కమ్యూనిస్టుల హామీల వర్షం! 

Left parties manifesto to the Election Commission - Sakshi

ఎన్నికల సంఘానికి వామపక్షాల మేనిఫెస్టోలు 

100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు: బీఎల్‌ఎఫ్‌ 

ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: సీపీఐ 

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌తోపాటు సీపీఐ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు పోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. నిరుద్యోగ భృతి, ఏడాదిలోగా లక్ష ఉద్యోగాల భర్తీ.. ఒకే విడతలో రూ.2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, రైతులు, వ్యవసాయ కార్మికులకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పింఛన్లు, 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వంటి హామీలను ప్రకటించాయి. బీఎల్‌ఎఫ్‌తోపాటు సీపీఐ తమ మేనిఫెస్టోను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌కు తాజాగా సమర్పించాయి.  

బీఎల్‌ఎఫ్‌ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. 
రైతులకు, రైతు కూలీలకు..: రైతులకు పెట్టుబడికి సరిపోయే రుణాన్ని బ్యాంకులు, సహకార సంస్థల నుంచి సమకూర్చుతాం.
పంటకు గిట్టుబాటు ధర, మార్కెట్‌ సదుపాయం.
కౌలుదారు చట్టం అమలు, గుర్తింపు కార్డుల జారీ. 
- రైతులకు అందించే రాయితీలన్నీ కౌలుదారుకు వర్తింపు.
భూమిలేని వ్యవసాయ కూలీలకు మిగులు భూమి పంపిణీ.
ప్రాధాన్యక్రమంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం. 
విత్తన చట్టాన్ని తక్షణమే ఆమోదించి అమలు. 
పారిశ్రామిక రంగం...: కనీస వేతనం రూ.18 వేలకు తగ్గకుండా నిర్ణయం.
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.
మూతబడిన పరిశ్రమల పునరుద్ధరణ. 
ఉద్యోగ–ఉపాధి..: ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ. 
- ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల అమలుకు కృషి.
100 రోజుల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. 
విద్య–వైద్యం..: అందరికీ ఉచిత విద్య, కామన్‌ స్కూలు విధానం అమలు.
-పేదలకు ఉచిత వైద్యం, ‘కార్పొరేట్‌ వైద్యం’నియంత్రణ, ప్రభుత్వ ఆరోగ్య రంగ పటిష్టత. 
సామాజిక సమస్యలు..: కులవివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, కులదురహంకార దాడులు, హత్యలకు పాల్పడినవారికి కఠిన శిక్ష.
గిరిజన, మైనార్టీ, బీసీల రిజర్వేషన్ల పెంపునకు కృషి.
సబ్‌ప్లాన్‌ చట్టాల్లోని లోపాలను సవరించి ఎస్సీ, ఎస్టీ బడ్జెట్‌లో నిధులు పూర్తిగా ఖర్చు.
దళిత, గిరిజన, దిగువ కులాల ప్రజలు అధికంగా ఉన్న వ్యవసాయ కార్మికులకు సమగ్ర సామాజిక చట్టం తేవడం.
గుర్తింపు కార్డులు, పింఛన్లు జారీ.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణ అమలు.
తక్షణమే బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా రూ.5లక్షల వరకు రుణాలు.
గిరిజనులకు 10 శాతం, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల పెంపు. 
భూమిలేని పేదలకు 3 ఎకరాల చొప్పున పంపిణీ.
డప్పు కొట్టేవాళ్లు, చెప్పుల కుట్టేవాళ్లకు నెలకు రూ.3వేల పింఛన్‌.
- కులాంతర వివాహాలు చేసుకున్నవారికి రూ.2 లక్షల ప్రోత్సాహం, ఒకరికి ఉద్యోగం, ఇల్లు.
కులాంతర వివాహాల రక్షణకు చట్టం.
గిరిజన వర్సిటీ ఏర్పాటు, తండాల అభివృద్ధికి పంచాయతీ బోర్డు ఏర్పాటు.
బీసీలకు సబ్‌ప్లాన్, 50 ఏళ్లు నిండిన వృత్తిదారులకు జ్యోతిరావు పూలే నేస్తం ద్వారా నెలకు రూ.3వేల పింఛన్, ప్రమాద బీమా.
అర్హులైన అందరికీ ఇళ్ల స్థలం, అక్కడే డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణం, అప్పటి వరకూ ప్రతినెలా ఇంటి అద్దె చెల్లింపు.
గీత కార్మికులకు ప్రమాద బీమా. ∙చనిపోయినా, శాశ్వత వికలాంగులుగా మారినా రూ.10 లక్షలు, తాత్కాలిక వికలాంగులుగా మారితే రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా.
ఏజెన్సీ ఏరియాల్లో రద్దయిన సొసైటీలను పునరుద్ధరించి ఫెడరేషన్‌గా ఏర్పాటు చేసి రూ. 5 వేల కోట్లు బడ్జెట్‌ కేటాయింపు.
ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా. ∙ప్రతీ గ్రామంలో 10 ఎకరాలను గొర్రెల మేతకు కేటాయింపు.
ఆశ్రిత (23) కులాలకు కుల గుర్తింపు కల్పించి, సర్టిఫికెట్ల జారీ.
వికలాంగుల పింఛన్‌ రూ.5 వేలకు పెంపు.
55 ఏళ్లు దాటిన వ్యవసాయ కార్మికులకు పింఛన్లు.
50 ఏళ్లు నిండిన రైతులకు, 55 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు రూ.3వేల పింఛన్‌.
100 యూనిట్లలోపు విద్యుత్‌ ఉచితం. ∙200 యూనిట్లు వాడిన వారికి తొలి 100 యూనిట్లు ఉచితం.
ఆర్టీసీకి రాష్ట్ర బడ్జెట్‌లో ఒక శాతం నిధుల కేటాయింపు.
చదువుల సావిత్రి పథకం కింద అమ్మాయి పుట్టగానే రూ.50వేలు, ఇంటర్‌ పాసైతే రూ.50 వేలు, డిగ్రీకి రూ.లక్ష, పీజీకి రూ.3 లక్షలు.
ఇంజనీరింగ్‌కు రూ. 5 లక్షలు, మెడిసిన్‌కు రూ.25 లక్షలు చెల్లింపు.
నిరుద్యోగ భృతి, ఇంటర్‌ చదివిన వారికి రూ.3 వేలు, డిగ్రీ ఆపైన రూ.5 వేలు చెల్లింపు.
వృద్ధాప్య పింఛన్‌ను రూ.2 వేలకు పెంచి, భార్యాభర్తలకు చెల్లింపు, ఒంటరి మహిళకు రూ.3 వేలు చెల్లింపు.
ప్రతీ కుటుంబానికి 200 లీటర్ల మినరల్‌ వాటర్, ఒక్కొక్కరికి 10 కిలోల రేషన్‌ బియ్యం ఉచిత సరఫరా.

సీపీఐ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... 
60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3 వేల పింఛన్‌. నిజాంకాలంనాటి భూ చట్టాలను సమూలంగా మార్చి, కొత్త చట్టాల రూపకల్పన. ఒకేవిడతలో రూ.2 లక్షలు వ్యవసాయ రుణమాఫీ. ప్రైవేట్‌ అప్పుల నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు కేరళ తరహాలో చట్టంలో మార్పులు. కౌలు రైతులకు రూ.4వేలు పెట్టుబడి పథకం అమలు. వ్యవసాయ కార్మికుల దినసరి కనీస వేతనం రూ.400కు పెంపు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి 6 నెలల్లో లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఏడాదిలో భర్తీ. నిరుద్యోగులకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు. కార్మికుల కనీసం వేతనం నెలకు రూ.18 వేలకు పెంపు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. జనాభా దామాషా పద్ధతిలో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు. పిల్లలకు ఉద్యోగాలు ఉన్నప్పటికీ అర్హులైన వృద్ధులకు పింఛన్లు. ప్రభుత్వ సంస్థల్లోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, హమాలీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు. క్రిస్టియన్‌ మైనార్టీలకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయింపు. అర్హులందరికీ గృహ నిర్మాణం కోసం రూ.8 లక్షలు మంజూరు ఇళ్లులేనివారికి 150 గజాల స్థలం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top