‘పంచె ’కు పెద్దపీట
- అడ్డుకుంటే ఏడాది జైలు
- అసెంబ్లీలో ముసాయిదాను ప్రవేశపెట్టిన సీఎం జయ
- 14,623 పోలీస్ పోస్టుల భర్తీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళుల సంప్రదాయ పంచెకట్టుకు పెద్దగౌరవమే దక్కింది. సాక్షాత్తు ప్రభుత్వమే పంచెకట్టుకు పెద్దపీట వేసింది. అడ్డుకున్నవారికి అరదండాలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. పంచెకట్టు గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ముఖ్యమంత్రి జయలలిత కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. పంచెకట్టుకు ఇంతటి ప్రాధాన్యత దక్కడం వెనుక పెద్ద రాద్దాంతమే నడిచింది. నగరానికి చెందిన కొందరు మద్రాసు క్రికెట్ క్లబ్లో జూలై 10వ తేదీన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి హరిపరంధామన్ను ముఖ్యఅతిథిగా, సీనియర్ న్యాయవాదులు స్వామినాథన్, గాంధీ అతిథులుగా ఆహ్వానించారు. ముగ్గురు అతిథులు ఈ కార్యక్రమానికి పంచెలు ధరించి హాజరయ్యూరు. అరుుతే ఈ క్యార్యక్రమానికి క్లబ్కు ఎటువంటి సంబంధం లేదు.
పంచెకట్టుపై తమ క్లబ్లో నిషేధం ఉన్నందున లోనికి వెళ్లరాదని క్లబ్ నిర్వాహకులు వారిని అడ్డుకుని తిప్పి పంపివేశారు. హైకోర్టు న్యాయమూర్తి వంటి అత్యున్నత హోదాలో ఉన్న వారిని క్లబ్ నిర్వాహకులు అవమానించిన సంఘటన రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే లేపింది. సంప్రదాయవాదులంతా మండిపడ్డారు. న్యాయవాదులు నిరసనలు చేశారు. క్లబ్వైఖరిని ఎండగడుతూ పాఠశాలల విద్యార్థులు సైతం పంచెలు ధరించి హాజరైనారు. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి జయలలిత గత నెల 16వ తేదీన ఒక ప్రకటన చేశారు. పంచెకట్టుకు జరిగిన పరాభవాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. నిబంధనల పేరుతో క్లబ్లు, సంఘాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని ఆమె తమిళ ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ మేరకు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ముసాయిదా బిల్లును ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జయ అసెంబ్లీలో మాట్లాడుతూ, భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి వ్యక్తికి తనకు ఇష్టమైన వస్త్రాలను ధరించే హక్కు ఉందని అన్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పంచెకట్టుకు ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. తమకు ఇష్టమైన వస్త్రాలను ధరించాలనే నియమాలు బ్రిటీష్కాలం నాటి రోజులను గుర్తుకు తెచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంప్రదాయాన్ని అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని క్లబ్లు, సాంస్కృతిక సంఘాలు, వ్యక్తిగత సంఘాలు, సామాజిక సేవా సంఘాలు ఇలా ఏరకమైన వారైనా సరై పంచెక ట్టుకుంటే తగిన శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేసినట్లు రుజువైనా, ఉద్దేశపూర్వకంగా తప్పిదం జరగలేదని నిరూపితమైనా, తన ప్రమేయం లేకుండా ఈ ఘటన చోటుచేసుకుందని నిరూపించుకున్నా శిక్ష పడదని అన్నారు. అయితే ఇవేమీ నిరూపణ కాని పక్షంలో నిందితునికి ఏడాదిపాటూ జైలు, రూ.25వేలు జరిమానా తప్పదని జయలలిత పేర్కొన్నారు. అంతేగాక పంచెకట్టుపై ఎవరు అభ్యంతరాలు లేవనెత్తినా, ప్రవేశం లేదని అడ్డుకున్నా ఆయా సంఘాలు, క్లబ్బుల అన్ని అనుమతులు రద్దు చేస్తామని బుధవారం ప్రవేశపెట్టిన ముసాయిదాలో ఆమె స్పష్టం చేశారు.
మహిళారక్షణలో మాదే పైచేయి : జయ
దేశం మొత్తం మీద మహిళలకు రక్షణ కల్పించడంలో తమిళనాడును మించినది లేదని సీఎం జయ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఒక్కరోజునే 9 మంది మహిళల బంగారు గొలుసుల అపహరణ చోటుచేసుకుందని డీఎండీకే సభ్యులు చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకు ఆమె బదులిస్తూ, అధికారపక్షాన్ని విమర్శించడం కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేయరాదని హితవు పలికారు. అదే పార్టీకి చెందిన మరో సభ్యుడు చంద్రకుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో 8 గంటల పనివేళలను ప్రవేశపెట్టాలన్నారు. దీన్ని జయ అడ్డుకుంటూ, రాష్టంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు 14,623 పోలీ సు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
పోలీసు శాఖ 8 గంటల పనివేళల పరిధిలోకి రాదని, అయినా వారి శ్రమకు తగిన జీతభత్యాలు, ఇతరత్రా ప్రతిఫలాన్ని ఇస్తున్నామని స్పష్టం చేశారు. అనేక కేసుల్లో చిక్కుకున్న డీఎండీకేకు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు లేదని ఆమె విమర్శించారు. గత పదేళ్లుగా తమపై కేసులు లేవని, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాతనే కేసులు బనాయిస్తున్నారని చంద్రకుమార్ ప్రతివిమర్శ చేశారు. మళ్లీ జయ అందుకుంటూ 2011లో వేలూరు ఎమ్మెల్యేగా పార్దిబన్పై కేసులున్న సంగతి ప్రస్తావించగా, డీఎండీకే సభ్యులంతా అడుకున్నారు. తమవాదనను వినిపించే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. అయితే స్పీకర్ ధనపాల్ నిరాకరించడంతో డీఎండీకే సభ్యులంతా వాకౌట్ చేశారు.