-
ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...
మాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్ మోహన్లాల్, శోభనల జోడీ రిపీట్ కానుంది. మోహన్లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మోహన్లాల్గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’లో తొలిసారి కలిసి నటించారు మోహన్లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’లో మెహన్లాల్, శోభన లీడ్ రోల్స్లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్ ఆలియాస్ జాకీ రీలోడెడ్’లో మోహన్లాల్ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు. -
డైరెక్ట్గా ఓటీటీ స్టార్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ మోహన్లాల్ నటించిన చిత్రం తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. మోహన్లాల్, లిజో కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ డిజాస్టర్గా నిలిచింది. మోహన్లాల్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళం భాషలో మాత్రమే రిలీజైంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోనే రిలీజ్కు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని లేటేస్ట్ టాక్. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రంలో.. మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది, కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఓ మలయాళ డబ్బింగ్ సినిమా అదరగొడుతోంది. మూవీ పేరు 'నెరు'. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మోహన్ లాల్, ప్రియమణి ఇందులో లాయర్లుగా నటించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ.. మలయాళంలో 'సలార్'కి పోటీగా రిలీజై ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. అంతలా ఈ సినిమాలో ఏముంది? నిజంగా అంత బాగుందా? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'నెరు' కథేంటి? సారా మహమ్మద్ (అనస్వర రాజన్)కి కళ్లు కనిపించవు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తాడు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికల్ని గుర్తుంచుకున్న సారా.. అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుంది. దీంతో ఈ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైకేల్ (శంకర్ ఇందుచూడన్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతడి బడా పారిశ్రామికవేత్త కొడుకు కావడంతో.. ఎలాంటి కేసు అయినా సరే గెలిచేసే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుంది. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఆశ్రయిస్తారు. చాన్నాళ్ల నుంచి అసలు కోర్టుకే రాని విజయ్ మోహన్.. సారా తరఫున నిలబడి న్యాయం చేశాడా? లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'నెరు' సినిమా కథ చూస్తే అస్సలు కొత్తది కాదు. ఓ సాధారణ అమ్మాయి.. ఊహించని విధంగా ఆమెపై బలత్కారం.. కేసు వేసినా సరే న్యాయం జరుగుతుందా అనే డౌట్.. ఇలాంటి టైంలో లాయర్ అయిన హీరో ఎంట్రీ.. వాదప్రతివాదనలు.. చివరకు న్యాయం గెలిచిందా లేదా అనేది క్లైమాక్స్. అయితే మూవీ చూస్తున్నప్పుడు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ ప్రతి నిమిషం ఓ మంచి సినిమా చూస్తున్నామే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది అనుకునేలోపు.. అద్భుతమైన నటనతో నటీనటులు విజృంభిస్తుంటారు. ఈ రెండు సూపర్ అనుకునేలోపు దర్శకుడు.. తన స్క్రీన్ ప్లే మేజిక్ చూపిస్తుంటాడు. అంత బాగుంటుంది ఈ సినిమా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) హీరో బిల్డప్పులు.. ఎంట్రీ సాంగ్.. ఇలాంటి పనికిమాలిన రొటీన్ సీన్స్ ఏం లేకుండానే 'నెరు' కథని మొదలుపెట్టేశారు. కళ్లు కనిపించని అమ్మాయిపై అత్యాచారం జరగడం, దీంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడం.. అనుమానితుడు అయినా కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. అతడు తండ్రి కోటీశ్వరుడు కావడంతో ఫేమస్ క్రిమినల్ లాయర్ రంగంలోకి దిగడం.. అమ్మాయి తరఫు లాయర్ కన్ఫ్యూజన్.. దీంతో రేప్ చేశాడనే అనుమానమున్న కుర్రాడికి బెయిల్ రావడం.. ఇలా సీన్స్ అన్నీ చకాచకా పరుగెడుతుంటాయి. సరిగా అప్పుడు అమ్మాయి తరఫున వాదించేందుకు లాయర్ విజయ్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అప్పటి నుంచి సినిమా మరింత థ్రిల్లింగ్గా మారుతుంది. చివరి వరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు. ఇదే సినిమా విజయానికి కారణమైంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ వాటిని రాసుకున్న విధానం మాత్రం వేరే లెవల్ ఉంటుంది. ఈ రోజుల్లో సాంకేతికతని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు. తద్వారా నిందితుల్ని ఎలా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనేది క్లియర్ కట్గా చూపించారు. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు తమపై బలత్కారం జరిగితే ఎలా నిర్భయంగా ఎలా చెప్పగలుగుతున్నారో అనే సీన్ ఒకటి ఉంటుంది. చూస్తుంటే మీకు గూస్ బంప్స్ తో పాటు ఓ హై వస్తుంది. ఇక కేసు గెలిచిన తర్వాత విజయ్ మోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కావొచ్చు. చివర్లో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటే వచ్చే సీన్స్ కావొచ్చు. ఇలా బోలెడన్ని సన్నివేశాల మిమ్మల్ని విజిల్ వేసేలా చేస్తాయి. ఎవరెవరు ఎలా చేశారు? ఇందులో హీరోహీరోయిన్ అని ఎవరూ ఉండరు. నటించిన వాళ్లందరూ జస్ట్ పాత్రధారులంతే. మోహన్ లాల్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ.. సారా పాత్రలో నటించిన అనస్వర రాజన్ ఆయన్ని డామినేట్ చేసేసింది. కళ్లు లేని అమ్మాయిగా అద్భుతమైన నటనతో చించి అవతల పడేసింది. సినిమా చూసిన తర్వాత మీరు కచ్చితంగా ఆమెతో ప్రేమలో పడిపోతారు. అంతా బాగుంది మరి. ఇక డిఫెన్స్ లాయర్స్గా నటించిన సిద్ధిఖ్, ప్రియమణి కూడా ఉన్నంతలో డీసెంట్గా చేశారు. మిగిలిన వాళ్లకు పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. చివరగా రైటప్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గురించి చెప్పుకోవాలి. 'దృశ్యం' సినిమాలతో అందరికీ బుర్రతిరిగిపోయేలా చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు 'నెరు' మూవీతో కోర్టు రూమ్ డ్రామా సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. చివరగా ఒక్కమాట.. మన పవర్ రీమేక్ స్టార్ ఈ సినిమాని రీమేక్ చేసి చెడగొట్టే ముందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 'నెరు' చూసేయండి. ప్రస్తుతం హాట్స్టార్లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
ఓటీటీలో మోహన్లాల్ సూపర్ హిట్ మూవీ.. నెలరోజులకే..
ఓటీటీలు వచ్చాక ఇక్కడి సినీప్రియులు తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలనూ ఆదరిస్తున్నారు. అటు సినిమా మేకర్స్ కూడా తమ చిత్రాన్ని ఓటీటీలో వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు చూసేందుకు జనాలు గత కొంతకాలంగా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతున్నాయి. ఓటీటీలోకి నేరు తాజాగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'నేరు' మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్, శాంతి మాయాదేవి, సిద్దిఖి జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన నేరు గతేడాది డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలో రిలీజ్ ఇప్పటివరకుప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రిలీజైన నెలరోజులకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 23 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార -
PM Modi: గురువాయూరు గుడిలో ప్రధాని మోదీ పూజలు.. నూతన దంపతులకు ఆశీర్వాదం (ఫొటోలు)
-
సూపర్స్టార్ కొత్త మూవీ.. టీజర్ మాత్రం అదుర్స్!
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన కొత్త సినిమా 'మలైకోట్టై వాలిబన్'. లిజో జోస్ పల్లిచోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిలిమ్స్, మ్యాక్స్ ల్యాబ్, సరిగమ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా తీసిన ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ.. దర్శకుడి అద్భుత పనితనమని హీరో మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. టీజర్లో చూపించిన సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉంటుందని అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
సూపర్ హిట్ మూవీ సీక్వెల్లో పాక్ నటి.. ఫోటో వైరల్!
ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ నటి మహీరా ఖాన్. ఆమె త్వరలోనే మాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటిస్తోన్న ఎల్2: ఎంపురాన్లో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. మహీరా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్లాల్ సరసన కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈనేపథ్యంలో పృథ్వీరాజ్తో ఉన్న మహీరా పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో విడుదలైన లూసిఫర్ పార్ట్-2గా ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. మహీరా ఖాన్ విషయానికొస్తే.. 2017 బాలీవుడ్ చిత్రం రయీస్లో షారుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. అయితే 2016 యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. దీంతో నిషేధం తర్వాత ఆమె ఇండియాలో ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఇటీవలే పాకిస్థానీ కళాకారులపై ఉన్న నిషేధాన్ని ముంబై హైకోర్టు ఎత్తివేసింది. దీంతో మహీరా ఖాన్ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే. Is this an old photo?#PrithvirajSukumaran with #Mahirakhan pic.twitter.com/SvVMQG5MQD — AKV (@AnandKr13834547) November 26, 2023 View this post on Instagram A post shared by Mahira Khan (@mahirahkhan) -
శివకార్తికేయన్ సినిమా.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్లు!
ప్రస్తుతం మంచి రైజింగ్లో ఉన్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల ఈయన నటించిన మావీరన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు.. విశ్వ నటుడు కమల్ హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి శివకార్తికేయన్ సిద్ధమవుతున్నారు. కార్తికేయన్తో సీతారామం బ్యూటీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గత సెప్టెంబర్లోనే నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీతారామం చిత్రం ఫేమ్ మృణాల్ఠాగూర్ కథానాయికగా నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, అదేవిధంగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్లు తాజా సమాచారం. నటుడు మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు తుపాకీలో విలన్గా.. ఇప్పుడు.. ఇకపోతే విద్యుత్ జమ్వాల్ ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ -
Viral Pics: కేరళీయం 2023 వేడుకలు: ఒకే ఫ్రేమ్లో దిగ్గజాలు (ఫొటోలు)
-
వృషభ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే! ఆ సన్నివేశాలు హైలైట్!
మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జాతీయస్థాయి నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. తాజాగా ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభ: ది వారియర్స్ అరైస్. రోషన్ మేకా, షనాయా కపూర్, సహారా ఎస్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ తెలుగు ఫిలిమ్స్ ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై వరుణ్ మందుర్, సౌరవ్ మిశ్రా, ఏక్తా ఆర్ కపూర్, శోభాకపూర్, విశాల్ కుర్నానీ, జూసీ పరేక్ మేతా, అభిషేక్ వ్యాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమవగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ తండ్రి కొడుకుల మధ్య డ్రామా, ఎమోషన్, ప్రేమ, పగ, ప్రతీకారంతో కూడిన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు హైలైట్గా ఉంటాయన్నారు. ఇది 2024లో విడుదలయ్యే అత్యంత భారీ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర విడుదల తేదీని నవరాత్రి సందర్భంగా వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమిళం, హిందీ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. చదవండి: మ్యాచ్ చూసేందుకు వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ -
లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్
కోలీవుడ్లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్ యాక్టర్గా పేరుగాంచిన మోహన్లాల్ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు. (ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు) 350 చిత్రాలకు పైగా చేసిన మోహన్ లాల్ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్గా లూసిఫర్ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్లో కాంబినేషన్లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరంబలూర్తో కలిసి లైకా ప్రొడక్షనన్స్ సుభాస్కరన్ నిర్మిస్తుండడం మరో విశేషం. దీని గురించి లైకా ఫిలిమ్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్ పేర్కొన్నారు. -
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరో
‘కన్నప్ప’ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు డైటమిక్ హీరో మంచు విష్ణు. టెక్నీషియన్లను మొదలుకొని నటీనటుల వరకు పెద్ద పెద్ద వాళ్లనే తీసుకుంటున్నాడు. దీంతో కన్నప్ప మీద రోజు రోజు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో కీలకపై శివుని పాత్రలో ప్రభాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్కి జోడిగా..అంటే పార్వతిగా నయనతార నటించబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్లో మరో స్టార్ హీరో వచ్చి చేరాడు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్గా మోహన్ లాల్ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. Har Har Mahadev! ❤️ https://t.co/Q62cakbibp — Vishnu Manchu (@iVishnuManchu) September 30, 2023 -
విజయ్ ‘లియో’కి బాయ్కాట్ సెగ.. కారణం ఆ గొడవేనా?
వారసుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. విక్రమ్తో కమల్హాసన్కు భారీ విజయాన్ని అందించిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత విజయ్కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. తమిళ్ ప్రేక్షకులే కాదు ఆలిండియా సినీ అభిమానులు సైతం లియో చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి కేరళలో బాయ్కాట్ సెగ తగిలింది ట్రెండింగ్లో #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ విజయ్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, కన్నడ, కేరళలో డబ్ అయి విజయం సాధించాయి. అందుకే లియో చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్గా విడుదల చేస్తున్నారు. కేరళలో కూడా విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో లియో సినిమాకు వ్యతిరేకత ఎదురవుతుంది. లియో సినిమాను బహిష్కరించాలంటూ కొంతమంది కేరళ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో.. #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ ఎక్స్(ట్విటర్)లో ట్రెండ్ అవుతోంది. మోహన్లాల్ అభిమానులే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కారణమేంటి? పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న లియో సినిమాకు కేరళలో వ్యతిరేకత ఎదురవడానికి మోహన్లాల్ అభిమానులే కారణం. వాళ్లు అలా ట్రోల్ చేయడానికి కూడా కారణం ఉంది. 2014లో మోహన్లాల్, విజయ్ కలిసి ‘జిల్లా’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక కొంతమంది విజయ్ ఫ్యాన్స్.. మోహన్లాల్ నటనను అవమానిస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆ ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. తమ హీరోని అవమానించారు కాబట్టే.. విజయ్ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని మోహల్లాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్కి వ్యతిరేకంగా #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాయ్కాట్ హీట్ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. -
వెండితెరపై యుద్ధానికి సిద్ధం అవుతున్న స్టార్ హీరోలు
వెండితెరపై కథానాయకుడు కత్తి దూస్తే.. గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తే... విల్లు ఎక్కుపెడితే చూసే ప్రేక్షకులకు ఓ థ్రిల్. రెగ్యులర్గా వచ్చే ఫైట్స్కి భిన్నంగా సిల్వర్ స్క్రీన్పై ‘వార్’ కనిపిస్తే ‘వావ్’ అనకుండా ఉండలేరు. కొందరు హీరోలు వెండితెరపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. ఆ వారియర్స్ గురించి ఓ లుక్ వేయండి. దిక్కులెల్ల గెలిచినోడు.. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచినోడు.. ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’.. కంగువా’ సినిమాలో హీరోగా సూర్య పాత్రను చిత్రబృందం వివరించిన తీరు ఇది. దీన్నిబట్టి ఈ సినిమాలో సూర్య పాత్రను ఈ చిత్రదర్శకుడు శివ చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్ది ఉంటారని ఊహించవచ్చు. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో కనిపిస్తారు సూర్య. ఇప్పటికే ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాదు..‘కంగువా’ సినిమాలో ఈ సీన్స్ హైలైట్గా ఉంటాయని కోలీవుడ్ సమాచారం. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించారు. ‘కంగువా’ తొలి భాగం ఏప్రిల్లో విడుదల కానుంది. ది వారియర్ విభిన్న సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు హీరో మోహన్లాల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ లుక్ కొన్ని సీన్స్లో మోహన్లాల్ వారియర్గా కనిపిస్తారన్నట్లుగా స్పష్టం చేస్తోంది. దీనికి తోడు క్యాప్షన్లో ‘వారియర్’ ప్రస్తావన ఉండటంతో మోహన్లాల్ వారియర్గా కనిపించే నిడివి కూడా ఎక్కువే అని ఊహిస్తున్నారు ఆయన అభిమానులు. తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోషన్ ఓ హీరోగా నటిస్తున్నాడు. జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే మోహన్లాల్ నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘బరోజ్’. ఈ చిత్రంలో ఓ నిధిని కాపాడే యోధుడిగా కనిపిస్తారాయన. స్వయంభూ వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం.. వంటి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హీరో నిఖిల్. ఎందుకంటే ‘స్వయంభూ’ సినిమా కోసం. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపిస్తారు. నిఖిల్ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి స్థాయిలో ్రపారంభం కానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా ‘వార్’ బ్యాక్డ్రాప్లో దక్షిణాదిన మరికొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. -
సినిమాల్లో ‘గుండు’ కలిసొస్తుందా?, సక్సెస్ రేటెంత?
ఒకప్పుడు హీరో అంటే.. 6 అడుగల హైట్..మంచి హెయిర్ స్టయిల్, డ్రెసింగ్ కచ్చితంగా ఉండాలి. అభిమానులు కూడా తమ హీరోలో ఈ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. గుండుతో కనిపించినా సరే.. తమను అలరిస్తే బా‘గుండు’ను అంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోలే గుండుతో బాక్సాఫీస్ డీ కొడుతున్నారు. సినిమా సక్సెస్లోనూ ‘గుండు’ కీలక పాత్ర పోషిస్తోంది. షారుఖ్ సాహసం షారుఖ్ హెయిర్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మొదలు మొన్నటి పఠాన్ వరకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన హెయిర్ స్టైల్తో అభిమానులను అలరించాడు. అలాంటి షారుఖ్.. ‘జవాన్’ కోసం పెద్ద సాహసమే చేశాడు. తొలిసారి గుండుతో కనిపించి షాకిచ్చాడు. జవాన్లో కీలకమైన మెట్రో ట్రైన్ హైజాక్ సీన్లో షారుఖ్ గుండుతో దర్శనమించాడు. తెరపై గుండుతో షారుఖ్ కనిపించగానే అభిమానులు ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గుండుతో ధనుష్ ఢీ ధనుష్ తన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్నాడు. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ధనుష్ గుండుతోనే విలన్లను ఢీకొడుతాడట. గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ మోహన్లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ కథ బర్రోజ్. ఈ చిత్రానికి మోహన్లాలే దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. ఇందులో గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ కనిపించబోతున్నాడు. బాస్..గుండూ బాస్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఇప్పటి వరకు గుండుతో కనిపంచలేదు. అయితే భోళాశంకర్ కోసం గుండులో కనిపిస్తాడని అంతా భావించారు. ఎందుకంటే చిరంజీవియే స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ..అప్పట్లో ఓ వీడియో వదిలాడు. అందులో చిరు..జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్తో గుండు లుక్ని మౌల్డ్ చేయించుకున్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆ లుక్లో కనిపంచలేదు. కలిసొచ్చిన ‘గుండు’ చిత్ర పరిశ్రమలో ‘గుండు’ సక్సెస్ రేటు ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలు గుండుతో కనిపించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. శివాజీ చిత్రంలో రజనీకాంత్ గుండుతో సరికొత్త లుక్లో కనిపించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘గజనీ’ సినిమాలో సూర్య గుండుతో కనిపించారు. అదీ సూపర్ హిట్టే. ఇదే సినిమా హిందీ రీమేక్లో అమీర్ గుండుతో కనిపించాడు. అభయ్ చిత్రంలో కమల్ హాసన్ కూడా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మోహన్ బాబు శివశంకర్ చిత్రంతో గుండుతో కనిపించగా.. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు. -
వృషభ.. మళ్లీ ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్!
మోహన్లాల్, రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ‘మన్యం పులి’ తర్వాత మోహన్లాల్, పీటర్ హెయిన్స్ కాంబినేషన్లో ఆ తరహా యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మా సినిమాకు వర్క్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేది తదితరులు కీలక పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్ కానుంది. -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత
ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్నో అద్భుతమైన సినిమాల తీసి, స్టార్ డైరెక్టర్గా పేరు గడించిన సిద్ధిఖీ (63) కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో సీరియస్ కండీషన్లో ఉన్న ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హీరోయిన్ కీర్తి సురేశ్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరో మోహన్లాల్ తదితరలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఏం జరిగింది? సోమవారం మధ్యాహ్నం దర్శకుడు సిద్ధిఖీకి గుండెపోటు వచ్చింది. దీంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. లివర్ సంబంధిత సమస్యలతోపాటు న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. మరోవైపు ఈయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో చికిత్స అందించినట్లు మాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆయనకు ఏం కాదని, త్వరగా కోలుకుంటారని అనుకున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రాణాలు వదిలేశారు. (ఇదీ చదవండి: బెడ్పై కదల్లేని స్థితిలో.. మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్) సిద్దిఖీ ఎవరు? సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. డైరెక్టర్ కమ్ స్క్రీన్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్. మలయాళంలో మోహన్లాల్కు సిద్దిఖీ బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అద్భుతమైన సక్సెస్లు అందుకున్నాయి. విచిత్రం ఏంటంటే సిద్దిఖీ తీసిన తొలి సినిమా 'రాంజీరావు స్పీకింగ్'. చివరి సినిమా 'బిగ్ బ్రదర్'. ఈ రెండింటిలోనూ మోహన్లాల్ హీరో కావడం విశేషం. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి బాండింగ్ ఎలా ఉండేదోనని.. తెలుగులోనూ అలానే మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని అద్భుతమైన సినిమాల్లో ఒకటైన 'హిట్లర్' కథ ఈయనదే. మలయాళంలో అదే పేరుతో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే చిరు.. తెలుగులో రీమేక్ చేశారు. పలు భాషల్లో రీమేక్ అయిన 'బాడీగార్డ్' ఒరిజినల్కు దర్శకుడు ఈయనే. తెలుగులోనూ నితిన్ హీరోగా 'మారో' అనే మూవీ తీశాడు. కాకపోతే ఇది ఆడలేదు. దీంతో సిద్దిఖీ మరో తెలుగు సినిమా చేయలేదు. 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్దిఖీ ఇలా చనిపోవడం ఇండస్ట్రీకి తీరనిలోటు. 💔 pic.twitter.com/DJrV2IKZc6 — Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2023 RIP Deepest condolences to the family 🙏 pic.twitter.com/LXjkvvxxBl — Prabhudheva (@PDdancing) August 8, 2023 (ఇదీ చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!) -
వృషభ నాకో అందమైన జర్నీ
‘మూన్ లైట్ (2016), త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ’ (2017) వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా, సహనిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో తొలిసారి భారతీయ భాషా చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మోహన్ లాల్, రోషన్ మేక తండ్రీ కొడుకులుగా, శనయ కపూర్, జహ్రా ఖాన్ కీ రోల్స్లో నటిస్తున్న ‘వృషభ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నిక్. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ – ‘‘వృషభ’ నా ఫస్ట్ ఇండియన్ మూవీ. నేను చేస్తున్న తొలి బహు భాషా సినిమా కూడా ఇదే. ‘వృషభ’ నాకో అందమైన జర్నీ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
రోషన్ లీడ్ రోల్లో వృషభ షురూ
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, రోషన్ లీడ్ రోల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, మలయాళం) ‘వృషభ’. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జహ్రా ఎస్ ఖాన్ , షానయ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ వ్యాస్, ఏక్తా కపూర్, విశాల్గుర్నాని, జుహీ పరేహ్ మెహతా, శ్యామ్ సుందర్, శోభాకపూర్, వరుణ్ మాథుర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి ఊహ క్లాప్ కొట్టారు. మోహన్ లాల్, రోషన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట నందకిశోర్. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తెలుగు, మలయాళంతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
రోషన్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు
‘నిర్మలా కాన్వెంట్’ (2016)లో లీడ్ రోల్ చేసి, ‘పెళ్లి సందడి’ (2021)తో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్తో హీరోగా సినిమాలు సైన్ చేశారు. రోషన్ ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాలు అంగీకరించడం విశేషం. కన్నడ దర్శకుడు నందకిశోర్ దర్శకత్వంలో రోషన్–మోహన్లాల్ కాంబినేషన్లో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ఆరంభం కానుంది. తండ్రీ–కొడుకుల అనుబంధం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందనుంది. రోషన్ నటించనున్న మరో పాన్ ఇండియా చిత్రం వైజయంతీ మూవీస్–స్వప్నా సినిమా బేనర్లపై రూపొందనుంది. నూతన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్
హీరో అంటే ఫ్యాన్స్కి స్టయిలిష్గా కనబడాలి.. హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్, వాకింగ్... ఇలా అన్నీ స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే అన్నట్లు ఉండాలి. ఫ్యాన్స్ ఇలానే కోరుకుంటారు. కానీ తమ హీరోని ‘గుండు’లో చూడాలనుకోరు. ఒకవేళ గుండులో కనిపించే క్యారెక్టర్ చేస్తున్నారని తెలిస్తే ‘బాగుండునా!’ అని చర్చించుకుంటారు. చివరికి లుక్ చూశాక ఈ క్యారెక్టర్ చేస్తే ‘బాగుండు’ అనుకుంటారు. మరి.. గుండులోనూ స్టయిలిష్గా కనిపిస్తే ఎందుకు కాదంటారు. ఇక ఈ లుక్లో చిరంజీవి, మోహన్లాల్, ధనుష్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. భోళా శంకర్లో... వెండితెరపై ఇప్పటివరకూ చిరంజీవి గుండుతో కనిపించలేదు.. ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిమాండ్ చేసింది.. అంతే.. గుండుతో కనిపించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్ ఇది. తమిళ వెర్షన్లో అజిత్ పూర్తి గుండుతో కనిపించలేదు... అయితే దాదాపు ‘హెడ్ షేవ్’ చేసుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం నున్నటి గుండుతో కనిపించనున్నారు. అయితే జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్తో చిరంజీవి గుండు లుక్ని మౌల్డ్ చేశారు టెక్నీషియన్స్. ఆ వీడియోను చిరంజీవి షేర్ చేసి, నిపుణుల పని తీరుని మెచ్చుకున్నారు కూడా. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఫ్లాష్బ్యాక్లో గుండుతో కనిపిస్తారట. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా కథానాయికగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. నిధిని కాపాడే బర్రోజ్ ఒక నిధిని కాపాడే పని మీద ఉంటాడు బర్రోజ్. వాస్కోడగామా దాచిన నిధి అది. వాస్కోడగామా నిజమైన వారసునికి మాత్రమే ఆ సంపద దక్కాలి. వారికి నిధిని అప్పగించే బాధ్యతను తీసుకున్న బర్రోజ్ 400 ఏళ్లుగా ఆ నిధిని కాపాడుకుంటూ వస్తాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. టైటిల్ రోల్లో నటిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మోహన్ లాల్. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ గెటప్ ఈ సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. బాలల చిత్రంలా రూపొందిస్తున్నారనీ, పెద్దలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. భారతీయ తొలి త్రీడీ చిత్రం ‘మై డియర్ కుట్టి సైతాన్’ దర్శకుడు జీజో పున్నూస్ ఈ త్రీడీ ‘బర్రోజ్’కి కథ, స్క్రీన్ప్లే అందించారు. ఈ ఏడాది ఓనమ్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. యాభైయ్యవ సినిమాలో గుండుతో... నటుడిగా కెరీర్లో 50వ మైల్ స్టోన్ చేరుకున్నారు ధనుష్. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే డైరెక్టర్గా ఆయనకిది తొలి చిత్రం కాదు. దర్శకుడిగా ‘పవర్ పాండీ’ (2017) మొదటి చిత్రం. ఆ చిత్రంలో ఓ అతిథి పాత్ర కూడా చేశారు. ఐదేళ్ల తర్వాత ధనుష్ మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో గుండుతో కనిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఆరంభమైంది. చిత్రీకరణ ఆరంభించక ముందు తిరుమల వెళ్లి ధనుష్ తలనీలాలు సమర్పించుకున్నారు. ఎలానూ ఈ చిత్రంలో గుండుతో కనిపిస్తారు కాబట్టి దైవాన్ని దర్శించుకుని, తల నీలాలు సమర్పించి ఉంటారని కోలీవుడ్ అంటోంది. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
మోహన్ లాల్ బర్త్ డే.. ఖరీదైన కారు కొనిచ్చిన ఫ్రెండ్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కు సర్ప్రైజ్ ఇచ్చాడు అతని ప్రాణ స్నేహితుడు. మే 21న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన బహుమతి ఇచ్చి అభిమానం చాటుకున్నారు. మోహన్ లాల్కు సరికొత్త కియా ఈవీ-6 ఎలక్ట్రిక్ కారును గిప్ట్గా ఇచ్చాడు. ఈ లగ్జరీ ఎస్యూవీ కారు విలువ దాదాపు రూ. 65 లక్షలకు పైగానే ఉంది. సూపర్ స్టార్ తన భార్యతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) మోహన్ లాల్ ఆదివారం తన 63 వ పుట్టినరోజును జరుపుకున్నారు. తెలుగులోనూ పలు చిత్రాలో నటించారు. ఆయన తన పుట్టిన రోజును కొంతమంది నిరుపేద పిల్లల సమక్షంలో జరుపుకున్నారు. వారితో కాసేపు సరదా మాట్లాడి కేక్ కట్ చేశారు. అంతే కాకుండా 2019 వరద రెస్క్యూ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన కోజికోడ్కు చెందిన వ్యక్తికి మోహన్లాల్ ఇంటిని కూడా విరాళంగా ఇచ్చారు. (ఇది చదవండి: వెయిటర్గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని) కాగా.. మోహన్లాల్ ప్రస్తుతం 'మలైకోట్టై వాలిబన్'లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by TOI ETimes Malayalam (@etimesmalayalam) -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత పీకేఆర్ పిళ్లై(92) కన్నుమూశారు. మాలీవుడ్లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో సమస్యలతో త్రిసూర్ జిల్లా మందన్చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మోహన్ లాల్తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. (ఇది చదవండి: నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని) షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా మోహన్లాల్ బ్లాక్బస్టర్ హిట్లను అందించారు. పిళ్లై చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా చిత్రమ్. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మోహన్లాల్ నటించారు. ఈ సినిమా రెండు థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడిన ఘనత సాధించింది. ఈ చిత్రం తరువాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో వరుసగా అల్లుడుగారు, ప్యార్ హువా చోరీ చోరీ, రాయరు బండారు మావన మానేగే, ఎంగిరుంధో వందన్గా రీమేక్ చేశారు. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్తేజ్ ఎంగేజ్మెంట్?) పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చారు పిళ్లై. 1984లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ షిర్డీ సాయి క్రియేషన్స్పై వేప్రాళం అనే చిత్రాన్ని నిర్మించాడు. మొదట ఎర్నాకులం లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు త్రిస్సూర్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement