
అత్యుత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతాం
జమ్మలమడుగు రూరల్: ఆదర్శ గ్రామం అయిన ఎస్. ఉప్పలపాడు గ్రామాన్ని అత్యుత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శనివారం జమ్మలమడుగు మండల పరిధిలోని ఎస్. ఉప్పలపాడు గ్రామంలో ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ తో కలసి గ్రామంలోని పలు కాలనీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీ4 విధానం ప్రవేశపెట్టిందని.. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదరికాన్ని తొలగించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. సమాజంలో ఉన్న పేదవారి అభ్యున్నతికి ధనికులు తోడ్పడాలన్నారు. గ్రామంలోని యువతీ యువకులు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, మయాలూరు రామ మనోహర్రెడ్డిలు గ్రామాన్ని గతంలో దత్తత తీసుకుని గ్రామంలోని ప్రజలకు మౌళిక వసతులు కల్పించారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలకు ప్రహరీ ఏర్పాటుచేయాలని, పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజలు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీబీహెచ్ఎల్సీ మాజీ చైర్మన్ ఉప్పలపాడు శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్ పి. శ్రీనివాసులురెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్, సర్పంచ్ అక్కల దేవి, ఎంపీడీఓ సయ్యద్ ఉన్నీసా పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్