ఆగంతకుడి ఇంజెక్షన్ కలకలం


ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో శనివారం కలకలం రేగింది.  బైక్పై వచ్చిన ఓ ఆగంతకుడు ఇద్దరు విద్యార్థినులకు ఇంజెక్షన్ ఇచ్చాడు. హఠాత్తు పరిణామంతో భయపడ్డ  వారిద్దరూ కేకలు వేయడంతో ఆగంతకుడు పరారయ్యాడు.  ఏడవ తరగతి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు రోడ్డుపై వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.  జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలపటంతో వారిని భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.



బైక్‌పై వచ్చిన ఆగంతకుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నాడని, వయసు పాతికేళ్ల వరకూ ఉండవచ్చని విద్యార్థినులు తెలిపారు. అతడు చేసిన ఇంజక్షన్‌ ఏంటో, దాని ప్రభావం ఎలా ఉంటుందోనని కంగారు పడుతున్నారు. మరోవైపు ఓ అమ్మాయి కోలుకుందని, ఇంకో అమ్మాయికి కాలు కాస్త నొప్పిగా ఉందని ఆమెకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదమూ లేదని డాక్టర్లు చెప్పారు.



ఈ ఘటనపై ఉండి ఎస్ఐ వర్మ మాట్లాడుతూ ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, వీడియో పుటేజ్ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top