‘మోదీ- షా గూండాలు నాశనం చేస్తున్నారు’

Priyanka Gandhi Meets Students In AIIMS Slams BJP Over JNU Violence - Sakshi

బాధిత విద్యార్థులను పరామర్శించిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన ఇండియా ప్రతిష్టను మోదీ- షా గూండాలు నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. యూనివర్సిటీల్లో చొరబడి.. మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న పిల్లలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం తీవ్ర స్థాయిలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు యూనివర్సిటీలో చొరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడికి తెగబడ్డారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 

ఈ క్రమంలో ప్రియాంక గాంధీ... ఆస్పత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను  పరామర్శించారు. అనంతరం ట్విటర్‌ వేదికగా నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలీసులు సైతం విద్యార్థులను చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. ‘ ఇది చాలా దారుణ ఘటన. ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులు నాతో మాట్లాడారు. గూండాలు క్యాంపస్‌లోకి ప్రవేశించి.. కర్రలు, ఇతర ఆయుధాలతో తమపై దాడి చేశారని చెప్పారు. ఎంతో మందికి తలపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు తన తలపై పదే పదే కాలితో తన్నాడని ఓ విద్యార్థి నాతో చెప్పాడు. అయినప్పటికీ బీజేపీ నాయకులు మాత్రం మీడియా ముందు తమ గూండాలు ఈ హింసకు పాల్పడలేదని నటిస్తున్నారు. ఈ గాయాన్ని మరింతగా అవమానిస్తూ.. అందరినీ ఏమారుస్తున్నారు’ అని ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక అమానుష ఘటనకు మీరే కారణమంటూ వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top