
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్కు పయనం కానుంది.
ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. దీంతో బలమైన టీమ్ను ఇంగ్లండ్కు పంపించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైట్ బాల్ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న అర్ష్దీప్ సింగ్కు పిలుపునివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
గత కొనేళ్ల నుంచి భారత టెస్టు జట్టులో ఎడమచేతి వాటం పేసర్ లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఆ లోటు అర్ష్దీప్తో భర్తీ చేయాలని అగర్కాకర్ అండ్ కో యోచిస్తున్నట్లు వినికిడి. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్కు రాలేదు.
తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా 26 ఏళ్ల అర్ష్దీప్కు ఉంది. 2023లో కౌంటీ సీజన్లో కెంట్ తరపున సింగ్ ఆడాడు.
ఒకవేళ అర్ష్దీప్ ఇంగ్లండ్ టూర్కు ఎంపికైతే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్లతో బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రసిద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ పేర్లను కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రోహిత్ శర్మ స్దానాన్ని తమిళనాడు బ్యాటర్ సాయిసుదర్శన్తో భర్తీ చేయనున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు