
సీలేరు నదిలో యువకుడి గల్లంతు
మోతుగూడెం : స్నేహితులతో విహారయాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు సీలేరు నదిలో స్నానాలు చేస్తుండగా గల్లంతయ్యాడు. నలుగురు యువకులను పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు శనివారం ఇక్కడికి సమీపంలోని పొల్లూరు ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఉదయం 9 గంటలకు చేరుకున్న వారు సీలేరు నది ఒడ్డున వంటలు చేస్తూ స్నానాలు చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత మళ్లీ సీలేరు నది మధ్యలోకి పి.సుధీర్, ఏ. నాగేంద్ర, రామకృష్ణ, ప్రభు, అభిలాష్ వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా ఆకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరగడంతో నదిలో చిక్కుకుపోయారు. వీరిలో అభిలాష్ (18) కొట్టుకుపోయాడు. మిగతా నలుగురు నది మధ్యలో బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సాధిక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏపీ జెన్కో అధికారులకు సమాచారం అందించడంతో నదిలోకి నీటి విడుదలను తగ్గించారు. వెంటనే ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది తాళ్లు సాయంతో నలుగురు యువకులను ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోయిన అభిలాష్ ఆచూకీ శనివారం సాయంత్రం వరకు లభ్యం కాలేదు. దీంతో అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విహారయాత్రకు వచ్చిన యువకులంతా తాపీమేసీ్త్రలుగా పనిచేస్తున్నారు. ఇలావుండగా కొద్దిరోజుల క్రితం సీలేరు నదిలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురు యువకులను ఎస్ఐ సాధిక్ ఆధ్వర్యంలో సిబ్బంది రక్షించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విహార యాత్రకు వచ్చి సీలేరు నదిలో దిగి ప్రమాదానికి గురవడం బాధాకరంగా ఉందన్నారు. విహార యాత్రకు వచ్చిన వారు ఒడ్డున స్నానాలు చేయకుండా నది మధ్యలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారన్నారు. త్వరలోనే సీలేరు నది ఒడ్డున ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రవాహంలో చిక్కుకున్న నలుగురిని తాళ్ల్ల సాయంతో రక్షించిన స్థానిక పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి విహారయాత్రకు వచ్చిన తాపీమేసీ్త్రల బృందం
నది మధ్యలోకి దిగి స్నానాలు చేస్తుండగా ప్రమాదం
నది మధ్యలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు గల్లంతైన అభిలాష్

సీలేరు నదిలో యువకుడి గల్లంతు