నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం

Jun 3 2025 5:49 AM | Updated on Jun 3 2025 5:49 AM

నెల్ల

నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం

కడప వైఎస్సార్‌ సర్కిల్‌ : కడప జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్‌ జోన్‌ అండర్‌ –23 వన్డే క్రికెట్‌ టోర్నీలో నెల్లూరు, చిత్తూరు జట్లు ఘన విజయం సాధించాయి. సోమవారం వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో నిర్వహించిన మ్యాచ్‌లో కర్నూలు జట్టుపై 225 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 49.4 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని కె. నిఖిలేశ్వర్‌ రెడ్డి 83, జి. మన్విత్‌ రెడ్డి 67, సోహన్‌ వర్మ 62 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని పి. కనీష్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. పి. సాబ్జాన్‌బాషా 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 388 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 36.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్‌ అయి ఓటమి పాలయింది. ఆ జట్టులోని పి. కనిష్‌ 60, పి. సాబ్జాన్‌ బాషా 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఎన్‌. భార్గవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. ఎస్‌ అఖిల్‌ సాలుంకే 2, సయ్యద్‌ అతిక్‌ సల్మాన్‌ 2 వికెట్లు తీసుకున్నారు.

కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎమ్‌ క్రికెట్‌ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కడప జట్టుపై చిత్తూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 50.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఏ. శివకేశవ రాయల్‌ 63, సి. విజయ్‌ రామిరెడ్డి 35 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మహమ్మద్‌ 4, పి. అచ్యుతానంద 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 262 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 49.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్‌ 84, నికిత్‌ గౌడ్‌ 54 పరుగులు చేశారు. కడప జట్టులోని ఏ. నాగ కుళ్లాయప్ప 3, షేక్‌ ఆదిల్‌ హుస్సేన్‌ 2 వికెట్లు తీసుకున్నారు.

నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం1
1/1

నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement