-
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
USA Presidential Election 2024: ఒకే వేదికపైకి బైడెన్, క్లింటన్, ఒబామా!
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. బైడెన్కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి! -
USA presidential election 2024: మళ్లీ ఆ ఇద్దరే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో చివరకు మళ్లీ బైడెన్, ట్రంప్లే నిలిచారు. అధ్యక్ష పీఠం కోసం తమ తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్ధిత్వాలను బైడెన్, ట్రంప్ గెల్చుకున్నారు. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సాధించడం ద్వారా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున 81 ఏళ్ల జో బైడెన్లు తమ అభ్యర్దిత్వాన్ని ఖరారుచేసుకున్నారు. తాజాగా జార్జియాలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీలో గెలిచి ఇప్పటిదాకా బైడెన్ 2,099 డెలిగేట్ల ఓట్లను సాధించారు. మొత్తం 3,933 ఓట్లలో 1,968 ఓట్లు వచ్చినా అభ్యర్ధిత్వం ఖరారు అవుతుంది. ఇప్పటికే బైడెన్ ఆ సంఖ్యను దాటేయడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఆగస్ట్లో చికాగోలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం సాధించాలంటే కనీసం 1,215 ఓట్లు గెలవాలి. ట్రంప్ ఇప్పటిదాకా మొత్తంగా 1,228 ఓట్లను గెల్చుకున్నారు. జూలైలో మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. మంగళవారం నాటి ప్రైమరీలో గెలవడం ద్వారా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున వరసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2020 నాటి ప్రత్యర్థులే మళ్లీ అధ్యక్ష సమరంలో గెలుపు కోసం పోరాడుతున్నా ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశాలు, ప్రచార అస్త్రాలు మారాయి. ఆనాడు ట్రంప్పై ఎలాంటి కేసులు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్ మెడకు 91 కేసులు చుట్టుకున్నాయి. ఎవరికి ఓటేస్తారు?: బైడెన్ మంగళవారం నాటి ప్రైమరీ గెలుపు తర్వాత బైడెన్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? లేదంటే కూలదోస్తారా?. స్వేచ్ఛ, ఎన్నుకునే హక్కులను పునరుద్దరించుకుందామా? లేదంటే వాటిని అతివాదులకు అప్పగిద్దామా?’’ అని పరోక్షంగా ట్రంప్ను విమర్శిస్తూ బైడెన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్ను గద్దె దించాల్సిన సమయమొచ్చింది అని ట్రంప్ సైతం ఒక వీడియో సందేశంలో రిపబ్లికన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. డెమొక్రటిక్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు జో బైడెన్ 2,099 ఇతరులు 20 జేసన్ పామర్ 3 రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు ట్రంప్ 1,228 నిక్కీ హేలీ 91 రాన్ డీశాంటిస్ 9 వివేక్ రామస్వామి 3 -
దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్!
సుమారు ఏడు దశాబ్దాల తర్వాత ఆసక్తికర ఘట్టానికి అగ్రరాజ్యపు అధ్యక్ష ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. వరుసగా రెండోసారి కూడా.. అధ్యక్ష ఎన్నికల్లో అదే ఇద్దరు అభ్యర్థులు తలపడబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్.. నవంబర్ 5వ తేదీన జరగబోయే 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది!. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థితత్వం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి నిలబడబోతున్నారు. నామినేషన్కు అర్హత సాధించాలంటే బైడెన్కు 1,968 డెలిగేట్స్ మద్దతు అవసరంకాగా.. ఆ ఫిగర్ను ఆయన దాటేశారని సమాచారం. తాజాగా వెలువడుతున్న ప్రైమరీ ఫలితాల్లో.. జార్జియా విజయంతో బైడెన్ ఆ ప్రతినిధుల సంఖ్యను అధిగమించేశారని తెలుస్తోంది. మరోవైపు మిసిస్సిప్పి, వాషింగ్టన్, నార్తన్ మరియానా ఐల్యాండ్స్ ఫలితాల్లోనూ బైడెన్ పైచేయి సాధించవచ్చని అమెరికా మీడియా అంచనా వేస్తోంది. 1952, 1956 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి డ్వైట్ D. ఐసెన్హోవర్.. మాజీ ఇల్లినాయిస్ గవర్నర్(డెమొక్రటిక్) అడ్లై స్టీవెన్సన్ను రెండుసార్లూ ఓడించారు. తొలిసారి కంటే కంటే రెండో దఫా అధ్యక్ష ఎన్నికల్లో ఐసెన్హోవర్ మెరుగైన ఫలితంతో ఘన విజయం సాధించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు డొనాల్డ్ ట్రంప్నకు 1,215 మంది ప్రతినిధులు అవసరం. అయితే ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం.. సోమవారం నాటికి ట్రంప్కు 139 మంది అదనపు ప్రతినిధులు అవసరం. అయితే జార్జియా, హవాయి, మిస్సిస్సిప్పి వాషింగ్టన్ రాష్ట్రాల్లో 161 మంది ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్ట్ ట్రంప్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. వరుసగా రాష్ట్రాల్లో ప్రైమరీ ఫలితాల్లో విజయం సాధిస్తూ సమీప పత్యర్థి నిక్కీ హేలీపై ట్రంప్ పైచేయి సాధించారు. 15 రాష్ట్రాల్లో 14లో ఆయన విజయం సాధించగా.. గత మంగళవారం నాటి ఫలితాల తర్వాత హేలీ తన ప్రచారాన్ని ముగించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవడానికి, పరోక్ష ఎన్నికలు(ప్రైమరీ) నిర్వహించడం అక్కడ ఆనవాయితీ. ఇక్కడ ఓటర్లు ప్రతి పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధుల్ని నిర్ణయిస్తారు. ఆపై ఈ ప్రతినిధులు తమ తమ పార్టీల అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ప్రైమరీలలో.. పార్టీ అధ్యక్ష నామినేషన్ను గెలవడానికి అభ్యర్థులకు సమావేశంలో ప్రతినిధుల ఓట్లలో మెజారిటీ అవసరం. అయితే.. నాలుగేళ్లకొకసారి అమెరికాలో జరిగేవి ప్రత్యక్ష ఎన్నికలే. అంతిమంగా బరిలో నిలిచే ఇరు పార్టీల అభ్యర్థులకు ఓట్లేసేది మాత్రం ప్రజలే. -
కొరకరాని కొయ్య ట్రంప్!
ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్నీ, ఆ తర్వాత అధ్యక్ష స్థానాన్నీ డోనాల్డ్ ట్రంప్ గెల్చుకోవటం ఖాయమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగే ఎన్నికలో బ్యాలెట్ పత్రంపై ట్రంప్ పేరు తొలగించాలన్న ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తోసిపుచ్చటం ఆయనకు కొత్త శక్తినిస్తుందనటంలో సందేహం లేదు. ‘సూపర్ ట్యూజ్డే’ కింద మంగళవారం ఒకేసారి పదిహేను రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఎన్నికలు జరగనుండగా ఒకరోజు ముందు ఈ తీర్పు వెలువడింది. ట్రంప్ ఇప్పటికే అయోవా, న్యూహాంప్షైర్, నెవడా ప్రైమరీలను గెల్చుకోవటంతోపాటు తన ప్రత్యర్థి హేలీకి బలం వుంటుందని భావించిన ఆమె స్వస్థలం సౌత్ కరోలినాలో సైతం సత్తా నిరూపించుకున్నారు. ‘సూపర్ ట్యూజ్డే’ పోలింగ్లో సైతం ఆయనదే పైచేయి అని ప్రాథమిక సమాచారం చెబుతోంది. అయితే రకరకాల కేసుల్లో చిక్కుకుని వాటినుంచి బయటపడటానికి అనుసరించాల్సిన వ్యూహంపై న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపాల్సిరావటం, న్యాయస్థానాలకు హాజరుకావటం ట్రంప్ ప్రచారాన్ని దెబ్బతీస్తోందనే చెప్పాలి. న్యాయస్థానాలకు సెలవు దినాలైన శని, ఆదివారాల్లో మాత్రమే ఆయన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో సైతం సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. ప్రసంగాలకు బదులు కరచాలనాలతో సరిపెడుతున్నారు. అయితే ఇదంతా ట్రంప్ స్వయంకృతం. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు లభించిన విజయాన్ని డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందని ఆరోపిస్తూ కాపిటల్ హిల్పైకి మద్దతుదార్లను ఉసిగొల్పి విధ్వంసానికి కారకులయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆ భవన సముదాయాన్ని మూకలు చేజిక్కించుకున్నాయి. ఆయన ప్రత్యర్థి, డెమాక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించటానికి 2021 జనవరిలో అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఆ దాడి దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరిచింది. నిజానికి ఈ కేసులోనే కొలరాడో సుప్రీంకోర్టు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అర్హతను ట్రంప్ కోల్పో యారని తీర్పునిచ్చింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చిన ఎవరైనా అందుకు భిన్నంగా తిరుగుబాట్లను రెచ్చగొడితే భవిష్యత్తులో పదవులు చేపట్టటానికి అనర్హులవుతారని చెప్పే రాజ్యాంగం 14వ సవరణలోని సెక్షన్ 3కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మెయిన్, ఇల్లి నాయీ సుప్రీంకోర్టులు సైతం ఇలాగే నిర్ణయం తీసుకునే అవకాశం వున్నదని అందరూ అనుకున్నారు. కానీ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో అవి నిలిచిపోయాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులపై ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటే... అవి పరస్పర విరుద్ధంగా వుంటే ఒకరకమైన అరాచకానికి దారితీస్తుందని ధర్మాసనంలోని తొమ్మిదిమంది న్యాయ మూర్తులూ భావించారు. వీరిలో ఆరుగురు మితవాద న్యాయమూర్తులైతే మరో ముగ్గురు ఉదార వాదులు. దేశమంతటికీ వర్తించేలా పార్లమెంటు మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఉద్దేశం. అయితే పార్లమెంటు ఉభయసభలైన సెనేట్, ప్రతినిధుల సభల్లో అధికార విపక్షాలిద్దరికీ చెరోచోటా ఆధిక్యత వున్నప్పుడు సమస్య మరింత జటిలంగా మారుతుంది. ట్రంప్ అధ్యక్ష పదవి గెల్చుకున్నాక దాన్ని ధ్రువీకరించటానికి నిర్వహించే పార్లమెంటు సమావేశం కాస్తా ఆయన ఎన్నికను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయన్నది ఊహాతీతం. కాపిటల్ హిల్పై దాడికి సంబంధించి ట్రంప్పై నాలుగు వేర్వేరు కేసులు విచారణలో వున్నాయి. వాటిల్లోని దాదాపు 93 ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ఆ నేరాలు తాను చేయలేదనటం మాత్రమే కాదు... ఇవన్నీ పదవిలో వుండగా వచ్చిన ఆరోపణలు కనుక అధ్యక్షుడిగా తనకు రక్షణ వుంటుందంటున్నారు. అధ్యక్ష పదవిలో వున్న నాయకుడిపై క్రిమినల్ నేరారోపణలు రావటం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. కాపిటల్ హిల్పై దాడికి ఆయన పిలుపు ఇచ్చివుండొచ్చుగానీ, ఆయన స్వయంగా ఈ దాడిలో పాల్గొనలేదన్నది ట్రంప్ న్యాయవాదుల వాదన. ఈ విషయంలో దేశ సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. వాస్తవానికి వచ్చే నెల 22న సుప్రీంకోర్టు దీనిపై విచారణను ప్రారంభించాలి. కానీ ప్రతి దశలోనూ ఏదో ఒక అభ్యంతరంతో అడ్డుకుంటున్న ట్రంప్ న్యాయవాదులు దాన్ని సజావుగా సాగనిస్తారా అన్నది చూడాల్సివుంది. అయితే ట్రంప్ కష్టాలు ఈ కేసుతో తీరిపోతాయనడానికి లేదు. ఆయన చుట్టూ మరిన్ని కేసులున్నాయి. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ తనపై ఆరోపణలు చేయకుండా వుండటానికి ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారన్న అభియోగం అందులో ఒకటి. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఆయన 50 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని సమీకరించటానికి ఆయన పాట్లు పడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలు సేకరించటం సరేసరి. ఇదిగాక ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కాలమిస్టు జీన్ కరోల్ ఆరోపించారు. అందులో 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించగా, ఆమె పరువు ప్రతిష్ఠలు దెబ్బతీశారన్న ఆరోపణకు సంబంధించి 8 కోట్ల 30 లక్షల డాలర్లు ఇవ్వాలని మరో కోర్టు నిర్ణయించింది. వీటిపై అప్పీళ్లకు వెళ్లదల్చుకున్నారు. జనంలో వరస విజయాలు సాధిస్తున్న ట్రంప్ను న్యాయస్థానాల ద్వారా నిరోధించే డెమాక్రాటిక్ పార్టీ వ్యూహం వారికి ఏమేరకు లాభిస్తుందో వేచిచూడాలి. -
అమెరికా రాజకీయాల్లో భారతీయులు
సిద్ధాంతపరంగా అమెరికా రెండు పార్టీల రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది. కానీ ఆచరణలో, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెండూ తమలో తామే సంకీ ర్ణాలుగా ఉంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ దాని ఆధిపత్య స్థానంలోని కరడుగట్టిన మితవాదులకూ, పార్టీ లోపలే తమ వాణిని అట్టిపెట్టుకోవడానికి ఘర్షణ పడుతున్న గతకాలపు సంప్రదాయవాదులకూ మధ్య గొప్ప అంతర్యుద్ధానికి సాక్షీభూతంగా ఉంది. ఇక డెమోక్రటిక్ పార్టీ శిబిరం...సెంట్రిస్టులు, సెంటర్– లెఫ్టిస్టులు, లెఫ్టిస్టులకు నిలయంగా ఉంటోంది. అయితే, మితవాద పక్షం నుంచి ప్రగతిశీల వామపక్షాల వరకు, అమెరికాకు చేతనత్వం కలిగిస్తున్న ఐదు రాజకీయ పక్షాలలోనూ భారతీయ అమెరికన్ నాయకులు ప్రధాన పాత్రధారులుగా ఉండటమే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. కరుడుగట్టిన మితవాదం (ఫార్–రైట్)తో ప్రారంభిద్దాం. ఈ రాజకీయ ధోరణి, కింది విధానాలను కలిగివుంది. 1.కార్పొరేట్ పన్ను తగ్గింపుల ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతను నిర్మించడంపై అమెరికా దృష్టి కేంద్రీకరించాలి. ఇంధన వాడకాన్ని ఎంతకైనా పెంచాలి. ఇప్పటికే ఉన్న ట్రేడింగ్ ఏర్పాట్లపై పూర్తిగా తిరోగమించాలి. 2. అమెరికా తన అంతర్జాతీయ కట్టుబాట్లను తగ్గించుకోవాలి. ఐరోపా నుండి వెనక్కి తగ్గాలి. ఎక్కువగా చైనాపై దృష్టి పెట్టాలి. 3. అమెరికా తన సరిహద్దులను పటిష్టంగా కాపాడు కోవాలి. సామాజిక జనాభా మార్పులు సంఘర్షణలను ఆహ్వానిస్తున్నాయి. వలసదారులు శ్వేత క్రైస్తవ జనాభా రాజకీయ ఆధిపత్యానికి కలగబోయే ముప్పును సూచిస్తున్నారు. 4. అమెరికా ‘మేలుకొలుపు’ (వోకిజం) రాజకీయాలను తిప్పికొట్టాలి. అవి లైంగికత లేదా జాత్య హంకారంపై విద్యా బోధన లేదా నిశ్చయాత్మక చర్య లేదా యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు వంటివి ఏవైనా కావచ్చు. 5. అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం, నిఘా సంస్థలు రాజకీయంగా రాజీ పడ్డాయి. వీటి సిబ్బందిని తగ్గించడంతో సహా నాటకీయంగా రీబూట్ చేయడం అవసరం. డోనాల్డ్ ట్రంప్ ఈ ధోరణికి నిజమైన మార్గదర్శకుడు, ముఖ చిత్రం కూడా. అయితే, ఈ రోజు ఈ ఉద్యమం తదుపరి తరం ముఖా లలో వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. నిజానికి, వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ రాజకీయ కార్యాచరణ సమావేశంలో, ట్రంప్ ఉపాద్యక్షుడి ఎంపికగా రామస్వామి కూడా ఫేవరెట్లలో ఒకరుగా ఉద్భ వించారు. మధ్యేవాద–సంప్రదాయవాద ధోరణిని పరిశీలిద్దాం. ఈ అంతరి స్తున్న మితవాద రిపబ్లికన్ ల తరం మూడు కీలక అంశాలలో, కరుడు గట్టిన మితవాదం నుండి భిన్నంగా ఉంటుంది. 1. అంతర్జాతీయ కట్టు బాట్ల పరంగా, అమెరికా బలం... పొత్తులపై, ‘నాటో’ కూటమి పట్ల నిబద్ధతపై, భాగస్వామ్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ స్కూల్ విశ్వసిస్తుంది. ఐరోపాలో రష్యా సవాలును, ఇండో–పసిఫిక్లో చైనా సవాలును, పశ్చిమాసియాలో ఇరాన్ను అమెరికా కలిసి ఎదుర్కోవాలని నమ్ముతుంది. 2. సంస్కృతీ యుద్ధాల పరంగా – మితవాద రిప బ్లికన్ లు అబార్షన్, తుపాకీ హక్కులు, విద్యపై పార్టీ ఎజెండాతో సరిపెట్టుకుంటారు. అన్నింటికీ మరీ ఎక్కువ ఆందోళన చెందకుండా విభిన్న దృక్కోణాల పట్ల అంగీకారంగా ఉంటారు. 3. మితవాద రిప బ్లికన్ లు అమెరికన్ సంస్థలపై విశ్వాసం కలిగి ఉంటారు. అలాగే ప్రజా స్వామ్య నియమాలకు కట్టుబడి ఉంటారు. ఇది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ మీద జనవరి 6న జరిగిన మూక దాడి సమర్థకుల నుండి వైరుధ్యాన్ని సూచిస్తుంది. సెనేట్లో మిచ్ మెక్కానెల్ ఈ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, నిక్కీ హేలీ ఇప్పుడు మితవాద రిపబ్లికన్ పార్శా్వనికి ప్రజా ముఖంగా ఉన్నారు. ఆమె అయోవా, న్యూ హాంప్షైర్ ప్రైమరీలలో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. తన సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనూ ఓడారు. నెవాడాలో అయితే ‘ఈ అభ్యర్థులు ఎవరూ కారు’ విభాగంలో పోల్ అయిన ఓట్ల కంటే తక్కువ ఓట్లను పొందడం అనేది ఈ భావజాలం ఈరోజు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉందో చూపి స్తుంది. కానీ మొత్తంగా నియోజకవర్గాల పరంగా ఈ వర్గం ప్రభావం చూపుతుంది. న్యూ హాంప్షైర్లో హేలీకి వచ్చిన 43 శాతం ఓట్లు, సౌత్ కరోలినాలో వచ్చిన 39 శాతం ఓట్లలో ఇది కనిపిస్తుంది. గెలవడానికి సరిపోదు కానీ, ఈ వర్గాలు ఇంటిలోనే ఉంటే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్ అవకాశాలు నాటకీయంగా మసక బారుతాయి. డెమోక్రాట్లలో సెంట్రిస్టులు, సెంటర్ లెఫ్టులు, లెఫ్టులు... ఇక మనం డెమోక్రటిక్ పార్టీ శిబిరానికి మరలుదాం. డెమోక్రటిక్ సెంట్రిస్ట్లకు, సెంటర్–లెఫ్ట్కు అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వం వహిస్తున్నారు. వివిధ ప్రపంచ రంగాల్లో అమెరికా పాత్రకు సంబంధించి మధ్యేవాద రిపబ్లికన్ల నిబద్ధతను ఈ స్కూల్ కూడా పంచుకుంటుంది. ఇది కరుడుగట్టిన మితవాద, ప్రగతిశీల భావజాలాలు రెండింటినీ కలుపుకొని, అమెరికాలో పెట్టుబడి వికాసంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని నడిపించింది. ఇది అబార్షన్ హక్కులపై ప్రగతిశీల దృక్ప థాన్ని కనబరుస్తుంది. అయితే దీనిని ప్రజారోగ్య సమస్యగా, మహిళల హక్కుల సమస్యగా చూస్తుంది. ఇది నిర్మాణాత్మక జాతి వివక్షను గుర్తిస్తుంది కానీ పెరుగుతున్న సంస్కరణలను కూడా విశ్వసిస్తుంది. అధిక లోటును దృష్టిలో ఉంచుకుని సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించేందుకు ఇది కట్టుబడి ఉంది. వలసలపై, మరింత కఠినమైన చట్ట అమలు, మరింత మానవీయ విధానం రెండింటి మధ్య సమ తుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. భారతీయ అమెరికన్లలో, ఇల్లినాయికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మధ్యేవాది(సెంట్రిస్ట్). కానీ సిలికాన్ వ్యాలీ నుండి హౌస్ రిప్రజెంటేటివ్గా ఉన్న రో ఖన్నా మాత్రం సెంటర్–లెఫ్ట్ వర్గా నికి చెందిన అత్యంత ప్రముఖ హక్కుదారు. ఆయన మధ్యేవాదులకు, అభ్యుదయవాదులకు కుడివైపున ఉన్న స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. పైగా 2028లో అధ్యక్ష ఎన్నికల కోసం తానూ ఒక రాయి విసరాలని భావిస్తున్నారు. మార్కెట్కు సాంకేతిక పరిజ్ఞానం, మధ్య అమెరికాలో శ్రామిక వర్గానికి ఆర్థిక దేశభక్తి గురించి ఈయన మాట్లాడతారు. బహుళవాదం, మైనారిటీలకు ప్రాతినిధ్యం గురించి మాట్లాడతారు. చైనాపై కఠినమైన జాతీయ భద్రతా చర్యలు, గాజాలో కాల్పుల విరమణ, కార్పొరేట్ దోపిడీ, ప్రచార సంస్కరణల భాష గురించి కూడా మాట్లాడతారు. చివరగా, ప్రగతిశీల ధోరణిలోకి వెళ్లి చూడండి. వారు తమ సొంత అంతర్గత వైరుధ్యాలను కలిగి ఉన్నప్పటికీ, విస్తృతంగా చెప్పా లంటే, ప్రగతిశీలురు స్వేచ్ఛా వాణిజ్యంపై సందేహాస్పదంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ చర్యలను సైనిక–పారిశ్రా మిక సముదాయం నడపడాన్ని వ్యతిరేకిస్తారు. అసమానత, దాన్ని ఎదుర్కొనే విధానపరమైన నిర్ణయాల్లో జాతి, లింగవివక్షలను ప్రాథమిక అంశాలుగా తీసుకుంటారు. కార్పొరేట్ అధికారానికి బలమైన ప్రత్యర్థులు. అధిక పన్నుల ప్రతిపాదకులకు వ్యతిరేకులు. తీవ్రమైన వాతావరణ విధాన రక్షకులు. ప్రపంచంలోని మానవ హక్కుల వంటి సమస్యలపై మరింత చురుకైన అమెరికన్ జోక్యానికి లాబీయిస్టులు. ఈ విభాగంలోని ప్రముఖ ముఖాలు దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, హౌస్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్ ప్రమీలా జయపాల్. పురోగామి విశ్వాసాలను కమలా హారిస్ పంచుకుంటున్నప్పటికీ, విదేశాంగ విధా నాల విషయంలో మాత్రం ఆమె సెంట్రిస్ట్ వైఖరికి మారినట్టు కనిపిస్తోంది. ఈ ఐదు రకాల ధోరణులు... అమెరికా రాజకీయాలు ఈరోజు ఎందుకు సందడిగా విభజించబడి ఉన్నాయో, పైగా మునుపెన్నడూ లేనంత సంక్లిష్టంగా ఎందుకు ఉన్నాయో వివరించడంలో సహాయ పడవచ్చు. పైగా భారతీయ అమెరికన్లు అక్కడ తమ కొత్త నేల భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యబద్ధంగా, తరచుగా ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రైమరీలను వేడెక్కిస్తున్న భారతీయులు
నార్త్ కరొలైనా మాజీ గవర్నరు నిక్కీ హేలీ, 38 ఏళ్ల పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడటం! రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీకి నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమెరికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకిది ముందరి ఏడాది కావడంతో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ‘ప్రైమరీ’లు (ప్రాథమిక ఎన్నికలు) రాజకీయ వాతావర ణాన్ని వేడెక్కిస్తున్నాయి. యూఎస్లో 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. యూఎస్ మొత్తం జనాభాలో ఇది దాదాపుగా 1.3 శాతం. యూఎస్ కాంగ్రెస్లో గత దశాబ్ద కాలంలో ఐదుగురు భారత సంతతి అమెరికన్లు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నార్త్ కరొలైనా మాజీ గవర్నరు, ఐక్యరాజ్యసమితిలో యూఎస్ శాశ్వత ప్రతినిధి అయిన నిక్కీ రణ్ధవా హేలీ... రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ఆమె పాలనా సామర్థ్యానికి ఇప్పటికే అనేక నిరూపణలు ఉన్నాయి. బయోటెక్స్ స్టార్టప్ను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తున్న 38 ఏళ్ల భారతీయ సంతతి పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి కూడా ప్రస్తుతం వెలుగులో ఉన్నారు. అతడు డబ్బు వరదలో కొట్టుకుని పోతున్నవాడు. అమెరికా గుండెకాయగా పేర్గాంచిన మిడ్వెస్ట్ ప్రాంతంలో పెరిగి పెద్దవాడైనవాడు. ఐవీ లీగ్ ప్రావీణ్యాలతో పరిపుష్ట మైనవాడు. ప్రఖ్యాత మీడియా సంస్థలు ఆయన గురించి రాశాయి. ఆయన కథనాల్లో అతిశయోక్తి కనిపించవచ్చు. కానీ ఓటర్లు ఏం కోరు కుంటున్నారన్న విషయమై ఆయనకు చక్కటి అంచనా ఉంది. అత్యధిక సంఖ్యలో డెమోక్రాట్ల వైపున ఉన్న యూఎస్లోని ప్రవాస భారతీయులకూ, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ రామ స్వామి ఆలోచనలు గిట్టనివే కావచ్చు. పని ప్రదేశాలలో వైవిధ్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు. అదే సమయంలో వైవిధ్యభరిత మైన ఆలోచనలను ఇష్టపడతానని చెబుతుంటారు. వైవిధ్య వ్యతిరేక తకు ‘తెలివి’ని జోడించడం ఇది. రామస్వామి ఒక రాజ్యాంగ సవర ణను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రకారం 18–24 ఏళ్ల మధ్య వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే యూఎస్ ప్రభుత్వ స్వరూప స్వభావాలలోని ప్రాథమిక అంశాలపై వారెంత అవగాహ నను కలిగి ఉన్నారో నిర్ణయించే ‘సివిక్స్ టెస్ట్’ను ఉత్తీర్ణులై ఉండాలి. మళ్లీ ఇదొక పైకి మంచిగా కనిపించే కపటపూరితమైన ఆలోచన. ఈ వయఃపరిమితిలో ఉన్న జనాభాలో ఎక్కువమంది డెమోక్రాట్లకు మద్దతు ఇస్తుంటారు. రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చేవారిలో మధ్య వయస్కులు అత్యధికం. ‘సివిక్స్ టెస్ట్’ నిర్వహణ ద్వారా యువజనుల ఓటర్లలో తగ్గించగలిగినంత మందిని తగ్గిస్తే రిపబ్లికన్లకు ప్రయో జనం చేకూర్చవచ్చన్నది రామస్వామిలోని మరో ఆలోచనా వైవిధ్యం. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీగా నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమె రికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సాధారణంగా డెమోక్రాట్లకు ఓటు వేస్తుండే భారతీయ అమెరికన్లు ఎందుకని రిపబ్లికన్ పార్టీ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు? అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, పర్యవసాన వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తర ఫున పోటీ పడటం! ఈ సందర్భంలో ఎవరైనా యూఎస్కు భారతీ యుల వలస వెనుక ఉన్న ప్రత్యేక అంశాల మీద, వారు ఏ సామాజిక స్థాయుల నుంచి వలస వచ్చారనే దాని మీద దృష్టిపెట్టడం అవసరం. భారతీయుల వలసల్లోని మొదటి దశ ప్రధానంగా 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో శాన్ఫ్రాన్సిస్కోలోని ఆధునిక టెక్ హబ్ ద్వారా మొదలైంది. ఆసియా సంతతి వారిపై ఉన్న చట్టపరమైన పరి మితుల కారణంగా నాటి వలసదారులు సంఖ్యాపరంగా స్వల్పంగా ఉన్నారు. రైలు–రోడ్లు పనులు, కలప డిపోలు, వ్యవసాయ పొలాల్లో ఉపాధిని వెతుక్కున్నారు. ఆఖరికి కాంగ్రెస్ సభ్యుడు దలీప్ సింగ్ సౌంద్ కూడా 1924లో బర్కిలీలోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందినప్పటికీ, యూఎస్ ప్రభుత్వం పౌరసత్వాన్ని నిరాకరించిన కారణంగా 1949 వరకు రైతుగా పని చేయవలసి వచ్చింది. అమృత్సర్లో జన్మించిన దలీప్ 1956లో డెమోక్రాటిక్ పార్టీ టికెట్పై క్యాలిఫోర్నియా నుంచి యూఎస్ కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన మొదటి ఆసియా – అమెరికన్, మొదటి భారతీయ– అమెరికన్, మొదటి సిక్కు మతస్థుడు దలీప్. 1965 అక్టోబర్ 3న అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఇమిగ్రేషన్ బిల్లుపై సంతకం చేయడంతో ఆసియా దేశాల నుండి వచ్చే వలసలపై ఉన్న నిబంధనలు తొలగిపోయాయి. ఆ తర్వాత వలస వచ్చి తమ విజయాలతో గుర్తింపు పొందిన అనేక ఆసియా సమూ హాల పిల్లల్లో భారతీయ అమెరికన్ల సమూహంలోని పిల్లలు అధికంగా ఉన్నారు. ఇది భారతీయులలోని ఉన్నత విద్యావంతులు యూఎస్లో చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి తోడ్పడింది. వారిలో చాలామంది స్కాలర్షిప్లపై అక్కడికి వెళ్లారు. వారిని జర్న లిస్ట్ అనితా రాఘవన్ తన పుస్తకం ‘ది బిలియనీర్స్ అప్రెంటిస్: ది రైజ్ ఆఫ్ ది ఇండియన్ – అమెరికన్ ఎలీట్ అండ్ ది ఫాల్ ఆఫ్ గాలియన్ హెజ్ ఫండ్’లో ‘రెండుసార్లు ఆశీర్వదించబడిన తరం’గా చేసిన అభివర్ణన ఎంతో ప్రసిద్ధి చెందినది. యూఎస్ వలస చట్టాల సడలింపు వల్లా, స్వాతంత్య్రానంతరం విద్యారంగంపై భారత్ అపారంగా పెట్టు బడులు పెట్టడం వల్లా రెండు రకాలుగా లబ్ధి పొందిన తరం అది. 1995 తర్వాతి కాలంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏర్పడిన డిమాండు, ఆ తర్వాత వై2కె మైగ్రేషన్ ప్రాజెక్టుతో... వలసలు అకస్మాత్తుగా విస్ఫోట స్థాయిలో పెరిగాయి. దాంతో పాటుగా భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై యూఎస్లో ఆసక్తి ఏర్పడింది. ఇది చాలామంది ఆర్థిక నిపుణులకు ద్వారాలను తెరిచింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత అంశాలలో బలమైన నేపథ్యం, ఆంగ్ల భాషపై క్రియాత్మక అనర్గళత ఉండి హెచ్–1బి నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకుని అమెరికా వెళ్లినవారిలో దాదాపు 75 శాతం మంది భారతీయులే. వారిలో అనేకమంది దశాబ్ద కాల వ్యవధిలో అమెరికన్ పౌరులుగా మారారు. 2000 తర్వాత, లేదా గత 10 సంవత్సరాలలో వలసవెళ్లినవారు యూఎస్లో శాశ్వత నివా సులుగా ఉంటూ, ప్రస్తుతం పౌరసత్వం పొందే దారిలో ఉన్నారు. వలసల విశిష్టతల దృష్ట్యా భారతీయ అమెరికన్లు రెండు పార్టీల లోనూ ప్రాతినిధ్యం వహించే ధోరణి ఎంత ఎక్కువ మంది పౌరసత్వం పొందితే అంతగా పటిష్ఠం అవుతుంది. ఇతర మైనారిటీ సమూహాల పోరాటం చాలామంది యువ భారతీయ అమెరికన్ల జీవితాలలో ప్రతిబింబించదు. ఎందుకంటే వీరంతా ఉన్నత విద్యావంతులైన మొదటి తరం భారతీయ అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించినవారు. నాణ్యమైన విద్య, సమయపాలన, అందుబాటులో ఉన్న పర్యావరణ వ్యవస్థల మద్దతుతో ఈ యువ బృందం ఆర్థికంగా లాభదాయకమైన అనేక వృత్తిపరమైన రంగాలలో విజయం సాధించింది. జెనరేషన్ జడ్, లేదా మిలీనియల్ జనరేషన్ నుంచి కొందరు తక్కువ ఆదాయ పన్ను, ప్రైవేట్ హెల్త్ కేర్ వంటి విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఇతర మైనారిటీ సమూహాలకు భిన్నంగా సంక్షేమ పథ కాల పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండవచ్చు. భారతీయ అమెరికన్ల రాజకీయ పొత్తులు యూఎస్లోని ఇతర మైనారిటీ సమూహాల రాజ కీయాలపై మన అవగాహన నుండి ఉత్పన్నం అయినవైతే కాదు. లవ్ పురి వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ట్రంప్ ప్రాభవం మళ్లీ పెరిగేనా?
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీద పోటీకి దిగే రిపబ్లికన్ అభ్యర్థి ఎవరు? పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే ఉంటుందా? వారం రోజుల్లో రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక డిబేట్ మొదలవుతుంది. ఒక పోల్ ప్రకారం, 52.7 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్ను సమర్థిస్తుండగా, ఆయన సమీప పోటీదారు డసాంటస్కు 14 శాతం మందే మద్దతిచ్చారు. పైగా 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో తెచ్చినవని నమ్ముతున్నారు. ఏమైనా రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను తనకు అనుకూలంగా మలుచుకోగలిగే శక్తిమంతుడు ట్రంప్! 2022 నవంబర్లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, ప్రతినిధుల సభకు మొత్తం సభ్యు లనూ, సెనేట్లో మూడింట ఒక వంతు సభ్యులనూ అమెరికన్లు ఎన్ను కున్నప్పుడు– పాత రిపబ్లికన్ వ్యవస్థకు చెందినవారితోపాటు కొందరు డెమొక్రాటిక్ పండితులు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలకు ‘నివాళులు’ అర్పించారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ బలపరిచిన అభ్యర్థులు ఓడి పోయారు. 2020 ఎన్నికలు ‘దొంగిలించబడ్డాయని’ ట్రంప్ చేసిన ప్రక టనను బలపర్చినవారినీ, జో బైడెన్ చేతిలో ఓడిపోయినా అధికారంలో కొనసాగడానికి ట్రంప్ చేసిన దుస్సాహసిక ప్రయత్నానికి మద్దతు ఇచ్చినవారినీ ఓటర్లు స్పష్టంగా తిరస్కరించారు. ట్రంప్ తన పదవీ కాలంలో తన నామినీలతో నింపిన సుప్రీంకోర్టు గర్భస్రావాలపై ఇచ్చిన తీర్పు మీద మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రిపబ్లికన్ పార్టీ నుంచి మరో అధ్యక్ష అభ్యర్థి, ట్రంప్ అత్యంత సమీప పోటీదారు అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డసాంటస్ తాజాగా రెండోసారి కూడా గవర్నర్గా విజయం సాధించారు. పైగా రిపబ్లికన్ దాతలు, ఆయన ప్రభావవంతమైన మీడియా ఛాంపియన్లు ఇద్దరూ ట్రంప్కు దూరమయ్యారు. మరి ఈ కొన్ని నెలలు రాజకీయాల్లో ఎలాంటి తేడాను చూపగలవన్నది ప్రశ్న. రిపబ్లికన్ అభ్యర్థులు వచ్చే వారం అయోవాలో తమ మొదటి ప్రాథమిక డిబేట్కు వెళుతుండగా, ఈ రేసులో ట్రంప్ ఎంత సౌకర్య వంతమైన స్థానంలో ఉన్నారంటే, బహుశా ఆయన ఆ చర్చకు కూడా వెళ్లకపోవచ్చు. ‘ఫైవ్థర్టీయైట్.కామ్’ రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక పోటీల తాజా పోల్స్లో, 52.7 శాతం మంది ఓటర్లు ట్రంప్ను సమ ర్థించారు. 14 శాతం మంది మాత్రమే డసాంటస్కు మద్దతుగా నిలిచారు. ఇద్దరి మధ్యా ఆశ్చర్యకరంగా 38 శాతం తేడా ఉంది. వచ్చే వారం డిబేట్లో కనిపించే మిగతా వారందరూ – ప్రముఖంగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, మైక్ పెన్స్, క్రిస్ క్రిస్టీ, టిమ్ స్కాట్లకు ఈ పోల్లో 10 శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. చాలామందికి 5 శాతం కంటే తక్కువ వచ్చాయి. అయితే, ఏ రాజకీయ నేపథ్యం లేకుండా మొదటిసారి పోటీకి దిగుతున్న వివేక్ రామస్వామికి పెరుగు తున్న ఓటర్ల మద్దతు మాత్రం చెప్పుకోదగ్గది. ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న ప్రతి నేరారోపణ ఆయన పునాదిని బలోపేతం చేయడంలో సహాయపడింది. దాంతోపాటు బైడెన్ పరిపా లనకు వ్యతిరేకంగా రిపబ్లికన్లను ఇది సమైక్యపర్చింది. అయితే ఆయనపై ఆరోపించిన ప్రతి నేరాన్ని నిశితంగా చూస్తే, ట్రంప్ ఎంత ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒక శృంగార తారకు డబ్బు చెల్లించాలంటే తన వ్యాపార రికార్డులను తప్పుగా చూపడమే కాకుండా, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఆర్థిక చట్టాలను ఉల్లంఘించాల్సి ఉంటుందని ట్రంప్కు తెలుసు. ఆయినా ఆ మార్గంలోనే ముందుకు సాగారు. వైట్ హౌస్ నుండి జాతీయ భద్రతా రహస్యాలను దొంగిలించడం, వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం, వాటిని దాచమని తన వ్యక్తిగత సహాయకుడికి చెబుతూనే, ఆ పత్రాలు తన వద్ద లేవని అబద్ధం చెప్పడం కూడా చట్టవిరుద్ధమని ఆయనకు తెలుసు. దానిక్కూడా సిద్ధపడ్డారు. 2020 ఎన్నికల ఫలితా లను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సొంత కార్యాలయ సిబ్బందితోపాటు ప్రచార విభాగంలోని చాలామంది విశ్వసనీయమైన వ్యక్తులు ఆయన్ని హెచ్చరించారు. అయినా ఏడు రాష్ట్రాల నుండి మోసపూరిత ఓటర్ల జాబితాను సృష్టించారు, తన ఆదేశాలను పాటించని రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు, ఫలితాల ధృవీకరణను నిరోధించడానికి క్యాపిటల్పై దాడి చేయవలసిందని ఒక గుంపును ప్రేరేపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజ్యాంగం, చట్టపరమైన నిర్మాణం, సంస్థాగత నిబంధనలు, పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ నియమాలే కాకుండా, ఎలాంటి మంచీ చెడూ నియంత్రణలలో లేని వ్యక్తి ట్రంప్. అయినప్పటికీ ట్రంప్ తనపై చేసిన మూడు నేరారోపణలను (ఈ వారంలో నాలుగవది ఎదుర్కొన్నారు) కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో గొప్ప విజయం సాధించారు. అమెరికన్ డీప్ స్టేట్కు వ్యతిరేకంగా పోరాడుతున్న హీరోలా, ఉదారవాదుల కుట్ర ఎదుర్కొంటున్న బాధితుడిలా ఆయన పాత్రలు మార్చుకుంటున్నారు. మరింతగా విరాళాలను సేకరించడం ప్రారంభించారు (ఈ డబ్బులో చాలా మొత్తం కేసుల ఫీజులకే పోతుంది). పైగా పార్టీలో క్షేత్రస్థాయి వర్గాలు ఆయన వెనుక సంఘటితమవుతున్నాయి. ఇటీవలి సీబీఎస్ న్యూస్ పోల్ ప్రకారం, 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో వచ్చినవని నమ్ముతున్నారు. బైడెన్ చట్టబద్ధంగా ఎన్నిక య్యారని 92 శాతం మంది డెమొక్రాట్లు విశ్వసిస్తున్నప్పటికీ, 68 శాతం మంది రిపబ్లికన్లు బైడెన్ ఎన్నికను విశ్వసించడం లేదు. అంటే వీళ్లు ట్రంప్ అబద్ధాన్ని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఒహాయో రాష్ట్ర శాసనసభ్యుడు, ట్రంప్ మద్దతుదారు అయిన నీరాజ్ అంటాని ఈ వ్యాసకర్తతో ట్రంప్ పునరుత్థానం గురించి చెప్పిన దానిని కూడా గమనించాలి: ‘‘ఇది ట్రంప్ పార్టీ. మాజీ దేశాధ్యక్షుడు దానిని నిర్వచిస్తున్నారు.’’ చివరకు, డసాంటస్ చేస్తున్న ప్రచారంలోని వైఫల్య శకలాలే ట్రంప్ పునరుత్థానాన్ని నిర్దేశిస్తున్నాయి. సాంఘిక సంప్రదాయవాదు లను గెలవడం కోసం... జాత్యహంకారం, బానిసత్వం, లైంగికత చుట్టూ ఉన్న బోధనలపై గవర్నర్ డసాంటస్ దాడి చేస్తూ, సాంస్కృతిక మితవాద తీవ్రవాదం ప్రాతిపదికన తన రాజకీయాలను నిర్వచించుకుంటున్నారు. అయితే ఇది ఆయనకు మద్దతు పెరగడంలో సహా యపడలేదు. పూర్వాశ్రమంలో యూఎస్ కాంగ్రెస్లో డసాంటస్తో కలిసి పనిచేసినవారు ఆయనకు ప్రజాకర్షణ కానీ, సహజమైన రాజ కీయ అనుసంధానం కానీ లేవని చెబుతున్నారు. తన ప్రచారాన్ని కూడా పేలవంగా నిర్వహిస్తున్నారు. సిబ్బందిని తరచుగా మార్చడంలో ఇది ప్రతిఫలిస్తోంది. ఇటీవలి ఒక ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ఎత్తి చూపినట్లుగా, ఫ్లోరిడా గవర్నర్ను కనికరం లేకుండా ట్రంప్ ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా, ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలో తెలి యక డసాంటస్ తికమక పడుతున్నారు. రిపబ్లికన్లు వచ్చే జూలైలో మాత్రమే తమ అధ్యక్ష అభ్యర్థి ఎవర నేది నిర్ణయిస్తారు. ట్రంప్ చేస్తున్న న్యాయ పోరాటాలు ఆయన శక్తిని బాగా హరించవచ్చు. అయినా కూడా 2024లో అమెరికాలో జరిగే రాజకీయ పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే సాగేట్టుగా కనిపిస్తోంది. అయితే అభ్యర్థిగా ట్రంప్ పోటీలో ఉండటం తమకు కలిసొస్తుందని బైడెన్ బృందం నమ్ముతోంది. బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ ఉనికి చాలు... స్వతంత్రులు, మితవాద రిపబ్లికన్లు, సబర్బన్ మహిళలు ఆయనకు దూరం జరగడానికి అన్నది ఈ వర్గం మాట. ట్రంప్ పట్ల వారి అపనమ్మకం, అయిష్టత చాలా తీవ్రస్థాయిలో ఉన్నందున... బైడెన్కు రెండవసారి పదవి దక్కడంపై ఉత్సాహం చూపని యువతతో సహా డెమొక్రాటిక్ పార్టీ పునాదిని ఏకీకృతం చేయడంలో ఇవి సహాయపడతాయి. తన పునాదిపై ఇప్పటికీ బలమైన పట్టున్న ట్రంప్ను తక్కువగా అంచనా వేయడం పొరపాటు అని వాదించే డెమొక్రాట్లు కూడా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి, అర డజను ఊగిసలాడే రాష్ట్రాల్లో మరోసారి మెజారిటీ కొన్ని వేల ఓట్లకు తగ్గుతుందని వీరి భయం. నిరుత్సాహకరమైన దేశ ఆర్థిక స్థితితో పాటు రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను కూడా తనకు అనుకూలంగా ట్రంప్ మలుచు కోగలరు. మొత్తం మీద, వచ్చే నవంబర్లో ఏమి జరిగినా, ట్రంప్ కరిష్మా ఇప్పటికీ సజీవంగానే ఉంది. అది అమెరికన్ రాజకీయాలను నిర్దేశిస్తూనే ఉంది. ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ట్రంప్ ముందున్న మార్గం క్లిష్టమే!
రిపబ్లికన్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ విధానం ఒకటే... ఆయన నేరాలనూ, దుష్ప్రవర్తనలనూ విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్లపై ఉందని వాదించడం! అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి నీలిచిత్రాల తారలతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. మరోవైపు, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. అమెరికాలో 2023 వేసవికాలం క్రూరంగా ఉండబోతోంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ సాంస్కృతిక జ్వరాలకు ఇది ఒక సూచన. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ దూరమే ఉంది. ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అమెరికాను తనవైపు తిప్పుకుంది. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థి, తిరిగి భవిష్యత్ అమెరికన్ అధ్యక్షుడిగా భావిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్నే తీసుకోండి... రహస్య పత్రాలను దుర్వినియోగం చేసిన కేసులో ఆయన వచ్చే ఏడాది మేలో విచారణను ఎదుర్కోనున్నారు. కానీ 2024లో ఆయన ఎదుర్కొనే అనేక కేసుల్లో ఇది ఒకటి మాత్రమే. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జరిగిన లైంగిక కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ట్రంప్ ఇచ్చిన నగదు చెల్లింపుపై క్రిమినల్ విచార ణను మార్చిలో మొదలెట్టాలని నిర్ణయించారు. జార్జియాలో గత ఎన్నికల్లో పొందిన ఓటమిని తిప్పికొట్టేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నా లపై కూడా విచారణ కొనసాగుతోంది. చివరగా, ఆయన నకిలీ ఓటర్లతో కూడిన కుట్ర ద్వారా 2020 ఎన్నికల తీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నించాడనే అభియోగంపై కూడా దర్యాప్తు పూర్తి కావస్తోంది. ఈ కుట్రపూరిత ప్రయత్నం 2021 జనవరి 6న క్యాపి టల్పై దాడితో ముగియడం తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే రిపబ్లికన్ పార్టీ ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. ట్రంప్పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్ విధానం ఆయన నేరాలను, దుష్ప్రవర్తన లను విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్లపై ఉందని వాదించడంగా కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఈ అభిప్రాయానికి ఎలా వచ్చిందో, ఎలా చేరుకుందో స్పష్టం కావడం లేదు. కానీ ‘లా అండ్ ఆర్డర్’గా తనను తాను చెప్పుకొనే ఈ పార్టీ... 2021 జనవరిలో జరిగిన అల్లర్లలో అసాధారణమైనది ఏమీ కనిపించలేదని భావించే స్థాయికి చేరుకుంది. పైగా ఆ పార్టీ ఇప్పుడు ఎఫ్బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)ని కూడా రద్దు చేయాలనుకుంటోంది. అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి పోర్న్ స్టార్లతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. వారి పూర్వ నాయకుడు రొనాల్డ్ రీగన్ సోవియట్ ‘దుష్ట సామ్రాజ్యం’కు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించిన చోట, వారి ప్రస్తుత నాయకుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. మరోవైపున డెమొక్రాట్లకు వారి సమస్యలు వారికి ఉన్నాయి. కనీస జనాదరణ కూడా లేని జో బైడెన్ రెండోసారి పదవిని కోరు తున్నారు. అయితే కాగితంపై విషయాలు బాగానే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది, ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి, పైగా, రాబోయే ఆరు నెలల్లో పరిస్థితులు మరింత మెరుగు పడతాయన్న అంచనాలున్నాయి. అధ్యక్షుడిని అభిశంసిస్తామంటూ బెదిరించడం ద్వారా బైడెన్ను అణగదొక్కాలని రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. బైడెన్, ఆయన కుమారుడు హంటర్ చర్యలు అవినీతితో ముడిపడి ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు, అయినప్పటికీ అధ్య క్షుడు స్వయంగా తప్పు చేసినట్లు చెప్పే సాక్ష్యాలు పెద్దగా లేవు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సంస్కృతీ యుద్ధాలు కూడా అంతే నాట కీయంగా ఉన్నాయి. అమెరికా సమకాలీన చరిత్రలో అతిపెద్ద విభజన, వాస్తవానికి గర్భస్రావ అంశమే. అమెరికన్ సుప్రీంకోర్ట్ అబార్షన్ హక్కుల కోసం రాజ్యాంగ పరమైన రక్షణను తీసివేసిన తర్వాత, అనేక రిపబ్లికన్ రాష్ట్రాలు అబార్షన్ ను నిషేధించడమే కాకుండా, అబార్షన్ చేసేవారి చర్యను నేరంగా పరిగణిస్తూ కఠినమైన చట్టాలను ఆమోదించాయి. అయితే, గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయా సర్వేలు చూపిస్తున్నట్లుగా, అమెరికన్లలో ఎక్కువ మంది కొన్ని పరిమితులతో అబార్షన్ హక్కుకు మొగ్గు చూపుతున్నారు. 1955లో మిసిసిపిలో, శ్వేతజాతి మహిళపై ఈల వేసినందుకు అపహరణకు గురై, చిత్రహింసలపాలై హత్యకు గురైన 14 ఏళ్ల నల్ల జాతి బాలుడు ఎమ్మెట్ టిల్ స్మారక చిహ్నాన్ని గత వారం అధ్యక్షుడు బైడెన్ ప్రారంభించారు. ఆ హత్య, అతని హంతకులను నిర్దోషులుగా విడుదల చేయడం అనేది 1960లలో పౌర హక్కుల ఉప్పెనను ప్రేరే పించింది. పైగా గత దశాబ్దంలో, ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ (నల్లజాతి జీవి తాలూ విలువైనవే) ఉద్యమ పెరుగుదలను చూశాం. ఈ పరిణామం అమెరికాలో నిలకడగా కొనసాగుతున్న జాత్యహంకార ఫలితమే. సమకాలీన అమెరికన్ జాత్యహంకారం ఎలా పని చేస్తున్నదో చూడాలంటే... ఫ్లోరిడా గవర్నర్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆశా జనకంగా ఉన్న రాన్ డిసాంటిస్ ఉదాహరణ చూడాలి. బానిసత్వాన్ని కొట్టివేసేలా ఆయన చర్యలు ఉంటున్నాయి. ఈ రాష్ట్రంలో సవరించిన పాఠ్య పుస్తకాలు... పని చేస్తూ బానిసలు కొన్ని నైపుణ్యాలను సంపా దించుకున్నందున వారు తమ బానిసత్వ స్థితి నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నాయి. లైంగిక విద్య, లైంగిక ధోరణి, లింగ గుర్తింపుపై యుద్ధాలు జరుగుతున్నాయి. స్వలింగ సంపర్కుల హక్కులను స్థాపించడానికి విజయవంతమైన ప్రయత్నాలపై ఆధారపడి, ద్విలింగ, లింగ మార్పిడి వ్యక్తులు ప్రస్తుతం తమ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం, దాదాపు 21 శాతం జెన రేషన్ జెడ్ – అంటే 1990ల మధ్య నుంచి 2010 మధ్య జన్మించిన వారు– తమను తాము లెస్బియన్, గే, బైసెక్సువల్ లేదా ట్రాన్్సజెండర్ (ఎల్జీబీటీ)గా గుర్తించుకుంటున్నారు. 1980ల ప్రారంభంలో, 1990ల మధ్యకాలంలో జన్మించిన ‘మిలీనియల్స్’లో ఎల్జీబీటీ సంఖ్య 10 శాతమే. జెనరేషన్ జెడ్ రాక దేశాన్ని ఇతర మార్గాల్లో కూడా ప్రభావితం చేస్తోంది. అమెరికన్లుగా ఉన్నందుకు ‘అత్యంత గర్వంగా’ భావిస్తున్నా మని చెప్పుకొనే యువకుల (18–34 ఏళ్లు) వాటా 2013లో దాదాపు 40 శాతం ఉండగా, ఇప్పుడది 18 శాతానికి పడిపోయిందని గాలప్ పోల్ వెల్లడించింది. ఈ ఏడాది, ఎల్జీబీటీ హక్కులను పరిమితం చేయడానికి ఉద్దేశించిన 75 బిల్లులు అమెరికా అంతటా చట్టసభలలో ఆమోదించబడ్డాయి. లైంగిక ధోరణి ఆధారంగా ద్వేషపూరిత నేరాలు పెరిగాయి. పైగా ప్రదర్శనలు, ప్రతి– ప్రదర్శనలు ఒక సాధారణ లక్షణంగా మారాయి. పాఠశాల, విశ్వ విద్యాలయ పాఠ్యాంశాలు కూడా రణరంగంలో చేరిపోయాయి. ‘సంస్కృతి యుద్ధాలు’ అని పిలిచే ఇవి నిజానికి మార్పుపై పోరాడటానికి సంప్రదాయవాదులు చేసిన ప్రయత్నం. వలస దారులు, స్వలింగ సంపర్కులు, మహిళలు, పేదలు, నల్లజాతీయులు, ఇతర సమూహాలకు తమ ఖర్చుతో అన్యాయమైన అధికారాలు ఇస్తు న్నందున, ఉదారవాదం యొక్క బాధితులుగా సంప్రదాయవాదులు తమను తాము అభివర్ణించుకుంటున్నారు. సందడి ఎలా ఉన్నప్పటికీ, ట్రంప్కు మాత్రం రహదారి క్లిష్టంగానే ఉంది. ఒక ఎన్నికల సర్వే ప్రకారం, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. స్పష్టంగా, అమెరికా మార్పునకు గురవుతోంది. ఇదేమీ అసాధారణ మైనది కూడా కాదు. మితవాదుల ఆధిపత్యంలోని సుప్రీంకోర్టు వంటి సంస్థల సహాయంతో, రిపబ్లికన్లు ‘శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని’ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. మనోజ్ జోషి వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ది ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
ప్రతినిధుల సభలో అమెరికా పౌరసత్వ చట్టం
వాషింగ్టన్: గ్రీన్కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయడంతోపాటు హెచ్–1బీ వీసాల జారీలో మార్పుల కోసం ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ చట్టం–2023ను అధికార డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం 1 కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం కల్పించేందుకు రోడ్మ్యాప్ రూపొందిస్తారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, ధ్రువ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి పౌరసత్వం లభించనుంది. గ్రీన్కార్డ్ జారీ సులభం కానుంది. దేశాలవారీ కోటా రద్దు చేస్తారు. తక్కువ వేతనం ఇచ్చే పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా గ్రీన్కార్డులు సులువుగా పొందవచ్చు. హెచ్1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. -
మళ్లీ ఎన్నికల బరిలోకి
వాషింగ్టన్: అసంపూర్తిగా ఉన్న బాధ్యతలను పూర్తి చేసేందుకు తనకు మరో అవకాశమివ్వాలని అమెరికా ప్రజలను అధ్యక్షుడు జో బైడెన్ (80) కోరారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోతో ఎన్నికల ప్రచారానికి ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్నే మరోసారి తన రన్నింగ్ మేట్గా ఎంచుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ కి చెందిన బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత ఎక్కువ వయసున్న అధ్యక్షుడు. ఇక కమల దేశ తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్గారికార్డు సృష్టించారు. బైడెన్పై ట్రంప్ ధ్వజం: బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడని ట్రంప్ ఆరోపించారు. ‘‘ప్రపంచ వేదికపై దేశ పరువు ప్రతిష్టలను ఆయన పూర్తిగా మంటగలిపారు. తన చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారు’’ అంటూ నిప్పులు చెరిగారు. బైడెన్ అధికార ప్రకటనకు కాస్త ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించారు. రిపబ్లికన్ల అతివాదంపై పోరు 2024 ఎన్నిలను రిపబ్లికన్ల అతివాదంపై పోరుగా బైడెన్ అభివర్ణించారు. అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక భద్రత చట్రం వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలన్నారు. ‘‘గత అధ్యక్ష ఎన్నికలను అమెరికా ఆత్మను పరిరక్షించేందుకు జరిగిన పోరు. అదింకా కొనసాగుతూనే ఉంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులు మున్ముందు మరింత వికసిస్తాయా, కుదించుకుపోతాయా అన్నది ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద ప్రశ్న. రానున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడికిలి బిగించేందుకు తరానికి ఒక్కసారే వచ్చే అవకాశం. రండి అందరమూ కలిసికట్టుగా పని పూర్తి చేద్దాం’’ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో కలసి రావాల్సిందిగా అనంతరం కమల కూడా ఒక ప్రకటనలో అమెరికన్లకు పిలుపునిచ్చారు. ‘‘దేశ చరిత్రలో ఇది అత్యంత కీలక సమయం. స్వేచ్ఛ తదితర మౌలిక హక్కులపై రిపబ్లికన్ అతివాదుల దాడి నానాటికీ పెరిగిపోతోంది. మహిళకు తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలపై హక్కులను హరించజూస్తున్నారు. ఓటు హక్కునూ వదల్లేదు. ప్రజల గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టజూస్తున్నారు’’ అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్న విషయం తెలిసిందే. భారత అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి తదితరులు ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
బైడెన్ మళ్లీ పోటీ చేస్తారు: జిల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీపడనున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఈ మేరకు తెలిపారు. 80 ఏళ్ల బైడెన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వయోధికునిగా రికార్డు సృష్టించారు. రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే ఆలోచన ఉందని ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడుతూ జిల్ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు తెలిపారు. రెండోసారి పోటీపై బైడెన్ బహుశా మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ సహచరుల్లో ప్రధానంగా ఆయన వయసుపైనే అభ్యంతరాలు నెలకొన్నాయి. దీనిపై రాయిటర్స్–ఇప్సోస్ తాజాగా నిర్వహించిన పోల్లో బైడెన్ పోటీ చేయొద్దని డెమొక్రాట్లలో ఏకంగా 52 శాతం మంది అభిప్రాయపడ్డారు! మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు కూడా ప్రస్తుతం 76 ఏళ్లు! పైగా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ తదితరులు ఇప్పటికే ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
కన్సాస్ సెనేటర్గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్గా కొనసాగుతున్నారు. మేయర్గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే
ఎస్.రాజమహేంద్రారెడ్డి అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పాలకపక్షం తన ఎజెండాను బలవంతంగా తమపై రుద్దే ప్రమాదం నుంచి ప్రజలు ఒకరకంగా బయట పడ్డారనే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇద్దరు చొప్పున వంద మంది సభ్యులుండే సెనేట్పై అధికార డెమొక్రాట్ పార్టీ ఒకే ఒక్క సీటు ఆధిక్యంతో పట్టు నిలబెట్టుకుంది. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్ పార్టీ 221 సీట్లలో నెగ్గి ఆధిక్యం ప్రదర్శించింది. డెమొక్రాట్లు 213 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బైడెన్ ఇకపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ప్రజలకు నచ్చని ఏ నిర్ణయాన్నైనా రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో అడ్డుకుని తీరతారు. ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండే, వారికి లబ్ధి చేకూర్చే నిర్ణయాలే చట్టాలవుతాయి. అమలవుతాయి. కాదు, కూడదు అంటే రిపబ్లికన్ల నుంచి బైడెన్కు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవడం ఖాయం. నెత్తిన పాలు పోసిన ట్రంప్ ఈ మధ్యంతర ఎన్నికలకు ముందు ఎర్ర (రిపబ్లికన్ పార్టీ) గాలి కాస్త గట్టిగానే వీచింది. అది తుఫాన్లా మారి డెమొక్రాట్లను తుడిచిపెట్టడం ఖాయమనుకున్నారు. డెమొక్రాట్లకు సెనేట్లో పరాభవం తప్పదని, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోతారని పరిశీలకులు అంచనా వేశారు. బైడెన్ ఇరకాటంలో పడతారని భావించారు. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. డెమొక్రాట్లు ఫర్వాలేదనిపించారు. బైడెన్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా బైడెన్పై సానుకూలత కాదని, రిపబ్లికన్లను ఇప్పటికీ శాసిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఉన్న వ్యతిరేకత అని రాజకీయ పండితులు తేల్చారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ గొప్పలకు పోయిన ట్రంప్ అధ్యక్షునిగా ఉండగా ప్రదర్శించిన దూకుడు, నాలుగేళ్ల పాలనలో తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు 2020లో ఆయన ఓటమికి దారితీయడం తెలిసిందే. ఇప్పుడు మధ్యంతరంలోనూ ట్రంప్ నీడ ఓటర్లను బాగా భయపెట్టింది. అందుకే, భారీ మెజార్టీ ఖాయమనుకున్న రిపబ్లికన్ పార్టీ కాస్తా ప్రతినిధుల సభను కేవలం అత్తెసరు ఆధిక్యంతో మాత్రమే గెలుచుకోగలిగింది. సెనేట్పై పట్టు బిగించడంలో విఫలమైంది. ట్రంప్కు రిపబ్లికన్లు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నది పరిశీలకుల అభిప్రాయం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిని తానేనని ఇప్పట్నుంచే బాహాటంగా చెప్పుకుంటున్న ఆయనను నిలువరిస్తేనే పార్టీ పరిస్థితి బాగుపడుతుందన్న చర్చ కూడా ఊపందుకుంది. అధికార పక్షాలకు ఎదురుగాలే...! అధికార పార్టీ మధ్యంతర ఎన్నికల్లో భారీగా సీట్లను కోల్పోయినట్టు గత రెండు ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక మధ్యంతరంపై ప్రభావం చూపడం ఆనవాయితీగా వస్తోంది. 2014 మధ్యంతరంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో డెమొక్రాట్ పార్టీ సెనేట్లోనూ, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోయింది. 2018లో ట్రంప్ హయాంలో అధికార పార్టీగా రిపబ్లికన్లు సెనేట్లో కాస్త పర్వాలేదనిపించినా సభలో మాత్రం ఏకంగా 42 సీట్లు కోల్పోయి ఘోరంగా దెబ్బ తిన్నారు! తాజా మధ్యంతరంలోనూ రిపబ్లికన్ పార్టీ విపక్షంలో ఉండి కూడా జనాల్లో ఉన్న ట్రంప్ వ్యతిరేకత పుణ్యమా అని ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయింది!! సెనేట్ను చేజార్చుకోవడమే గాక ప్రతినిధుల సభలోనూ అత్తెసరు ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది! మన మాదిరిగా కాదు... మన దగ్గర మధ్యంతర ఎన్నికలంటే అదేదో అరుదైన విశేషంగా కనిపిస్తుంది. అంచనాలు, లెక్కలు వేగంగా మారిపోతుంటాయి. అధికార పక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందా, లేక ప్రతిపక్షానికి దాసోహమంటుందా అన్నదే చర్చనీయాంశమవుతుంది. ఫలితాలను బట్టి పాలకపక్షంతో పాటు పాలకుడూ మారవచ్చు, మారకపోనూ వచ్చు. కానీ చట్టసభలో సభ్యులు మాత్రం కచ్చితంగా మారతారు. మళ్లీ గెలిచే సిట్టింగులు తప్ప మొత్తమ్మీద కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గం... ఇలా కొద్దిరోజులు హంగామా, హడావుడి ఉంటాయి. కానీ అమెరికా మధ్యంతరం మరో విధంగా ఉంటుంది. ప్రత్యక్ష విధానంలో నాలుగేళ్ల పదవీకాలానికి అధ్యక్ష ఎన్నిక జరిగిన రెండేళ్లకు వచ్చే ఎన్నికలు గనుక వీటిని మధ్యంతరం (మిడ్ టర్మ్) అంటారు. ఇందులో ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లకు, సెనేట్లో మొత్తం వంద స్థానాలకు గాను 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మధ్యంతర ఫలితమెలా ఉన్నా ప్రత్యక్ష విధానంలో ఎన్నికైన అధ్యక్షుడు మారడు. మిగతా రెండేళ్లూ పదవిలో కొనసాగుతాడు. పాలక పక్షమూ మారదు. మంత్రివర్గమూ యథాతథంగా కొనసాగుతుంది. అధికారమైతే ఉంటుంది. కానీ చట్టసభల్లో ఆధిక్యం కోల్పోతే ఆ ప్రభావం అధికార నిర్ణయాల అమలుపై పడుతుంది. 2020లో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి ఈ నవంబర్తో రెండేళ్లవడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఒకరకంగా అధ్యక్షుని రెండేళ్ల పాలనకు రెఫరెండం వంటివి. అలాగే మిగతా రెండేళ్ల పదవీకాలంలో పనితీరు మార్చుకోవడానికి ఓ మంచి అవకాశం కూడా. అధ్యక్షునికి మరోసారి పోటీ చేసే అవకాశముంటే ఈ అనుభవం చక్కని పెట్టుబడి అవుతుంది. అమెరికాలో ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టవచ్చన్నది తెలిసిందే. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్గా, ట్రాఫిక్ ఇంజనీర్గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్మూన్పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
తప్పిన అంచనాలు
‘డెమోక్రసీకి ఇది శుభదినం!’ అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల సరళిని చూసి, ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. అమెరికాలోని డెమోక్రసీ మాటెలా ఉన్నా, బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాటిక్ పార్టీకి మాత్రం దాదాపు సార్వత్రిక ఎన్నికల లాంటి ఈ పోల్స్ కొంత శుభప్రదంగా పరిణమించాయి. భారీ ద్రవ్యోల్బణం, ప్రజల్లో బైడెన్పై పెరిగిన అసంతృప్తి ఆసరాగా రిపబ్లికన్ల జెండా రంగైన ‘ఎర్ర గాలి’ దేశమంతటా వీస్తుందన్న అంచనా తప్పింది. అమెరికన్ కాంగ్రెస్లో ఇటు ప్రతినిధుల సభలోనూ, అటు ఎగువ సభ సెనేట్లోనూ తిరుగులేని ఆధిక్యం తమదే అవుతుందన్న రిపబ్లికన్ పార్టీ అంచనాలను మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలు నీరుగార్చాయి. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 218 స్థానాల మెజారిటీకి రిపబ్లికన్లు మెల్లగా దగ్గరవుతున్నారు. సెనేట్లో నువ్వానేనా పోటీ నడుస్తోంది. అయితే, నేవడా, అరిజోనా రాష్ట్రాల ఫలితాల్లో తప్పని జాప్యం – డిసెంబర్ 6న జరిగే జార్జియా ఎన్నిక వల్ల పార్లమెంట్లో అంతిమ బలాబలాలు తెలియడానికి మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే మధ్యంతర ఎన్నికలపై అంతర్జాతీయంగా ఏమంత ఆసక్తి వ్యక్తం కాదు. ఏ రాష్ట్రానికి ఎవరు గవర్నర్ అయ్యారు, ఎవరు సెనేటర్ అయ్యారనేది ప్రపంచానికి పెద్దగా పట్టని వ్యవహారం. కానీ, ట్రంప్ హయాం నుంచి పరిస్థితి మారింది. అయితే, మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలంతగా అందరి దృష్టినీ ఆకర్షించినవి చాలాకాలంగా మరేవీ లేవనే చెప్పాలి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికలివే. ఆ ఎన్నికల ఫలితాలను మసిపూసి మారేడుకాయ చేశారన్న అప్పటి ట్రంప్ తప్పుడు వాదననే ఇప్పుడీ నవంబర్ 8 నాటి మధ్యంతర ఎన్నికల్లోనూ రిపబ్లికన్లు తెగ ఊదరగొట్టడం గమనార్హం. అలా చివరకు ఈ ఎన్నికలు ట్రంప్వాదపు దీర్ఘకాల మన్నికకు అగ్నిపరీక్షగా, అమెరికన్ ప్రజాస్వామ్యం ఏ మేరకు ఒత్తిడిని తట్టుకుంటుందో పరీక్షించే గీటురాయిగా మారాయి. ప్రపంచం ఆసక్తిగా చూసేలా చేశాయి. అభ్యర్థుల ఎంపికలో దూకుడు చూపిన ఎర్రరంగు రిపబ్లికన్లకూ, అధికార పీఠంపై అస్తుబిస్తు అవుతున్న నీలిరంగు డెమోక్రాట్లకూ ఈ ఎన్నికలు పాఠాలు నేర్పాయి. నిజానికి, అమెరికాలో అధ్యక్షుడి నాలుగేళ్ళ పదవీకాలంలో దాదాపు మధ్యలో జరిగే మధ్యంతర ఎన్నికలు అధికార పార్టీ, దేశాధ్యక్షుల పనితీరుపై రిఫరెండమ్ లాంటివి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ప్రతి మిడ్టర్మ్ పోల్స్లోనూ అధికార పార్టీ సగటున 26 స్థానాలు సర్వప్రతినిధి సభలో, 4 సీట్లు సెనేట్లో కోల్పోతుందని లెక్క. ఆ లెక్కన అధికార డెమోక్రాట్ పార్టీకీ ఎదురు దెబ్బలు అనూహ్యమేమీ కాదు. కానీ, దిగువసభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తున్నా అంచనాలకు తగ్గట్టు భారీ సంఖ్యలో విజయాలు రాలేదు. భయపడినంత గట్టిదెబ్బ డెమోక్రాట్లకు తగలలేదు. ఇది సర్వేలు సైతం అంచనా వేయని ఆశ్చర్యకర పరిణామం. పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్ల గెలుపుతో, ఫలితాలు తాము అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఉన్నాయని బైడెనే ఒప్పుకున్నారు. ఇక, ట్రంప్ గట్టిగా బలపరిచిన పలువురు మితవాదులు వివిధ రాష్ట్రాల్లో ఓటమి పాలవడం విడ్డూరం. మిగిలిన బైడెన్ పదవీకాలం ఎలా గడుస్తుంది, అమెరికా రాజకీయాలపై ట్రంప్ నీడ ఏ మేరకు పరుచుకుంటుంది లాంటివన్నీ ఇక ఆసక్తికరం. మునుపెన్నడూ లేని విధంగా దేశం నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో, దిగువసభలో రిపబ్లికన్ల ఆధిక్యం బైడెన్కు కష్టాలు తేనుంది. ఒకప్పుడు ఎరుపు, నీలం పార్టీలు రెంటికీ సమాన బలాబలాలుండి, అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచిన ఫ్లోరిడా రాష్టంలో ఇప్పుడు దాదాపు 20 శాతం పాయింట్ల పైగా భారీ తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డీశాంటిస్ గెలవడం గమనార్హం. ఆ రాష్ట్రం అంతకంతకూ ఎరుపుమయం అవుతోందనడానికి ఇది నిదర్శనం. వచ్చే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంలో ట్రంప్కు గట్టి సవాలు ఆయన నుంచే ఎదురుకావచ్చు. ఏమైనా, ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలను బట్టి ఒకటి స్పష్టమవుతోంది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం అస్వాభావికమేమీ కాదు. ఆ సంగతి గ్రహించిన అమెరికా మిత్రపక్షాలు రానున్న రోజుల్లో నాటో, ఉక్రెయిన్లకు మద్దతు లాంటి వాటిపై ఎలా వ్యవహరిస్తాయన్నదీ ఆసక్తికరమే. ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురి నేపథ్యాలు వైవిధ్యానికి ప్రతీకగా నిలవడం చెప్పుకోదగ్గ అంశం. భారత అమెరికన్లు అయిదుగురు ప్రతినిధుల సభకు ఎన్నికైతే, మేరీల్యాండ్కు గవర్నర్గా నల్లజాతీయుడు, లెఫ్టినెంట్ గవర్నర్గా తెలుగు మహిళ అరుణా మిల్లర్, ఇతర రాష్ట్రాల్లో ఒక స్వలింగ సంపర్క మహిళ, ఒక ట్రాన్స్జెండర్ గవర్నర్లుగా గెలవడం విశేషం. వీరందరూ డెమో క్రాట్ అభ్యర్థులే కావడం గమనార్హం. ఇలాంటి పరిణామాలు బాగున్నా, అమెరికా రాజకీయాలు అంతకంతకూ రెండు విరుద్ధ వర్గాల విద్వేషంగా మారుతున్నాయనే బెంగ పుట్టిస్తోంది. ఇప్పటి దాకా దిగువ, ఎగువ సభలు రెంటిలోనూ ఆధిక్యం డెమోక్రాట్లదే. ఎన్నికల తుది ఫలితాలతో రేపు బలాబలాల్లో తేడా వస్తే బైడెన్ అజెండా భవితవ్యం ప్రశ్నార్థకమే. ప్రతినిధుల సభ పూర్తిగా రిపబ్లికన్ల చేతిలోకి వెళితే, మిగిలినవన్నీ పక్కకు పోయి బైడెన్, ఆయన కుటుంబంపై దర్యాప్తుల పరంపర మొదలవుతుంది. సెనేట్ గనక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కైవసమైతే న్యాయ నియామకాల్లోనూ అధ్యక్షుడు బైడెన్ సత్తా కుంటుపడుతుంది. వెరసి, అమెరికన్ రాజకీయాల్లో మరిన్ని మలుపులు ఖాయం. -
సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేత, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారాయన. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్.. అధిక మెజారిటీ ద్వారా అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘‘ఇది ఒక శుభదినం. బహుశా ప్రజాస్వామ్యానికి, అమెరికాకు మంచి రోజని భావిస్తున్న. రిపబికన్లదే పూర్తి హవా ఉంటుందని కొందరు అంచనా వేశారు. అది జరగలేదు’’ అంటూ వైట్ హౌజ్లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారాయన. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 250 స్థానాలు ఆశించింది ఆ పార్టీ. పైగా ట్రంప్ వ్యక్తిగతంగా ప్రచారం చేసిన ప్రముఖులు ఓటమి చెందడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణంతో పాటు బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ.. రిపబ్లికన్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2018 తర్వాత మొదటిసారిగా 435 మందితో కూడిన యూఎస్ హౌజ్ను అతిస్వల్ఫ ఆధిక్యంతో తిరిగి కైవసం చేసుకునేందుకు ట్రాక్ ఎక్కింది. వంద మంది సభ్యున్న యూఎస్ సెనేట్లో ఇరు పార్టీలు 48 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటివ్స్లో రిపబ్లికన్ పార్టీ 207 సీట్లు, డెమోక్రటిక్ పార్టీ 183 స్థానాలు దక్కించుకున్నాయి(స్పష్టమైన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది). గత 40 ఏళ్లలో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అత్యుత్తమమని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
బైడెన్ ఇజ్జత్కా సవాల్.. ట్రంప్కి తాడేపేడో!
అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ప్రస్తుత అధ్యక్షుడి మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై ప్రభావం చూపనున్నాయి. దేశ రాజకీయాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోకపోలేదు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్టకు పరీక్షగా మారాయి. బైడెన్తోపాటు మాజీ అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రచారం హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికలంటే? అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్లో రెండు సభలుంటాయి. అవి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. కాంగ్రెస్కు ప్రతి రెండేళ్లకోసారి.. అధ్యక్షుడి పదవీ కాలం మధ్యలో(సగం ముగిసినప్పుడు) ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మొత్తం సెనేటర్లు 100 మంది. వారి పదవీ కాలం ఆరేళ్లు. మొత్తం 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇక జనాభాను బట్టి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్య మారుతుంది. వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతోపాటు సెనేట్లో మూడొంతుల్లో ఒక వంతు స్థానాలకు (35 సీట్లు) ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. గెలిచేదెవరో? అధికార డెమొక్రటిక్ పార్టీకి కాంగ్రెస్ ఉభయ సభల్లో గత రెండేళ్లుగా మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్ మదిలోని ఆలోచనలు సులభంగా చట్టాలుగా మారుతున్నాయి. కానీ, ప్రతిపక్ష రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్ల ఆధిక్యం స్వల్పమే. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో ఇరుపక్షాల నడుమ ఉత్కంఠభరితమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, సెనేట్లో డెమొక్రాట్లు పాగా వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా, కేవలం 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇక సెనేట్లో 35 సీట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను కాంగ్రెస్ రూపొందిస్తుంది. ఏయే చట్టాలను తీసుకురావాలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) నిర్ణయిస్తుంది. ఆ చట్టాలను సెనేట్ అడ్డుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణ యాలకు సెనేట్ ఆమోద ముద్ర వేస్తుంది. అత్యంత అరుదుగా వాటిపై విచారణ కూడా జరపవచ్చు. ప్రభావితం చేసే అంశాలేమిటి? దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసలు, పెరిగిపోతున్న నేరాలు, జీవన వ్యయం వంటివి మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఉపకరించనున్నాయి. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అధ్యక్షుడు బైడెన్ పట్ల 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం ఉన్నట్లు తేలింది. ఇది ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్షుడి పనితీరును ప్రతిబింబిస్తాయి. ఈ ఫలితాలను ఆయన పాలనపై ప్రజాతీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల పట్టు సాధిస్తే.. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, గర్భస్రావ హక్కుల పరిరక్షణ, తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడం వంటి అంశాల్లో బైడెన్ మరింత దూకుడుగా ముందుకెళ్లొచ్చు. ఏదో ఒక సభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే మాత్రం బైడెన్ అజెండాకు అడ్డుకట్ట తప్పదు. అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందా? మధ్యంతర ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో ఒక అంచనాకు రావొచ్చు. రిపబ్లికన్ పార్టీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో నెగ్గకపోతే ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి. మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి పెద్ద రాష్ట్రాలను డెమొక్రాట్లు నిలబెట్టుకుంటే బైడెన్ మళ్లీ అధ్యక్షుడు అయ్యే చాన్సుది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తుల్సీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు తుల్సీ(తులసి) గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. తుల్సీ గబ్బార్డ్.. అమెరికా చట్ట సభకు ఎన్నికైన తొలి హిందూ-అమెరికన్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ కోసం యత్నించిన తొలి హిందువుగా(అత్యంత చిన్నవయస్కురాలిగా కూడా) తుల్సీ గబ్బార్డ్ చరిత్రకెక్కారు. అయితే ఆ తర్వాత వైదొలిగి జో బైడెన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఇరవై ఏళ్లుగా డెమొక్రటిక్ పార్టీతో అనుబంధం ఉన్న ఆమె.. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా డెమొక్రటిక్ పార్టీ జాత్యహంకారం ప్రదర్శిస్తోందని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో 30 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారామె. Click the link to watch my full statement on why I'm leaving the Democratic Party: https://t.co/pH58rEFpmS — Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) October 11, 2022 దేశ ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను డెమొక్రటిక్ పార్టీ అణగదొక్కుతోందని, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం అనే సిద్ధాంతాన్నే తాను నమ్ముతున్నానని, కానీ, ఇప్పుడున్న డెమొక్రటిక్ పార్టీ ఈ విలువలకు కట్టుబడి లేదని ఆమె విమర్శించారు. ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికతకు డెమొక్రటిక్ పార్టీ శత్రువుగా మారింది. అమెరికా అణు యుద్ధంలోకి లాగుతోందని ఆరోపించారు. పార్టీ అవలంభిస్తున్న యాంటీ వైట్ రేసిజంను ఖండిస్తూ.. ఇకపై పార్టీలో సభ్యురాలిగా కొనసాగబోనని ఆమె ప్రకటించారు. ప్రస్తుతానికి తాను స్వతంత్రురాలినని ప్రకటించుకున్న ఆమె.. రిపబ్లికన్ పార్టీలో చేరతారా? మరేదైనా రాజకీయ వేదికను ఆశ్రయిస్తారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 41 ఏళ్ల వయసున్న తుల్సీ గబ్బార్డ్.. హవాయ్ స్టేట్హౌజ్కు ప్రతినిధిగా తన 21 ఏళ్ల వయసులోనే ఎంపికయ్యారు. హవాయ్ ఆర్మీ నేషనల్ గార్డు తరపున మెడికల్ యూనిట్లో ఇరాక్లో 2004-05 మధ్య, కువైట్లో 2008-09 మధ్య ఆమె విధులు నిర్వహించారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలోనూ ఆమె పని చేశారు. అమెరికన్ సమోవాన్ ద్వీపమైన టుటులియాలో పుట్టి పెరిగిన గబ్బార్డ్.. సమోవాన్-యూరోపియన్ మూలాలు ఉన్న వ్యక్తి. యుక్తవయసులోనే ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. అందుకు గబ్బార్డ్ ముందర సంస్కృత పదం తులసి(తుల్సీ)ని చేర్చుకున్నారు. 2013 నుంచి 2021 మధ్య.. నాలుగు సార్లు యునైటెడ్ స్టేట్స్ హౌజ్ ఆఫ్ రెప్రెజెంటేటివ్గా ఆమె ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Tulsi Gabbard (@tulsigabbard) హిందుతత్వాన్ని పుణికిపుచ్చుకున్న తుల్సీ గబ్బార్డ్.. గౌడియ వైష్ణవాన్ని అనుసరిస్తున్నారు. తనను తాను కర్మ యోగిగా అభివర్ణించుకుంటారు. భగవద్గీతను నమ్మే ఆమె.. 2013లో ప్రమాణ సమయంలో భగవద్గీత మీద ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆ భగవద్గీత కాపీనే 2014లో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె అందించారు. 2002లో ఎడురాడో టమాయో అనే వ్యక్తిని వివాహమాడిన ఆమె.. 2006లో విడాకులిచ్చారు. ఆపై 2015లో ఫ్రీలాన్స్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ అబ్రహం విలియమ్స్ను శాస్త్రోతంగా వివాహం చేసుకున్నారు. గతంలో సొంత పార్టీకి చెందిన బరాక్ ఒబామా పైనా విమర్శలు గుప్పించిన ఆమె.. రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలను కొన్నింటికి మద్దతు ప్రకటించడం గమనార్హం. -
USA: ఏడేళ్లు నివాసముంటే గ్రీన్కార్డు!
వాషింగ్టన్: అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త ఇది. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సెనేటర్లు అలెక్స్ పడిల్లా, ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజాన్, సెనేట్ మెజారిటీ విప్ డిక్ డర్బన్ బుధవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. ‘గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీని సవరించాం. దీనితో మరింతమంది వలసదారులు చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’అని సెనేటర్ పడిల్లా చెప్పారు. ‘దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటునందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చితితో భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చు’అని ఆయన అన్నారు. ‘‘ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్–1బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది’’ అని వలసదారుల తరఫున పనిచేసే ఎఫ్డబ్ల్యూడీ డాట్ యుఎస్ అంచనావేసింది. ‘చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్కార్డుకు నోచుకోలేకపోతున్నారని హౌస్ సబ్ కమిటీ సారథి లోఫ్గ్రెన్ అన్నారు. ఈ పరిణామాన్ని ఆశావహులు స్వాగతించారు. -
బైడెనే మన శత్రువు.. అమెరికా అధ్యక్షుడిపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శనివారం పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల ర్యాలీలో మాట్లాడుతూ బైడెనే మన శత్రువు అని వ్యాఖ్యానించారు. ఆగస్టు 8న ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్బీఐ సోదాలు జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారి ప్రజలు ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించారు. ఈ ఘటనను న్యాయానికి అపహాస్యంగా, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తనను లక్ష్యంగా చేసుకున్నందుకు బైడెన్ సర్కార్కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇదివరకు ఎన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో బైడెన్లా ఏ అధ్యక్షుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ధ్వజమెత్తారు. ఇటీవల తనను విమర్శిస్తూ బైడెన్ చేసిన ప్రసంగంపైనా ట్రంప్ మండిపడ్డారు. బైడెన్ భాష ప్రజాస్యామ్య పునాదులను బెదిరించేలా అతివాదాన్ని ప్రతిబింబిస్తుందని ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు ఇలాంటి అత్యంత దుర్మార్గపు, విద్వేషపూరిత, విభజన ప్రసంగం చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని, రాడికల్ లెఫ్టే ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు అని చెప్పారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా! -
తైవాన్కు మళ్లీ అమెరికా బృందం
తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనతో రేగిన ఉద్రిక్తతలు చల్లారకమునుపే మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు ఆదివారం అక్కడ పర్యటించారు. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరింది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా–తైవాన్ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపనుంది. ఈ బృందం ఈనెల 2వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ సందర్శనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 12 రోజులుగా తైవాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలతో విన్యాసాలు జరుపుతోంది. -
అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. చదవండి: ట్రంప్ అభిశంసన దిశగా..! అమెరికా సభలో ట్రంప్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అభిశంసన తీర్మానాన్ని సభ్యులు .. సెనెట్కు పంపనున్నారు. ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్పై విచారణ జరగనుంది. చదవండి: ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత -
ట్రంప్పై అభిశంసన తీర్మానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ప్రతినిధుల సభలో ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో 25వ సవరణ ద్వారా ట్రంప్ను తొలగించేందుకు తీర్మానం చేశారు. అభిశంసన తీర్మానానికి 215 మందికిపైగా మద్దతు కావల్సి ఉంది. ఇక కేపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ ఉసిగొలిపారంటూ అభియోగం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ను తొలగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హౌజ్లో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజార్టీ ఉండగా, ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పాసైనా సెనేట్ ఆమోదం తప్పనిసరి. అయితే సెనేట్లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉండటం గమనార్హం. చదవండి: ట్రంప్కు షాక్ మీద షాక్ : యూట్యూబ్ కొరడా -
అమెరికా 46వ అధ్యక్షుడు బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం అధికారికంగా నిర్ధారణ అయింది. 538 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లతో బైడెన్ ముందంజలో నిలబడగా, ట్రంప్కి 232 ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ విజయం మరోమారు నిర్ధారణ అయ్యింది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు నిర్ధారణ అయితే తప్ప వైట్ హౌస్ని ఖాళీచేయనని కరాఖండీగా చెప్పిన ట్రంప్ శ్వేత సౌధాన్ని వీడే రోజొచ్చింది. దీంతో జోబైడెన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు అత్యంత కీలకమైన అడుగు ముందుకు పడినట్లయ్యింది. ఫలితాలు తారుమారవుతాయని భావించిన ట్రంప్ అభిప్రాయం తల్లకిందులయ్యింది. రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా, ప్రజాభీష్టం మరోమారు రుజువయ్యిందని జోబైడెన్ తన నివాసం నుంచి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్ళ క్రితమే ప్రజాస్వామ్యమనే దీపాన్ని వెలిగించారు. ప్రతి అమెరికా పౌరుల హృదయాల్లోకి ప్రజాస్వామ్యం అనే పదం చేరిపోయింది. ఏ మహమ్మారీ, ఎంతటి అధికార దుర్వినియోగం ఆ దీపాన్ని ఆర్పలేవు. ఈ యుద్ధంలో అమెరికా ప్రజాస్వామ్యం గెలిచింది. అమెరికా ఐక్యత కోçసం ఇక పేజీ తిప్పేయాల్సిందే’’ అని జో బైడెన్ అన్నారు. 8.1 కోట్ల మంది వోటర్లు ఓట్లు వేశారు. ఈ స్థాయిలో ఓట్లు రావడం అమెరికా చరిత్రలో తొలిసారి. తాను అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిగా ఉంటానని, ఓట్లు వేయని వారికోసం మరింత శ్రమిస్తానని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే 2016లో డొనాల్డ్ ట్రంప్, పెన్స్లకు కూడా బైడెన్కి, కమలా హారిస్కి వచ్చిన 306 ఓట్లే వచ్చాయి. మహమ్మారి విజృంభిస్తోన్న ఈ విషాద శీతాకాలాన నా హృదయం మీ అందరి కోసం తపిస్తోంది. మీకు అత్యంత ఆప్తులైన వారు లేకుండా, నూతన సంవత్సరాన్నీ జరుపుకోబోతున్నారు’’ అని కోవిడ్ మృతుల కుటుంబాలకు బైడెన్ సంతాపాన్ని వ్యక్తం ప్రకటించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement