
వెబ్ కౌన్సెలింగ్ వద్దంటూ టీచర్ల ఆందోళన
రాజవొమ్మంగి: బదిలీ ప్రక్రియలో వెబ్ కౌన్సెలింగ్ వద్దని, దీనిపై ఇప్పటికే బహిష్కరించామని యూటీఎఫ్కు చెందిన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. శనివారం స్థానిక విద్యావనరుల కేంద్రం వద్ద వారు మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికకు ప్రభుత్వం ఇచ్చిన హామీకి భిన్నంగా సెకండరీ గ్రేడ్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ బదిలీలకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధపడటం అన్యాయమని ఖండించారు. ఇచ్చిన హామీ ప్రకారం బదిలీ ప్రక్రియ మాన్యువల్గానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ మండలశాఖ ప్రధాన కార్యదర్శి కానెం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మిరియాల రమేష్, ఎఫ్డబ్ల్యూఎస్ బోర్డు డైరెక్టర్ దాసరి పైడిమల్లు, జిల్లా మహిళాకార్యవర్గ సభ్యురాలు బి. వెంకటలక్ష్మి, సభ్యులు రాంబాబు, రాజుబాబు, లక్ష్మణరావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
గంగవరం: ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇచ్చిన హామీకి భిన్నంగా బదిలీ కౌనెలింగ్ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యూటీఎఫ్ మండల ప్రతినిధులు సీహెచ్ వెంకటేశ్వరరావు, కుసుమ కుమారి తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. అధికారులు తీరు మారకుంటే ఆదివారం పెద్ద సంఖ్యలో జిల్లావిద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.