పుట్టింటికి చేరి..మళ్లీ భర్తతో కలిసి ఉంటానంటూ | Sakshi
Sakshi News home page

కూతురిని హతమార్చిన తల్లి

Published Wed, May 15 2019 2:16 PM

Mother Kills Daughter Over Constant Arguments In Maharashtra - Sakshi

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. కూతురి ప్రవర్తనతో విసిగిపోయిన ఓ తల్లి ఆమెను హతమార్చింది. ఈ ఘటన మంగళవారం పుణేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవని బొభాటే(34) అనే మహిళ భర్త, కూతురు రితుజా(19)తో కలిసి బారామతిలోని ప్రగతినగర్‌లో నివసిస్తోంది. వీరిది ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబం. కాగా కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి రితుజా  కులాంతర వివాహం చేసుకుంది. అయితే కేవలం రెండు నెలల్లోనే భర్తతో గొడవ పడి పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో కూతురికి నచ్చజెప్పి తిరిగి అల్లుడికి దగ్గరికి పంపించేందుకు సంజీవని ప్రయత్నించింది. కానీ రితుజా ఇందుకు అంగీకరించలేదు.

నీతోనే కలిసి ఉంటా.. అక్కర్లేదు..
ఇదిలా ఉండగా.. రితుజా తన భర్తపై అత్యాచార కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో రితుజాతో కేసు వాపసు తీసుకునేలా చేసిన ఆమె తల్లిదండ్రులు.. కాపురానికి తీసుకువెళ్లాల్సిందిగా అల్లుడిని కోరారు. ఇందుకు రితుజా ఒప్పుకొన్నా ఆమె భర్త మాత్రం అంగీకరించలేదు. అయితే తనను ఎలాగైనా భర్త ఇంటికి పంపించాలంటూ మంగళవారం రితుజా తల్లితో మరోసారి గొడవకు దిగింది. ఈ క్రమంలో కూతురి ప్రవర్తనతో విసుగు చెందిన సంజీవని... ఆమెను చితకబాది, తలపై బండతో బలంగా కొట్టింది. దీంతో రితుజా అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో సంజీవనిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement