
జయలక్ష్మిపై దాడికి ఎస్ఐదే బాధ్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : కొండాపురం మండలం తిరుమలాయపల్లె గ్రామానికి చెందిన బండారు జయలక్ష్మీపై ఎలాంటి దాడి జరిగినా అందుకు తలమంచిపట్నం పోలీసు స్టేషన్ ఎస్ఐదే బాధ్యత అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ తెలిపారు. సోమవారం బాధిత మహిళ జయలక్ష్మితో పాటు మహిళా ఐక్య వేదిక నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ జయలక్ష్మికి 17 ఏళ్ల క్రితం మైలవరం మండలం గంగుల నారాయణ పల్లె గ్రామానికి చెందిన మైల శ్రీనివాసులుతో వివాహమైందన్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో పదేళ్ల క్రితం విడిపోయారన్నారు. అయితే జయలక్ష్మి ఇచ్చిన కట్నం, భరణం తిరిగి ఇవ్వడానికి తన వద్ద డబ్బులు లేవని మైల శ్రీనివాసులు సర్వే నెంబరు 1241లో తనకున్న 2 ఎకరాల 11 సెంట్ల వ్యవసాయ భూమిని జయలక్ష్మి పేరు మీద 2015లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి, అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడన్నారు. ఆ తర్వాత బాధితురాలు జయలక్ష్మి తిరుమలాయపల్లెలో తన పుట్టింటిలో ఉంటూ ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. అయితే ఇప్పుడు ఆ భూమికి ధర రావడంతో ఆమె మాజీ భర్త, అతని రెండవ భార్య కృష్ణవేణి, అతని అన్న కలిసి ఆ భూమిని తిరిగి ఇవ్వాలని, లేకుంటే చంపుతామని జయలక్ష్మిని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయమై గతంలో కూడా ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కొండాపురం సీఐని కలవగా బాధితురాలి మాజీ భర్త మైల శ్రీనివాసులును పిలిపించి మందలించారన్నారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న అతను తిరిగి ఆమె వెంట పడుతూ భూమి దగ్గరికి వస్తే అక్కడే చంపి పూడ్చి పెడతా అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 వ తేదీన వారు ముగ్గురు కలిసి దౌర్జన్యంగా బాధితురాలి భూమిని దున్నుతుండగా, ఆ విషయం తెలుసుకున్న జయలక్ష్మి పోలీసులను ఆశ్రయించిందన్నారు. తర్వాత తలమంచిపట్నం ఎస్ఐని కలిసి బాధితురాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, మైలవరం మండల తహసీల్దార్ ఇచ్చిన నివేదిక చూపించగా ఇవి ఎందుకూ పనికిరావని, ఇలాంటివి 100 డాక్యుమెంట్లు పుట్టించవచ్చు అంటూ ఎస్ఐ ఎగతాళిగా మాట్లాడారని చెప్పారు. బాధితురాలి తరపున భూమిని గుత్తకు తీసుకున్న పెద్దరంగడిని కూడా ఎస్ఐ బెదిరించారన్నారు. భవిష్యత్తులో జయలక్ష్మికి ఏ హాని జరిగినా అందుకు తలమంచిపట్నం ఎస్ఐనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బాధితురాలి తరపున న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.