
త్వరితగతిన ఆక్రమణలు తొలగించాల్సిందే
పాడేరు : పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా అధికమైన ఆక్రమణలను సంబంధిత అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేసి త్వరితగతిన తొలగించాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఏజెన్సీ వ్యాప్తంగా ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని కలెక్టర్ దినేష్కుమార్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటలకు ఆయన వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులతో కలిసి పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. గంటన్నర పాటు అక్కడే ఎదురు చూసినా ఆక్రమణల తొలగింపు మొదలవ్వలేదు. దీంతో ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం గత వారం కేవలం 16 మంది ఆక్రమణదారులకు మాత్రమే నోటీసులు ఇచ్చి ఆక్రమణలను తొలగించామని, త్వరలో మిగిలిన వారికి నోటీసులు ఇచ్చి సోమవారం నుంచి తొలగింపు ప్రక్రియ చేపడుతామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు స్థానికులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణల తొలగింపుపై కలెక్టర్ దినేష్కుమార్ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. గతవారం తొలగింపు కార్యక్రమం చేపట్టి శనివారం చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పలువురు వర్తకులు, వ్యాపారులకు వెంటపెట్టుకొని ఐటీడీఏ వద్ద ఐటీడీఏ ఇంచార్జీ పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ వద్దకు వెళ్లి చర్చలు జరిపి 35 అడుగుల వరకు మాత్రమే తొలగించాలని హుకుం జారీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆక్రమణలు పెరిగిపోవడంతో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని దీంతో అత్యవసర సమాయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు మధ్య నుంచి అటూ ఇటూ 50 అడుగుల చొప్పున ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అభివృద్ధిని అడ్డుకోవడం లేదన్నారు. సోమవారం నుంచి ఆక్రమణలు తొలగించకపోతే తాము స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంపరాయి దిలీప్కుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కూడ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస
విశ్వేశ్వరరాజు డిమాండ్
హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచన
లేకుంటే గిరిజనులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిక

త్వరితగతిన ఆక్రమణలు తొలగించాల్సిందే