త్యాగమయ జీవితం బక్రీద్‌ సందేశం | - | Sakshi
Sakshi News home page

త్యాగమయ జీవితం బక్రీద్‌ సందేశం

Jun 6 2025 6:09 AM | Updated on Jun 6 2025 6:09 AM

త్యాగమయ జీవితం బక్రీద్‌ సందేశం

త్యాగమయ జీవితం బక్రీద్‌ సందేశం

కడప కల్చరల్‌ : సృష్టి ఎంతో అద్భుతమైనది.. .సకల చరాచరాలతో నిండి ఉన్న దీన్ని ఏకేశ్వరుడైన అల్లాహ్‌ సృష్టించాడు. ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసేందుకు వెనుకాడకూడదని సందేశాన్నిచ్చే పండుగ బక్రీద్‌. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతి, సహనశీలత, రుజు వర్తనలను తెలుపుతుంది. మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి దైవం పక్షాన అవతరించిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఐదు వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన శ్రీదేవుడే సకల చరాచర సృష్టికి కారకుడని, ఆయన పట్ల భక్తి, శ్రద్ధలు ప్రకటించడం ద్వారా ముక్తిని పొందవచ్చని జాతికి పిలుపునిచ్చారు. ఈ పండుగలోని ముఖ్యాంశాలు పాఠకుల కోసం..

సమర్పణలో సంతృప్తి

ఇస్లాంలో రంజాన్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో, బక్రీద్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. శనివారం ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని ప్రతి వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు ఇస్తారు. మరో భాగాన్ని తమ కోసం వాడుకుంటారు.

త్యాగమంటే ఇదే!

బక్రీద్‌ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా పెద్దలు పేర్కొంటారు. దేవుడొక్కడే అన్న ఆయన వాదాన్ని వ్యతిరేకించిన వారు ఆయనపై కక్ష గట్టి ఆయనను శారీరక, మానసిక హింసలు పెట్టి, తుద ముట్టించేందుకు ఎన్నో యత్నాలు చేశారు. వృద్ధాప్యం వచ్చినా సంతానం లేకపోవడం ప్రవక్త ఇబ్రహీంను వేధించేది. మంచి సంతానాన్ని ప్రసాదించమని ఆయన నిరంతరం ఏకేశ్వరుడిని ప్రార్థించేవారు. 86 ఏళ్ల వయసులో ఆయనకు దైవం ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆనందంలో ఓలలాడుతున్న సమయంలో దైవం ఇబ్రహీం భక్తిని పరీక్షించదలిచారు. నీ ప్రియ పుత్రుడిని మానవ మాత్రలు సంచరించని ఎడారిలో వదిలేయమని ఆజ్ఞాపించారు. పుత్రునికంటే దైవం ఆదేశమే గొప్పదన్న విశ్వాసంతో ఇబ్రహీం తన సతీమణి బీబీ హాజిరాను, కుమారుడు ఇస్మాయిల్‌ను ఎడారిలో వదిలి పెట్టారు. తల్లీ బిడ్డ ఆకలి దప్పులతో అలమటించారు. అక్కడి సఫా కొండల మధ్య నీళ్ల కోసం వెదికారు. ఇస్మాయిల్‌ దాహంతో గిలగిల్లాడుతున్నప్పుడు అతడి కాలి మడమల మధ్య ఇసుకలో గుంత ఏర్పడి, ఆ ఎడారిలో నీటి ఊట ఏర్పడుతుంది. అదే సెలయేటిగా మారింది. ఆ నీటినే పవిత్రమైన ‘జమ్‌జమ్‌’ పానీ అంటారు. హజ్‌కు వెళ్లిన యాత్రికులు ఆ పవిత్ర ‘జమ్‌ జమ్‌’ జలాన్ని సేవించి తమ బంధు మిత్రులు, కుటుంబ సభ్యుల కోసం కూడా తీసుకెళతారు.

మరొక పరీక్ష

ప్రవక్త ఇబ్రహీంకు దైవం మరొక కఠిన పరీక్ష పెట్టారు. కలలో అందిన సూచన మేరకు ఆయన తన కుమారు డిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతారు. కుమారుడు కూడా దైవాజ్ఞను శిరసావహించేందుకు అంగీకరిస్తాడు. తండ్రి ఇబ్రహీం కుమారుడిని ‘జుబాహ్‌’ చేశాడు. తీరా చూస్తే కుమారుడికి బదులు అక్కడ ఒక గొర్రె జుబాహ్‌ చేయబడి ఉంటుంది. దైవం పట్ల ప్రవక్త ఇబ్రహీంకు గల ఆచంచల భక్తి, విశ్వాసాలకు, త్యాగనిరతికి ప్రతీకగా ముస్లింలు యేటా ‘ఈద్‌–ఉల్‌– జుహా’ పండుగను నిర్వహించుకుంటున్నారు.

రేపు ఈద్‌–ఉల్‌–జుహా (బక్రీద్‌)

ఖుర్బానీ జంతువుల రక్త మాంసాలు అల్లాహ్‌కు చేరవు. కేవలం మీ భయభక్తులే భయ భక్తులు, విశ్వాసం, సమర్పణ గుణాలే చేరుతాయి

– దివ్య ఖురాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement