-
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం 1వ ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు ఆ కళాశాల ప్రిన్సిపల్, కో–ఆర్డినేటర్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ కౌన్సెలింగ్ మొత్తం 78 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లను పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్లో భాగంగా మంగళవారం 12,001వ ర్యాంకు నుంచి 27 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ ఎస్.సుధీర్రెడ్డి, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఉదయ్కుమార్, డాక్టర్ ఎస్వీ.గౌరీశంకర్, పాల్గొన్నారు. ఉద్యానవన రైతులకు మరింత ప్రోత్సాహం శ్రీకాళహస్తి (తొట్టంబేడు) : ఉద్యాన వనాలు పెంచే రైతులకు ఉపాధి పనులద్వారా తగిన ప్రోత్సాహం అందిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పథక సంచాలకులు శ్రీనివాసప్రసాద్ తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమనాడు పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నేరిమిట్ట చెరువులో 45 మంది కూలీలు పని చేస్తుండగా.. ఇకపై రోజూ 150 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని ఫీల్డ్అసిస్టెంట్ సంపూర్ణను ఆదేశించారు. మునగ, మామిడి తోటల పెంపకం ద్వారా రైతులు ఆదాయాలు పొందవచ్చని చెప్పారు. ఉపాధి పనులకు వచ్చే కూలీలకు రోజువారీ కూలి రూ.300 తగ్గకుండా వచ్చేలా చూడాలని, వారానికి 3 వేల మంది కూలీలకు పనులు కల్పించాలని ఏపీఓ దినేష్ను ఆదేశించారు. పీడీ వెంట ఏపీడీ ప్రేమ్, జిల్లా కంప్యూటర్ అధికారి భానుప్రకాష్, టీఏ చలపతి ఉన్నారు.దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి ఎడ్యుకేషన్ : విజయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) విద్యాసంస్థలో వివిధ డిప్లొమో కోర్సులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ హెడ్ డాక్టర్ సీహెచ్.శేఖర్ తెలిపారు. మూడేళ్ల కాలవ్యవధి ఉన్న డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సులకు పదో తరగతి విద్యార్హత, రెండేళ్ల కాలవ్యవధి ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ–పీపీటీ) కోర్సుకు బీఎస్సీ విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి సిపెట్ అడ్మిషన్ టెస్టును జూన్ 9వ తేదీన నిర్వహించి, అందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 150 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ‘సీఐపీఈటీ24.ఆన్లైన్రిజిస్ట్రేషన్ఫార్మ్.ఓఆర్జీ/సీఐపీఈటీ’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 63001 47965 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. హుండీ ఆదాయం రూ.33 లక్షలు రాపూరు: పెంచలకోనని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన తాత్కలిక హుండీల కానుకల లెక్కింపులో భారీ రాబడి వచ్చిందని డీసీ విజయసాగర్, సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి ఏసీ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఆరు రోజులకు గాను వచ్చిన కానుకలను శ్రీవారి అలంకార మండపంలో లెక్కించారు. ఇందులో మొత్తం నగదు రూ.33,76,445 నగదు, బంగారం 44.9 మిల్లీ గ్రాములు, వెండి 3.9 కిలోలు వచ్చినట్టు వెల్లడించారు. -
కవ్వింపు చర్యలొద్దు
తిరుపతి క్రైమ్: అభ్యర్థులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్థన్రాజు హెచ్చరించారు. వచ్చే నెల 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలోని ఎస్ఐ స్థాయి నుంచి పోలీస్ అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల సమస్యలొచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన విధులు నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ రోజున సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున గెలుపోటములతో సంబంధంలేకుండా ఇరు పార్టీల అభ్యర్థులకు ఎస్కార్ట్ ఇచ్చి నేరుగా ఇంటికాడ వదిలేస్తామన్నారు. సంబరాలు చేసుకోవాలంటే ఎలక్షన్ కోడ్ ముగిశాక పోలీస్ అనుమతులతో చేసుకోవచ్చని చెప్పారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని, దీనిని ధిక్కరిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
2న సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్ 2వ తేదీన తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరగనుంది. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 18 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,872 శ్లోకాలను పండితులు పారాయణం చేయనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రామకార్యం కోసం హనుమంతుడి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించనున్నారు. కౌంటింగ్ హాళ్లలో ‘హలో’కట్ తిరుపతి అర్బన్: ఎన్నికల కౌంటింగ్ హాళ్లలో సెల్ఫోన్లకు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్పీ హర్షవర్థన్రాజు స్పష్టం చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు సైతం సెల్ఫోన్లు కౌంటింగ్ కేంద్రానికి తీసుకు రావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రధాన గేటు వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్ కేంద్రంలో సెల్ఫోన్లు భద్రపరుచుకోవాలని సూచించారు. -
విశ్వం స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి వరదరాజ నగర్లోని విశ్వం విద్యాసంస్థలో సోమవారం విశ్వం సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల స్టడీ మెటీరియల్స్ను ఎమ్మెల్సీ, అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ.రామచంద్రరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సైనిక్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకుతో పాటు 60కిపైగా సీట్లను, నవోదయ ఫలితాల్లో 57 సీట్లు సాధించడం అభినందనీయన్నారు. విశ్వం విద్యాసంస్థల్లో సైనిక్, మిలిటరీ, నవోదయ తదితర పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న విశ్వం విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డిని అభినందించారు. అనంతరం విశ్వం విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గడిచిన 34 ఏళ్లలో సైనిక్ ఫలితల్లో 41 రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకులతో పాటు 910 సీట్లు సాధించినట్టు వెల్లడించారు. పోటీ పరీక్షలకు సంబంధించి పూర్తి సమాచారానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథరెడ్డి, అపుస్మా రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, పుల్లయ్య పాల్గొన్నారు. -
క్రేన్ ఢీకొని వృద్ధురాలి మృతి
సైదాపురం: క్రేన్ ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండల కేంద్రమైన సైదాపురం దళితవాడకు చెందిన మల్లారపు పోలమ్మ(74) పూలు విక్రయిస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమె సోమవారం ఉదయం ఇంటికి కూరగాయాలు తెచ్చుకునేందుకు సైదాపురం బస్టాండ్కు వెళ్లింది. తిరుగు ప్రమాయణంలో ఆమె వెనుకాలే క్రేన్ వాహనం వస్తోంది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ వృద్ధురాలిని ఢీకొట్టాడు. ఆమెకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలమ్మ మరణానికి కారకులైన అనకాపల్లి జిల్లాకు చెందిన బీ.నరేష్ అనే క్రేన్ డ్రైవర్పై కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. క్రేన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ డీఎస్ విజయ్కుమార్ తెలిపారు. మాఫియాకు అడ్డగా పీహెచ్సీ సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పదుల సంఖ్యలో క్రేన్లు, జేసీబీలను నిలుపుతుంటారు. పగలంతా పీహెచ్సీలోనే ఉంచుకుని రాత్రి పూట అక్రమ మైనింగ్ తవ్వకాలకు తీసుకెళ్లి మళ్లీ వెళ్లి ఉదయాన్నే ఆరోగ్య కేంద్రం వద్ద అడ్డదిడ్డంగా నిలిపేస్తుంటారు. రోగులకు ఇబ్బందులు కలుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పీహెచ్సీ ఆవరణలో ఇతర వాహనాలేవీ లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
37 మందిపై హత్యాయత్నం కేసు
చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన వరుస హింసాత్మక ఘటనలపై పోలీస్శాఖ స్పందించింది. దాడులకు తెగబడ్డ అరాచక శక్తుల ఆటకట్టించేందుకు సన్నద్ధమైంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో భయానక వాతావరణం కల్పించిన క్రిమినల్స్కు ముకుతాడు వేసేందుకు సమాయత్తమైంది. ప్రశాంత చంద్రగిరిలో రౌడీ మూకలపై చర్యలకు దిగింది. ఈ మేరకు 37 మందికిపైగా కేసులు నమోదు చేసింది. ఎన్నికల కౌంటింగ్లోనూ అరాచకాలకు పాల్పడకుండా హెచ్చరికలు జారీ చేసింది. ● ఎన్నికల సంఘం సీరియస్ ● తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ ● అరాచకాలకు పాల్పడిన వారిపై నాన్బెయిలబుల్ కేసులు వీరిపైనే కేసులు 1.మబ్బు దేవనారాయణరెడ్డి 2. పులిగోరు మురళీకృష్ణారెడ్డి 3. డాలర్స్ దివాకర్రెడ్డి 4. దేవేర మనోహర్ 5. బడి సుధాయాదవ్ 6. సురేష్రెడ్డి 7. సి.మనోహర్రెడ్డి 8. గణపతి నాయుడు 9. గౌస్బాషా 10. మొగరాల మధు 11.పనబాకం సుబ్రమణ్యంనాయుడు 12. జేబీ రమణ 13. జేబీ శ్రీనివాస్ 14.సురేష్నాయుడు 15.నాగరాజునాయుడు 16.పురపర్తివారిపల్లె మధు 17.భాస్కరపేట దామోదర్ 18.బాబురెడ్డి 19.నరసింహారెడ్డి 20.బాబుయాదవ్ 21.తిరుమలరెడ్డి 22.రాశెట్టి మోహన్ 23.బలిజపల్లె రెడ్డి 24.ధర్మతేజ 25. ఎస్.అఫ్రీద్ 26. వి.గురవయ్య 27. యశ్వంత్ 28. సురేష్ 29. శ్రీధర్ 30. గురుప్రకాష్ 31. ప్రతాప్ 32. దాము 33. రాకేష్ 34. హేమాంభర రావు 35. చిన్నబాబు 36. కేశవులునాయుడు 37. ఏజీపల్లె బాల మరికొందరు సాక్షి, తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి నగరంలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అరాచక శక్తులపై కేసులు నమోదు చేయాలని పోలీస్శాఖను ఆదేశించింది. ఈ మేరకు పలువురిపై కేసులు నమోదు చేయించింది. మొదట కూచువారిపల్లెలో రెండు గంటలకు పైగా వాహనాలను దగ్ధం చేయడం, ఇల్లు తగలబెట్టడం, కొందరిని చెప్పులతో కొట్టడం, గన్మన్ను కట్టేసి కొట్టడం, కొందరిపై మూత్రం పోసి కొట్టడం లాంటి అత్యంత హేయమైన చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఆ తర్వాత ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రం వద్ద దారిలో వెళ్తున్న యాత్రికులు, ప్రయాణికులపై దాడి చేయడం, కనబడిన వారిని చితకబాదడం, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం, పబ్లిక్గా ఎంఆర్ పల్లె సీఐపై రాడ్తో తల పగలగొట్టడం, నిలబెట్టి ఉన్న ద్విచక్ర వాహనాలను కాల్చివేయడం, ఈ దాడుల్లో ఒకతనికి కన్నుపోవడం, అనేక మంది రక్త గాయాలతో ఆస్పత్రిపాలు కావడం, వైద్యం కోసం స్విమ్స్కు వెళ్లిన వారిపై ఐసీయూలో దాడిచేయడం లాంటి భయానక పరిస్థితులను తీవ్రంగా పరిగణించింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో అనేకమందిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న కారణంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్శాఖ సీరియస్ అయ్యింది. ఈ దాడులను ప్రోత్సహించిన, దాడులకు పాల్పడిన 37 మందితోపాటు మరికొందరిపై 147, 148, 323, 324, 307, 506 రెడ్ విత్ 149, 120బీ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా మళ్లీ అరాచక పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం దీన్ని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు పాల్పడింది. అరాచకాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీస్శాఖ సిద్ధమవుతోంది. ఈ ఘటనల వీడియోల ఆధారంగా చిత్తూరు నుంచి వచ్చి దాడులకు పాల్పడిన కొందరు వ్యక్తుల కోసం పోలీస్ శాఖ గాలిస్తోంది. -
ఎం.కొంగరవారిపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
తానొకటి తలిస్తే.. విధిఒకటి తలుస్తుందనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. భార్యకు మెరుగైన వైద్యం అందించేందుకు కారులో తమిళనాడుకు బయలుదేరిన కుటుంబాన్ని డ్రైవర్ కునుకు రూపంలో మృత్యువు కబళించింది. నలుగురిని శాశ్వత నిద్రలోకి నెట్టేసింది. మొదలే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ అభాగ్యురాలిని మృత్యువు అంచుకు చేర్చింది. కాళ్లు రెండూ విరిగిపోయి విలవిల్లాడుతూ భర్త పడుతున్న బాధ చూపరులను కలచివేస్తోంది. ఈ ఘటన చంద్రగిరి మండలంలో సోమవారం తెల్లవారు జామున తీవ్ర విషాదం నింపింది. ● డివైడర్ను ఢీకొట్టిన కారు ● నలుగురు మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ● డ్రైవర్ అతివేగం, నిద్రమత్తే కారణం ● మృతులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారే నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం డ్రైవర్ సమీర్ మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో క్రేన్ సాయంతో వెలికి తీసేందుకు యత్నిస్తున్న సీఐ రామయ్యవిడిపోయిన ఇంజిన్ భాగాలు అతి వేగంగా డివైడర్ను కారు ఢీకొనడంతో కారు ముందు భాగంలోని ఇంజిన్తో పాటు ఇతర విడి భాగాలు చెల్లచెదురుగా పడిపోయాయి. ఇంజిన్ మొత్తం కారు నుంచి విడిపోయి డివైడర్ ముందు కాలువలో పడిపోయింది. కారులోని బ్యాటరీ సుమారు 40 అడుగుల దూరంలో పడిపోవడం చూస్తుంటే కారు ఎంత వేగంగా వెళ్లిందో అంచనా వేయవచ్చు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు కారు డివైడర్ను ఢీకొని, అక్కడే ఉన్న కాలువలో ఇరుక్కుపోయింది. మృతదేహాలను వెలికితీయడం కష్టతరంగా మారింది. పోలీసులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు క్రేన్ సహాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి కారును సర్వీసు రోడ్డుపై ఉంచి.. గడ్డపారలతో అతికష్టం మీద మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. చంద్రగిరి: కారు డ్రైవర్ కునుకు నలుగురి ప్రాణాలు తీసింది. మరో ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి ఎ.కొంగరవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. నెల్లూరు జిల్లా, ఇందుకూరిపేట మండలం, నరసాపురం గ్రామానికి చెందిన ఆడిగోపుల శ్రీనివాసులు, నీరజ దంపతులు. తన భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు భర్త శ్రీనివాసులు ఆదివారం రాత్రి అదే గ్రామానికి చెందిన సురేంద్ర వద్ద ఏపీ26బీహెచ్ 3435 హుండయ్ క్రేట కారును తీసుకున్నాడు. ఆపై డ్రైవర్ సహాయంతో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో తమిళనాడు రాష్ట్రం, వేలూరు సీఎంసీకి బయలుదేరాడు. తోడుగా సోదరుడు శేషయ్య, ఆయన భార్య జయంతి వచ్చారు. మార్గమధ్యంలో మనుబోలు వద్ద నీరజ తల్లి పద్మావతమ్మను కారులో ఎక్కించుకున్నారు. మరో గంటలో ఆస్పతికి మరో గంటలో వేలూరు సీఎంసీకి చేరుకుంటారనగా.. ఇంతలో ఒక్కసారిగా వారిని మృత్యువు కబళించింది. డ్రైవర్ సమీర్(26) నిద్రలోకి జారుకోవడంతో రహదారి పక్కనే ఉన్న డివైడర్ను కారు అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవరు సమీర్తో పాటు శేషయ్య(49), ఆయన భార్య జయంతి(42), పద్మావతమ్మ(58) అక్కడికక్కడే మృతి చెందారు. కారు వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాసులు, నీరజ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సీఐ రామయ్య తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. నీరజ పరిస్థితి విషమం క్షతగాత్రులు శ్రీనివాసులు, నీరజ తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నీరజకు బలమైన గాయాలు తగిలాయి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉందన్నారు. శ్రీనివాసులు తలకు తీవ్ర గాయం కావడంతోపాటు, కాళ్లు రెండూ విరిగిపోయాయి. ఈ మేరకు వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతదేహాల అప్పగింత ప్రమాదంలో మృతి చెందిన పద్మావతమ్మ, శేషయ్య, జయంతి, డ్రైవరు సమీర్ మృతదేహాలకు వైద్యాధికారులు సోమవారం సాయంత్రం పోస్టుమార్గాన్ని పూర్తిచేసి ప్రత్యేక వాహనంలో నెల్లూరుకు తరలించారు. అనంతరం వాటిని ఇందుకూరిపేటలోని స్వగ్రామానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మిన్నంటిన రోదనలు రుయా ఆస్పత్రి ప్రాంగణం శ్రీనివాసులు, నీరజ బంధువుల రోదనలతో మార్మోగింది. అన్నకు తోడుగా వెళ్లిన సోదరుడు శేషయ్య, ఆయన భార్య జయంతి మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారి కుటుంబీకులు గుండెలు బాదుకుంటూ.. ఆర్తనాదాలు చేయడం అక్కడి వారిని కలచివేసింది. క్షతగాత్రులు, మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. -
చంద్రగిరిలో అరాచకం వద్దు.. అభివృద్ధే ముద్దు
● 30 ఏళ్లలో ఇంత ఆరచకం ఎన్నడూ చూడలేదు ● కరోనాలో ప్రత్యర్థి పార్టీ వారిని సైతం ఆదుకున్న గొప్ప వ్యక్తి చెవిరెడ్డి ● టీడీపీ నాయకుల్లో నమ్మకం కోల్పోయిన వ్యక్తి పులివర్తి నాని ● ఇకనైనా నటనలకు స్వస్తి పలికి ప్రజలకు దగ్గరవ్వండి ● మీడియా సమావేశంలో చంద్రగిరి వైఎస్సార్సీపీ నాయకుల వెల్లడి తిరుపతి కల్చరల్: ‘చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి అరాచకాలను మేము చూడలేదు.. 1978 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఉద్ధండులు చంద్రగిరి నుంచి పోటీ చేశారు.. అయినా ఎప్పుడూ ఇలాంటి దారుణమైన సంఘటనలు చోటుచేసుకోలేదు’ అని వైఎస్సార్సీపీ నాయకులు దామినేటి కేశవులు, మల్లం చంద్రమౌళిరెడ్డి, మస్తాన్, చిన్నియాదవ్, అవిలాల లోకనాథరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి పోలింగ్ ముగిసేంత వరకే రాజకీయాలు చేస్తారని, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే కలసిమెలసి ఐక్యంగా ఒక్కటైపోతుంటారని చెప్పారు. అయితే 2019లో చిత్తూరు నుంచి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన పులివర్తి నాని తన అరాచక సంస్కృతిని వెంట తీసుకొచ్చారన్నారు. ఇతర పార్టీల నేతల మధ్య అంతరం పెంచారని, ఆపై మెల్లగా చంద్రగిరికి రౌడీయిజాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు జరుగుతున్న ఘర్షణకు కూడా పులివర్తి నాని, ఆయన కుమారుడు వినీల్, భార్య పులివర్తి సుధారెడ్డిలే కారణమన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో మంది టీడీపీ నాయకులకు ప్రాణభిక్ష పెట్టిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు అండగా నిలబడకుండా పారిపోయిన పులివర్తినాని ఎమ్మెల్యే చెవిరెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకుల్లో నాని నమ్మకం కోల్పోయారు కాబట్టే వైఎస్సార్సీపీ నుంచి ప్రలోభపెట్టి కొంత మంది నాయకులను తీసుకుని వారినే పక్కనపెట్టుకుని నామినేషన్ వేశారని.. ఇది నిజం కాదని కాణిపాకంలో ప్రమాణం చేయగలరా..? అని ప్రశ్నించారు. పద్మావతీ యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనతో ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని, పోలింగ్ రోజున చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామంలో పులివర్తినాని, ఆయన కుమారుడు వినీల్ దగ్గరుండి మోహిత్రెడ్డి వెంట వచ్చిన కారును, వైఎస్సార్సీపీ సర్పంచ్ ఇంటిని తగల బెట్టారని చెప్పారు. మోహిత్ నామినేషన్ రోజున రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద వంద మీటర్లు దాటి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ రావద్దని ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పడంతో పది మంది మాత్రమే అక్కడ నిలబడ్డామన్నారు. అయితే పులివర్తి నాని మాత్రం 200 మంది కార్యకర్తలతో అక్కడకు చేరుకుని పోలీసులు ఆపుతున్నా నెట్టుకుని ముందుకు వచ్చారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి కారుపై విచక్షణా రహితంగా టీడీపీ జెండా కర్రలు, రాళ్లుతో దాడి చేసినప్పటికీ మౌనంగా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. అందరికీ నేనున్నాను అంటూ అండగా నిలిచే ఎమ్మెల్యే చెవిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఇకనైనా పులివర్తి నాని చిల్లర రాజకీయాలు మానుకుని చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యం ఒక చోట.. ఎక్స్ రే మరోచోటా? మహిళా వర్సిటీ వద్ద తనపై దాడి జరిగినందున కాలు, చేయి విరిగిందని చెబుతున్న పులివర్తి నాని అక్కడి నుంచి నేరుగా స్విమ్స్కి వెళ్లాలని మీడియా సాక్షిగా ఆధారాలు చూపించారు. అయితే స్విమ్స్లో వైద్యం తీసుకుంటూ కాలుకు తగిలిన ఎక్స్ రే రిపోర్టు మాత్రం ప్రయివేటుగా నడుపుతున్న బాబు హాస్పిటల్లో ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. అధికారం కోసం ఇంతలా దిగజారిపోయే వ్యక్తిని తాము ఎన్నడూ చూడలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. -
కౌంటింగ్లో ఆర్వోలదే తుది నిర్ణయం
తిరుపతి అర్బన్: కౌంటింగ్లో ఆర్వోలదే తుది నిర్ణయమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. జూన్ 4న 6 గంటలకు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోగానే కౌం టింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరవాలని, ఓట్ల లెక్కింపులో ఏవైనా సందేహాలుంటే ఆర్వోలతో మాట్లాడి నివృతి చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లు ఏవిధంగా లెక్కించాలి, వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్ ఓట్లను ఏ విధంగా పరిగణించాలనే అంశంపై జిల్లాలో రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. కౌంటింగ్ ఏర్పాట్లన్నీ జూన్ 3వ తేదీకి పూర్తవ్వాలని సూచించింది. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేయగా.. అక్కడే కేంద్ర పరిశీలకులతోపాటు కౌంటింగ్ సిబ్బంది ఉంటారని పేర్కొంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిబ్బందికి వేర్వేరు యూనిఫాంలు ఇవ్వనున్నట్టు తెలిపింది. స్ట్రాంగ్ రూంల ఓపెన్ ఇలా.. ఓట్ల లెక్కింపులో భాగంగా స్ట్రాంగ్ రూంలను కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే తెరుస్తారు. ఈవీఎంలను నమోదు చేసుకునేందుకు స్ట్రాంగ్ రూంలో ఒక నోడలాఫీసర్ ఉంటారు. ఈవీఎంలను కౌంటింగ్ గదిలోకి తీసుకురాగానే వాటికి సీల్ సరిగా ఉందా లేదా పరిశీలిస్తారు. ఈవీఎంలలో బ్యాటరీలు పని చేయకపోతే మార్చి ఆన్ చేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే వివరాలను ఎన్కోర్ యాప్లో నమోదు చేసిన అనంతరం ఫలితాలను ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు వెల్లడిస్తారు. -
117 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్
తిరుపతి(అలిపిరి): తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరానికి చెందిన 117 మంది విద్యార్థినులు వివిధ సంస్థల క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగ నియామకం పొందారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ డీఈఓ భాస్కర్ రెడ్డి, ఆర్జేడీ నిర్మల్ కుమార్ప్రియ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికై న విద్యార్థినులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా. అసుంత, ఆధ్యాపకులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న కారు
● కారు దగ్ధం, ఇద్దరికి స్వల్ప గాయాలు చంద్రగిరి: ప్రమాదవశాత్తు కారు డివైడర్ను ఢీకొట్టింది. ఇందులో కారు దగ్ధమవగా, ఇద్దరు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, తొండవాడ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తిరుపతి రూరల్ మండలం, ఉప్పరపల్లికి చెందిన కల్యాణ్, చరణ్ సొంత పనులపై వెర్న కారులో బెంగళూరుకు పయనమయ్యారు. తొండవాడ కూడలి వద్ద వెళ్తున్న క్రమంలో కారు ఆదుపు తప్పి వేగంగా డివైడర్ను ఢీకొంది. అనంతరం కారు జాతీయ రహదారి నుంచి బోల్తా కొట్టుకుంటూ పక్కన రోడ్డుపై పడింది. వెంటనే కారులో నుంచి మంటల వ్యాపించడంతో, అందులో ప్రయాణిస్తున్న కల్యాణ, చరణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షణాల వ్యవధిలో కారు అగ్నికి ఆహుతైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కలెక్టరేట్లో మోడల్ కౌంటింగ్
● కౌంటింగ్పై సంపూర్ణ అవగాహన కోసమే ● పలు అంశాలను వెల్లడించిన కలెక్టర్తిరుపతి అర్బన్: స్థానిక కలెక్టరేట్లో సోమవారం మోడల్ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. కౌంటింగ్పై సంపూర్ణ అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీన తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ భవనాల్లో కౌంటింగ్ ఎలా చేపడుతామో... అలానే మోడల్ కౌంటింగ్ను వంద శాతం చేపట్టాలని స్పష్టం చేశారు. జూన్ 4వ తేదీన ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటలకు కొనసాగుతుందని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యలో కౌంటింగ్ ఆపకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి వాహనాలనూ కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. కళాశాల ప్రధాన గేటు వద్ద నుంచి కౌంటింగ్ కేంద్రం వరకు అవసరమై మేరకు బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చుకోవాల్సిన పూర్తిబాధ్యత ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులదేనన్నారు. కౌంటింగ్పై అనుమానాలు ఉంటే ముందే నివృత్తి చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. తిరుపతి జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్, ఒక పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ చేపట్టాల్సి ఉంటుందన్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ హాలులో వీడియోగ్రపీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే ఆర్వోలు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను సరి చూసుకోవాలని తెలిపారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎం నోడల్ అధికారి కోదండరామిరెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సుశీలాదేవి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, రిటర్నింగ్ అధికారులు నిశాంత్రెడ్డి, రవిశంకర్రెడ్డి, చంద్రముని, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు -
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
దొరవారిసత్రం : బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం వెదురుపట్టు గ్రామ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం.. సూళ్లూరుపేట పట్టణానికి చెందిన శ్రీహరి కూరగాయల దుకాణంలో పని చేస్తున్నాడు. సొంత పనిపై ఎన్ఎం అగ్రహారం గ్రామానికి వచ్చి తిరిగి సూళ్లూరుపేటకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి చైన్నెకి వెళ్లుతున్న స్పోర్ట్స్ బైక్ అతివేగంగా శ్రీహరిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108లో సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్పై ప్రయాణించే సాయిదినకరన్ కూడా గాయపడ్డాడు. శ్రీహరి మృతదేహాన్నికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. పక్షుల కేంద్రంలో మంటలు దొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఆవరణలోని అటవీ ప్రాంతానికి ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీన్ని గుర్తించి స్థానిక ఫారెస్టు సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో పాటు నాయుడుపేట అగ్ని మాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మంటలు పక్షులు ఉన్న చెరువు వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. గుర్తుతెలియని ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టి ఉండవచ్చని సిబ్బంది అనుమానిస్తున్నారు. -
ఏజెంట్లకు ఎన్నికల నిబంధనలు
తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు హాజరుకానున్న ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే. టేబుల్స్ను బట్టి అసెంబ్లీకి, పార్లమెంట్కు ఏజెంట్లునును కేటాయిస్తారు. ఏజెంట్ల అర్హతలు ఇవే 18 ఏళ్లు నిండిన వ్యక్తులను ఏజెంట్లు నియమించుకోవచ్చు. భారత పౌరసత్వం ఉన్న ఎన్నారైలు కూడా ఏజెంట్లగా ఉండొచ్చు. సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏజెంట్లగా వెళ్లడానికి అనుమతి ఉంటుంది. కౌంటింగ్ హాలులోకి అభ్యర్థిని లేదా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కు అనుమతి ఇస్తారు. ఏజెంట్లకు అవసరమైన ఆహార ఖర్చు అభ్యర్థే భరించాలి. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకొనే వారు కౌటింగ్ ఏజెంట్లకు అనర్హులు. -
వ్యక్తి మృతిపై కేసు నమోదు
కోట: గోవిందపల్లిలో ఇన్నమాల క్రిష్ణయ్య(60) అనుమానాస్పద స్థితి మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగబాబు సోమవారం తెలిపారు. చిల్లకూరు మండలం కొమరవారిపాళెంకు చెందిన క్రిష్ణయ్య శనివారం గోవిందపల్లిలో ఉన్న తన కుమారై దివ్య ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం నిద్రలోనే మృతి చెందాడు. ఆయన మృతిపై అనుమానాలున్నాయని సోదరులు పోలయ్య, ముత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ చేపడతామని ఎస్ఐ తెలిపారు. -
త్వరితగతిన ఫలితాలు
తిరుపతి అర్బన్: ఓట్ల లెక్కింపు త్వరితగతిన నిర్వహించడంతోపాటు కచ్చితమైన ఫలితాలను వెల్లడించాలని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ సూచించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతోపాటు రాష్ట్ర ఎన్నికల అధికారులతో కౌంటింగ్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ స్ఫూర్తితో కౌంటింగ్ నిర్వహించాలన్నారు. ఇప్పటికే ఐదు దశల్లో పోలింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. తిరుపతి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రవీణ్కుమార్, డీఆర్వో పెంచలకిషోర్, నోడల్ అధికారుల ఇన్చార్జి చంద్రశేఖర్నాయుడు పాల్గొన్నారు. -
May 28: తిరుమలలో నేటి భక్తుల రద్దీ..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్ మెంట్లు నిండాయి. నిన్న 81,831 భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.25 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల దేవస్థానం వెల్లడించింది. -
శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ ఝామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు.చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ రాకెట్ను రూపొందించింది. సొంత ల్యాంచ్ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఎనిమిది గంటల కౌంట్డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ సోమవారం సాయంత్రమే షార్కు కూడా చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగం నిలిపివేశారు.ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్ను ఇందులో ఉపయోగిస్తున్నారు. -
రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
చంద్రగిరి/హనుమాన్జంక్షన్ రూరల్: రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఆడిగోపుల శ్రీనివాసులు తన భార్య నీరజకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల(సీఎంసీ)కు తీసుకువెళ్లేందుకు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ సమీర్(26)తో కలిసి ఆదివారం రాత్రి కారులో బయలుదేరారు. వారితోపాటు శ్రీనివాసులు అన్న శేషయ్య(49), ఆయన భార్య జయంతి(43) కూడా ఉన్నారు.మార్గమధ్యంలో మనుబోలు వద్ద నీరజ తల్లి పద్మావతమ్మ(56)ను సైతం వీరు కారులో ఎక్కించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5.40గంటల సమయంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఎం.కొంగరవారిపల్లి సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవరు సమీర్, పద్మావతమ్మ, జయంతి, శేషయ్య అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, నీరజలకు తీవ్ర గాయాలపాలయ్యారు. చంద్రగిరి సీఐ రామయ్య తన సిబ్బందితో కలసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వారిద్దరినీ 108 అంబులెన్స్లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఘటనాస్థలంలోనే నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద... కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా వేదసంతూర్కు చెందిన స్వామినాథన్ తన కుటుంబంతో కలిసి పదేళ్లుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అడ్వొకేట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న స్వామినాథన్ తమిళనాడులోని సొంతూరులో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి కారులో బయలుదేరారు. ఆయన కారును మితిమీరిన వేగంతో నడపటంతో కోడూరుపాడు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద అదుపు తప్పి రహదారి మధ్యలోని డివైడర్ను దాటుకుని అవతల వైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న స్వామినాథన్(40), ఆయన కుమార్తె రాధాప్రియ(14), కుమారుడు రాకే‹Ù(12), సోదరుడి కుమారుడు గోపి(23) అక్కడికక్కడే మృతిచెందారు. స్వామినాథన్ భార్య సత్య(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హనుమాన్జంక్షన్ సీఐ అల్లు నవీన్ నరసింహామూర్తి, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, గన్నవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, ట్రైనీ డీఎస్పీ వేదశ్రీ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ఎర్రచందనం పట్టివేత
తిరుపతి మంగళం: రాపూరు సమీపంలోని మళ్లమ్మకోన బాట వద్ద ఆరు ఎర్రచందనం దుంగలతోపాటు ఒక కారును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ అటవీశాఖ అధికారులు వై. మస్తాన్, ఎం. ప్రవీణ్ కుమార్ ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారులో ఎర్రదుంగలను లోడ్ చేయడం గమనించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టుముట్టేందుకు యత్నించగా స్మగ్లర్లు అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో కారు, ఎర్రదుంగలను స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. సీఐ జి. శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘కోడ్’ ఉల్లంఘించిన ఉద్యోగి చంద్రగిరి : ఎన్నికల కోడ్ను టీటీడీ టైం స్కేల్ ఉద్యోగి ఉల్లంఘించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రగిరి పాతపేట రెడ్డివీధికి చెందిన నాగరాజు టీటీడీ టైం స్కేల్ వాహన బేరర్గా గోవిందరాజ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ధార్మిక సంస్థలో పనిచేస్తూ రాజకీయనేతను పరామర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై టీటీడీ అధికారులు విచారించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్ చిల్లకూరు : పాత ఇనుప సామాను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని అంకుపాటూరు గ్రామంలో మూత బడిన ఎస్బీక్యూ స్టీల్ పరిశ్రమలో పాత సామాను నెల్లూరు హౌసింగ్ బోర్డుకు చెందిన తిరుమల వడివేలు, అరవ శేఖర్ అపహరించి ఆటోలో తరలిస్తుండగా కంపెనీ భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ సిరాజ్ వెంటనే స్పందించి నిందితులను వెంటాడి ఆటోలోని సామానుతో పాటుగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టు హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చిల్లకూరు : మండలంలోని కడివేడు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. సైదాపురం మండలం గిద్దలూరుకు చెందిన వేణుగోపాల్(55) చిల్లర దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కోట పట్టణంలోని తన బంధువుల ఇంటికి బైక్పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఉండగా కడివేడు వద్ద నేదురుమల్లి రాజ్యలక్ష్మి గిరిజన కాలనీ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొన్నాడు. 108 వాహనంలో క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వేణుగోపాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థిని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక అభిషేకపూజలు, అలంకరణలు చేశారు. సాయంత్రం శ్రీస్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపుగా ఆస్థాన మండపానికి తీసుకు వచ్చి వేదికపైకి కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి సామూహికంగా సంకట హర చతుర్థి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు స్వర్ణ రథోత్సవం నయనానందకరంగా సాగింది. అశేష భక్తులు జై గణేషా..జైజై గణేశ అంటూ స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. దేవస్థానం ఈఓ వెంకటేశ్వర్లు, ఏఈఓ విద్యాసాగర్, అధికారులు కోదండపాణి, వాసు రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయం జోలికొస్తే సహించం
తిరుపతి రూరల్ : హథీరాం బావాజీ ఆలయం జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని గుడి నిర్మాణ కమిటీ కన్వీనర్ శివనాయక్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని బావాజీ ఆలయం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారితో పాచికలు ఆడిన బావాజీ ఆలయాన్ని నిర్మిస్తే హథీరాంజీ మఠం ఏఓ రమేష్నాయుడు కూలగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బంజారా జాతి ఆరాధ్యదైవంగా బావాజీని కొలుస్తుంటారని, అందుకే బంజారాలందరం విరాళాలు వేసుకుని ఆలయం నిర్మించామన్నారు. రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ హథీరాంజీ మఠం అధికారులు మాత్రం బావాజీ గుడి నిర్మాణానికి సహకరించలేదని, పైగా కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా.. హథీరాం బావాజీ ఆలయాన్ని కూల్చివేసేందుకు ఏఓ రమేష్నాయుడు విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని వెల్లడించారు. సాధిక్ బాషాతో కలిసి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రమేష్నాయుడు ప్రోద్బలంతో సాధిక్బాషా 50 మంది రౌడీలతో కలిసి శనివారం ఆలయాన్ని కూల్చివేసేందుకు వచ్చి బీభత్సం సృష్టించారన్నారు. ఆలయ పూజారిని రమేష్నాయుడు కులం పేరుతో దూషించి, కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రమేష్నాయుడు, సాధిక్బాషాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్, ఎస్పీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు శివనాయక్ తెలిపారు. దీనిపై ఏఓ రమేష్నాయుడిని వివరణ కోరగా మఠం భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు యత్నించామని, అందులో భాగంగానే సాధిక్బాషాను సాయం కోరినట్లు వెల్లడించారు. -
కౌంటింగ్లో ఏజెంట్లు కీలకం!
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్లు లెక్కింపును జూన్ 4వ తేదీన తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఆ మేరకు ఇప్పటికే 95శాతం ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రశాంతవాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ రోజున వివిధ పార్టీల ఏజెంట్లు సైతం కీలక పాత్ర పోషించనున్నారు. ఇందుకోసం నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందని పలువురు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని కోరుతున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తిరుపతి అర్బన్ : ఓట్ల లెక్కింపులో ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రధానంగా లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన నిబంధనలపై ఏజెంట్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. లేదంటే కౌంటింగ్ ప్రక్రియ గందరగోళంగా మారే ప్రమాదం ఉంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారమ్–17సీ ఎంతో కీలకమైనది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులకు దీనిపై అవగాహన ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారమ్–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూసుకోవాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, అక్కడ వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారమ్లోనే నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చినవారి సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారి సంఖ్య, ఓటు వేసేందుకు పీఓ అనుమతించని వారి సంఖ్య, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారమ్–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు. వినియోగించని పేపరు సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి. పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల తదితర అంశాలను నిశితంగా గుర్తించాల్సి ఉంటుంది. నిబంధనలపై అవగాహన అవసరం నిశిత పరిశీలనకు ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో అత్యంత అప్రమత్తం వరుస క్రమంలో లెక్కింపు కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు పరిశీలకులతో ఓట్లు లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యకు ఫారమ్–17సీ, పార్టు–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్యకు సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్ యూనిట్లన్నిటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కిస్తారు. వివరాలు తప్పుగా నమోదు చేసిన కౌంటింగ్ పరిశీలకుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అసాధారణంగా ఇద్దరు అభ్యర్థులకు కౌంటింగ్ ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితం ప్రకటిస్తారు. తేడా వస్తే..! కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్తో పాటు ఫారమ్–17సీలోని వివరాలను ఏజెంట్లు తప్పనిసరిగా రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూసిన పోలైన మొత్తం ఓట్లు, ఫారమ్–17సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరో కారణంతో కానీ కంట్రోల్ యూనిట్ ఫారమ్–17సీలో ఓట్ల సంఖ్యలో తేడా వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లను రిటర్నింగ్ అధికారి పక్కన ఉంచి ఎన్నికల కమిషన్కు సమాచారం అందిస్తారు. కంట్రోల్ యూనిట్ టేబుల్ పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. -
మోక్ష ప్రదాత కటాక్షం
నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం హనుమంత వాహనంపై ఊరేగుతూ కల్యాణ వెంకన్న భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు వేకువనే శ్రీవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. హోమశాలలో ప్రత్యేక క్రతువులు పూర్తి చేశారు. సర్వాలంకారభూషితుడైన కల్యాణ వెంకన్నను హనుమ వాహనంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం విశేషంగా అలంకరించిన దేవదేవేరులను పల్లకిలో వేంచేపు చేశారు. కనులపండువగా స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవీ సమేతంగా శ్రీవారికి వసంతోత్సవం నిర్వహించారు. మాడవీధుల్లో పరిచారుకులపై సుగంధ తిరుచూర్ణ ద్రవ్యాలను చల్లారు. రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై మోక్షప్రదాతగా స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. గ్రామోత్సవంలో భక్తుల కర్పూర హరతులు అందుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉత్సవమూర్తికి ఆస్థానం నిర్వహించి, ఏకాంత సేవ నిర్వహించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకుడు శ్రీధర భట్టాచార్య, ఆర్జితం అధికారి భరత్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వైభవంగా కల్యాణ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు హనుమ వాహనంపై ఊరేగిన శ్రీవారు వేడుకగా దేవదేవేరుల వసంతోత్సవం గజ వాహనంపై సర్వాంతర్యామి విహారం -
సమానత్వం.. సంకీర్తనల సారం
తిరుపతి కల్చరల్ : సర్వమానవ సమానత్వమే అన్నమయ్య సంకీర్తనల సారామని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు ఆకెళ్ల విభీషణ శర్మ తెలిపారు. అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో చేపడుతున్న సాహితీ సదస్సులు ఆదివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన విభీషణ శర్మ మాట్లాడుతూ అన్నమయ్య– యోగ సంకీర్తనలు అనే అంశంపై ఉపన్యసించారు. రామానుజాచార్యుల వారు వెల్లడించిన అష్టాక్షరి మంత్రంతోపాటు శ్రీవైష్ణవ ధర్మం, భక్తి తత్వాన్ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా ప్రచారం చేసినట్లు వివరించారు. అన్నమయ్య యోగ సంకీర్తనల్లో ధర్మం, భక్తి, శరణాగతి, అహింస ప్రధానంగా పేర్కొన్నారని వెల్లడించారు. అనంతరం ఎస్వీయూ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ సర్వోత్తమరావు అన్నమయ్య– శ్రీనివాసుని అభిషేక సంకీర్తనలు అనే అంశంపై మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి శుక్రవారం రోజునే ఎందుకు అభిషేకం నిర్వహిస్తారో అన్నమయ్య తెలియజేశారన్నారు. శ్రీవారికి సమర్పించే నిత్యం కై ంకర్యాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. అన్నమయ్య సంకీర్తనలు – భగవద్గీతా ప్రభావం అనే అంశంపై సాహితీ వేత్త గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్ ప్రసంగించారు. కర్మ, జ్ఞాన, ధ్యాన , తత్త్వ మార్గాలు భగవంతుని చేరడానికి అంత సులభం కావు, అవేవీ ఉపాయాలు కావు, శరణాగతి కోరే భక్తి మార్గమొక్కటే శ్రీహరి పాదాల చెంతకు చేర్చి మోక్షప్రాప్తి పొందుటకు మార్గమని అన్నమయ్య చాటి చెప్పారని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలు అర్ధం చేసుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలన్నీ అర్థమైనట్లేనన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల పాల్గొన్నారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- 18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
- ప్రజాభవన్లో బాంబు కలకలం
- వజ్ర సంకల్పం
- ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్దకు లక్ష
- విన్నపాలు వినవలె!
- హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
Advertisement