
● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’ భారం ● ఇష్టానుసారంగా బడి ఫ
ఆదిలాబాద్టౌన్: జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల్లో దడ పుడుతుంది. పాఠశాలలు ఇక పునఃప్రారంభం కానుండడంతో పుస్తకాలు, యూనిఫాం, ఫీజులు పేరిట వారిపై అదనపు భారం పడనుంది. మరో వైపు వర్షాకాలం సీజన్ షురూ కావడంతో రైతులు సాగుపై దృష్టి సారిస్తున్నారు. దుక్కిదున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు పనుల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఓ వైపు పిల్లల చదువులు, మరో వైపు సాగు పెట్టుబడి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్లో ఎల్కేజీ, యూకేజీలకే వేలాదిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువులకు సైతం భారీగా ఖర్చు పెట్టా ల్సి వస్తోంది. అయినా సరే తమ పిల్లలను ప్రైవేట్లో ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్తు అందించాలని సామాన్యులు కలలు కంటున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అందినకాడికి దండుకుంటున్నాయి. డొనేషన్లు,ఫీజుల పేరిట ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. జీవో నం.1కు తూట్లు పొడుస్తూ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాయి. నామమాత్రమైన పేరెంట్ కమిటీలు ఆ పాఠశాలలకు కొమ్ముకాయడంతో ‘ఫీ’జులుం సాగుతుంది. విద్యా శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి.
అందినకాడికి దండుకోవడమే..
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార సంస్థలుగా మారాయి. అడ్డగోలు ఫీజుల వసూలుతో పాటు యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్లు, టై, బెల్టు, షూ ఇలా ప్రతీది విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బడి ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు జిల్లాకేంద్రంలో వారు సూచించిన బుక్స్టాల్, బట్టల షాపుల్లోనే కొనుగోలు చేయాలని చీటీలు అందిస్తున్నారు. అక్కడ తప్పితే మరోచోట కొనుగోలు చేయవద్దని హుకుం జారీ చేస్తున్నారు. ఆ పుస్తకాలు మిగతా స్టోర్లలో దొరక్కపోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. 1వ తరగతి చదివే విద్యార్థుల నోట్, పాఠ్య పుస్తకాాలకే రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వెచ్చించాల్సిన దుస్థితి. ఇంత జరుగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యాపార సంస్థలుగా మారిన ప్రైవేట్ బడులు..
జిల్లాలో..
ప్రైవేట్ పాఠశాలలు 162
విద్యార్థులు 48,931
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు ఇలా..
తరగతి ఫీజు (రూ.లలో)
ఎల్కేజీ 20వేలు– 30వేలు
యూకేజీ 25వేలు– 30వేలు
ఒకటో తగరతి 30వేలు– 35వేలు
రెండో తరగతి 30వేలు– 35వేలు
మూడో తరగతి 35వేలు– 38వేలు
నాలుగో తరగతి 38వేలు– 40వేలు
ఐదో తరగతి 40వేలు– 42వేలు
ఆరో తగరతి 40వేలు– 45వేలు
ఏడో తరగతి 40వేలు– 45వేలు
ఎనిమిదో తరగతి 45వేలు– 50వేలు
తొమ్మిదో తరగతి 50వేలు– 60వేలు
పదో తరగతి 60వేలు– 70 వేలు
జిల్లాలో ప్రైవేట్ పాఠశాల్లో ఎల్కేజీ, యూకేజీ చదువులకే ఏడాదికి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ–టెక్నో, బీజీ, మోడల్, కాన్సెప్ట్, టెక్నో, గ్రామర్, ఐఐటీ, నీట్, జెఈఈ ఇలా తోక పేర్లు తగిలిస్తూ తల్లిదండ్రుల కలలను సొమ్ము చేసుకుంటున్నారు. హాస్టళ్లు కూడా ఏర్పాటు చేసి ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదు. అయినా కొన్ని పాఠశాలలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలల్లో కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇరుకు గదులు, క్రీడా మైదానం లేకపోవడం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, తదితర సౌకర్యాలు లేనప్పటికీ ఫీజుల వసూలులో మాత్రం వెనుకాడడం లేదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యాశాఖ అనుమతించిన బుక్స్టాల్లోనే పాఠ్య పుస్తకాలు విక్రయించాలి. ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు చేపడతాం.
– ఏనుగు శ్రీనివాస్రెడ్డి, డీఈవో
ప్రైవేట్ దోపిడీ అరికట్టాలి
అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులను అరికట్టాలి. విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు విక్రయిస్తున్నారు. అయినా అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు.
– గణేశ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి

● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’ భారం ● ఇష్టానుసారంగా బడి ఫ

● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’ భారం ● ఇష్టానుసారంగా బడి ఫ

● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’ భారం ● ఇష్టానుసారంగా బడి ఫ