
అది మహానాడు కాదు.. మహా కరోనా
ప్రొద్దుటూరు : మూడు రోజుల పాటు తెలుగు దేశం పార్టీ ఉద్దేశ పూర్వకంగానే కడప గడ్డపై మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని భారత ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున మహానాడు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహానాడు తర్వాత ఏ ఊరిలో కరోనా వ్యాప్తి చెందినా అందుకు టీడీపీ, సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఓ యువకుడు, వృద్ధుడు కరోనాతో మరణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రామం, వార్డు నుంచి కార్యకర్తలు మహానాడు సభకు వెళితే కరోనా వ్యాప్తి చెందదా అని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు ధైర్యాన్ని కల్పించడంతోపాటు భరోసాను ఇవ్వాల్సిన ప్రభుత్వమే ఇలాంటి బహిరంగ సభలను నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మహానాడు ప్రభావం కారణంగా రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా అని ప్రశ్నించారు. అది మహానాడు కాదని మహా కరోనా అని అన్నారు. ఉన్నతాధికారి మొదలు వీఆర్ఏ వరకు అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. కడప గడప ఎప్పుటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను మరువదన్నారు. ఇది జగన్కే సొంతమని తెలిపారు.
టీడీపీ నేతల ఇళ్లకే
జెండాలు కడతాం
మహానాడు సందర్భంగా కడప నగరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు కడతారా అని రాచమల్లు ప్రశ్నించారు. ఏనాడైనా ఎన్టీఆర్ విగ్రహాలకు తాము జెండాలు కట్టామా అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకంగా టీడీపీ నాయకుల ఇళ్లకే వైఎస్సార్సీపీ జెండాలు కడతామన్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం ఏమి సాధించిందో ప్రజలకు చెప్పాలని కోరారు. సమావేశంలో కో–ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, అనిల్కుమార్, పాతకోట మునివంశీధర్రెడ్డి, నూకా నాగేంద్రారెడ్డి, సత్యం, రాగుల శాంతి, వైఎస్సార్సీపీ నాయకులు ఉప్పర మురళి, తుపాకుల వెంకటరమణ, గంజికుంట శివారెడ్డి, అంజి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి