
భక్తుల మనోభావాలను గుర్తించాలి
అట్లూరు : అవధూత కాశిరెడ్డి నాయన భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశినాయన మండల పరిధిలోని జ్యోతి క్షేత్రం ఆవరణంలో భక్తుల అవసరాల నిమిత్తం ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ అధికారులు కూల్చి వేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాశిరెడ్డి నాయన భక్తుల ఆందోళన ఫలితంగా తొలగించిన నిర్మాణాలను యధాతథంగా నిర్మించడంతో పాటు ఆగిన బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారన్నారు. హామీ అమలు కాకపోవడంతో శాసన మండలి సమావేశంలో ప్రస్తావించినా సరైన సమాధానం లేదన్నారు. అలాగే ఇటీవల బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిసి భక్తుల మనోభవాలను దృష్టిలో ఉంచుకుని కూల్చిన నిర్మాణాలను నిర్మించుకునేందుకు అలాగే అక్కడ అవసరమైన మేర స్థలాన్ని కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేయాలని కోరామన్నారు. త్వరితగతిన జ్యోతి క్షేత్రానికి అనుమతులు రాని ఎడల ఎంపీలతో కలసి పార్లమెంటు దృష్టికి తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు రాజీవ్బాషా, కాశినాయన మండల నాయకులు రమణారెడ్డి, జగన్మోహన్రెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.