
ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని యూనివర్సిటీ చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి పేర్కొన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీలో అచీవర్స్డే–2025ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించాలంటే నిరంతరం కృషి చేయాలన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర గొప్పదన్నారు. ప్లేస్మెంట్ అధికారి సునీల్ అల్లువాడ మాట్లాడుతూ ఎన్నో కంపెనీల్లో విద్యార్థులు ఎంపిక కావడమే కాకుండా, ఇంటర్న్షిప్లో కూడా పాల్గొన్నారన్నారు. ప్రిన్సిపాల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో నిబద్ధత, మానవతా విలువలు గర్వించదగ్గవన్నారు. వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ ఖ్యాతి విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ఇండ్రస్టియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ జేఎన్టీయూ (అనంతపురం) ప్రొఫెసర్ కిరణ్మయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ హేమకేశవులు, వివిధ విభాగాల డీన్లు, శాఖాధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన స్నేహితులు ఫారూక్(20), చైతన్య(19) ద్విచక్ర వాహనంలో బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ కు వెళ్లేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. మార్గమధ్యంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట వద్దకు రాగా, ద్విచక్ర వాహనం నడుపుతున్న ఫారూక్కు, ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. చైతన్య గాయపడగా ఫారుక్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు బాధితులు ఇద్దరిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఫారుక్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అదేవిధంగా ములకలచెరువు పట్టణంలోని షాపులో పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన లక్ష్మీనారాయణ (50) వ్యక్తిగత పనులపై కదిరి పట్టణానికి వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో ములకలచెరువుకు వస్తుండగా, మార్గమధ్యంలోని చీకటిమాను పల్లె వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా గాయపడగా, లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారు వేర్వేరు ఆసుపత్రులకు వెళ్లగా, లక్ష్మీనారాయణను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు పంపారు.
ఏయూ అచీవర్స్డేలో చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి