● కనీస వసతులు కరువు
● ఇబ్బందుల్లో కార్మికులు
ఆర్మూర్టౌన్: పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుటలో మున్సిపల్ కార్మికుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి వారికి కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 125 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి రోజు ఉదయం 5 గంటలకు తమకు కేటాయించిన ప్రధాన వీధులు, రోడ్లపై చేరుకొని పట్టణాన్ని శుభ్రం చేస్తుంటారు. పారిశుధ్యంలో పనిచేసే ప్రతి కార్మికుడికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్బులు, నూనె, డ్రైస్సులు, గ్లౌస్, గన్షూస్ అందించి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంటారు. కానీ గత కొన్ని నెలలుగా కార్మికులకు రక్షణ కవచాలు ఇవ్వడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన సబ్బులతో శుభ్రం చేసుకుంటున్నారు. సరైన జీతాలు లేక జీవనం సాగిస్తున్న తమకు మరింత భారం పడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 36 వార్డుల్లో సుమారు 20వేల పైన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రతిరోజు 30 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు జరుగుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కార్మికులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.