
10న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 10వ తేదీ మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ 2.ఓ నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల ఆరోగ్యం, ప్రతిభ వంటి అంశాలను తల్లిదండ్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తామన్నారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానిస్తున్నామన్నారు. విద్యార్థులు, టీచర్లతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకునేందుకు వీలుగా తల్లిదండ్రులకు సమగ్ర పురోగతి కార్డులను అందజేస్తామన్నారు. విద్యార్థులకు రోజూ అందించే మధ్యాహ్న భోజనాన్ని ఆరోజు తల్లిదండ్రులకు కూడా వడ్డిస్తామని తెలిపారు. తమ తల్లికి నమస్కరిస్తూ ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. స్కూలు అబివృద్ధి కమిటీలు, పూర్వ విద్యార్థులు కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యపై అధిక బడ్జెట్ కేటాయిస్తోందని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించిన తొలిరోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బ్యాగులు, పుస్తకాలు వంటివి అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం డేటా బేస్లో కేంద్రీయ విద్యాలయ పిల్లల పేర్లు లేకపోవడం వల్ల వారికి తల్లికి వందనం అందలేదని తెలిపారు. సాంకేతిక కారణాలను సరిదిద్ది మెగా పేరెంట్స్, టీచర్స్మీట్కు ముందే వీరందరికీ తల్లికి వందనం కింద సాయం అందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు.