓ బ్లాక్ పనులు, వీరి హాస్టల్కు సంబంధించి హాస్పటల్ బ్లాక్లోని కొన్ని గదులను సిద్ధం చేసి తాత్కాలికంగా వినియోగిస్తున్నారు.
ఎక్కడికక్కడ అసంపూర్తిగా..
వైద్య కళాశాలకు అనుబంధంగా 500 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రధాన సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు అంతస్తుల భవనాలకు శ్లాబ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రస్తుతం వైద్యకళాశాల కళాశాల తరగతులు నిర్వహించే బ్లాక్లో పెండింగ్ పనులు, వైద్యులు, సిబ్బంది నివాస గృహాలు, విద్యార్థుల వసతి గృహ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కూలీలు దొరక్క..
పూర్తిస్థాయిలో కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోంది. గత డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని బ్లాక్ల నిర్మాణాలు పూర్తి అవుతాయని అందరూ భావించినప్పటికీ కేవలం 40శాతం మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. దీనివల్ల ఈ ఏడాది కూడా ఆస్పత్రి ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు.
పేరుకుపోయిన బకాయిలు
వైద్యకళాశాల భవన నిర్మాణాలకు సంబంధించి బిల్లుల బకాయిలు పేరుకుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మాణ సంస్థ ఎన్సీసీకి రూ.20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్లే భవన నిర్మాణ పనులు చురుగ్గా జరగకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.

ఇంత.. నిర్లక్ష్యమా?

ఇంత.. నిర్లక్ష్యమా?

ఇంత.. నిర్లక్ష్యమా?