
ఆర్ఎస్కేల కోత.. రైతుకు వెత
●మూతపడినట్లే..
వైఎస్సార్ జిల్లాలో 81, అన్నమయ్య జిల్లాలో 66 కేంద్రాలు రేషనలైజేషన్ పేరుతో మూతపడనున్నాయి. వీటికి కొన్ని భవనాలు ఉండగా, మరి కొన్ని భవనాలు లేకపోవడం, మరి కొన్ని చోట్ల భవనాలు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. ఇలా మొత్తంగా 147 రైతు భరోసా కేంద్రాలు మూతపడనున్నాయి. దీంతో ఆ గ్రామాల్లో రైతులకు ఇక మీదట స్థానికంగా సేవలు అందవు.
కడప అగ్రికల్చర్: దేశానికే రోల్ మోడల్గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు నేడు కనుమరుగవుతున్నాయి. ఉన్న ఊరిలోనే రైతులకు అన్ని రకాల సేవలను అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పంట సాగుకు అవసరమైన అన్ని రకాల సేవలు అందేవి. దిగుబడికి గిట్టుబాటు ధర కూడా కల్పించి అండగా నిలిచేవి. దీంతో రైతులు నిశ్చింతగా వ్యవసాయం చేసుకునే వారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చారు. వీటి నుంచి ఎలాంటి సేవలు అందించక పోవడంతో నిస్సహాయ కేంద్రాలుగా మారాయి. రేషనలైజేషన్ పేరుతో వందలాది రైతు సేవా కేంద్రాలను కుదించేస్తోంది. ఉన్న సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తున్నారు. ఇక మీదట ఖాళీ పోస్టుల భర్తీ కాక పోగా.. ఉన్న పోస్టులను సర్దుబాటు చేయడంతో కర్షకులకు కష్టాలు రెట్టింపు కానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ..
ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 629 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ జిల్లాలో 423, అన్నమయ్య జిల్లాలో 206 ఉన్నాయి. వీటిలో 629 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతోపాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది ఉండే వారు. ఇందులో కొందరు పదోన్నతులపై వెళ్లగా, మరి కొంత మంది ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం 305 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, 177 మంది హార్టికల్చర్ అసిస్టెంట్లు, ఒకరు విలేజ్ సెరికల్చర్ అసిసెంట్ ఉన్నారు. మిగిలిన 146 పోస్టులు భర్తీ చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఈ పోస్టులన్నీ రద్దయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
1257 ఎకరాలకు ఒక వీఏఏ, వీహెచ్ఏ..
వైఎస్సార్ జిల్లాలో 1257 ఎకరాలకు ఒక వీఏఏ, వీహెచ్ఏ, అన్నమయ్య జిల్లాలో 750 ఎకరాలకు ఒక వీఏఏ, వీహెచ్ఓ ఉండే విధంగా రేషనలైజేషన్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా యూనిట్గా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు కసరత్తు దాదాపు పూర్తి చేశాయి. మిగిలిన భూములకు వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఎంపీఈవోలను కేటాయిస్తారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావుతో మాట్లాడగా.. ఆర్ఎస్కేలలో రేషనలైజేషన్ పూర్తయిందని, ఉమ్మడి జిల్లాలో 482 ఆర్బీకేలను గుర్తించామని తెలిపారు. అయితే రైతుల సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆర్ఎస్కేలలో పోస్టులు తగ్గి నా ఎంపీఈవోలతో ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.
ఎలాంటి సేవలు అందడం లేదు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నా.. లేనట్లుగానే అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలి. అప్పుడే రైతలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలంగా పథకాలను మార్చడం, సేవలను నిర్వీర్యం చేయడం సబబు కాదు. రాజకీయాలకు అతీతంగా ఆర్బీకే సేవలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. – సంబటూరు ప్రసాద్రెడ్డి,
రాష్ట్ర ఉద్యాన మాజీ సలహాదారు
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
రైతు భరోసా కేంద్రాల సేవల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల సేవలందించే.. రైతు భరోసా కేంద్రాల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. దీంతోపాటు రేషనలైజేషన్ను కూడా ఆపాలి. అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల సేవాలను యథావిఽధిగా కొనసాగించాలి. – దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
ఆర్బీకేల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు ఉంటారు.
● రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ
● సర్టిఫైడ్ హామీతో కూడిన ఇన్పుట్ల సరఫరా
● ఈ క్రాపు బుకింగ్కు రైతు డేటాబేస్ అప్లోడ్ చేయడం
● పంట సాగుదారుల హక్కు ధ్రువీకరణ పత్రం జారీ, విత్తన సేకరణ కార్యకలాపాలు
● పీఎం కిసాన్, వైఎస్సార్ ఆర్బీ, వైఎస్సార్ సున్నా వంటి పంట రుణాల కోసం డేటా అప్లోడ్ చేయడం
● విత్తనాలు, ఎరువులు, పురుగు నివారణ మందులు, పశువుల దాణా మొదలైనవి ముందుగా పరీక్షించి సరఫరా
● వివిధ పథకాల కింద లబ్ధిదారుల సామాజిక తనిఖీ, అంటే ప్రకృతి వైపరీత్యాలు, సబ్సిడీ విత్తనాలు మొదలైనవి.
● డిజిటల్ లైబ్రరీ ద్వారా తెగుళ్లు, వ్యాధులపై అవగాహన కల్పించడం
● పొలంబడి, సీడ్ విలేజ్ పోగ్రాం, మినికిట్ ట్రయల్ ప్లాట్లు మొదలైన ప్లాగ్షిప్ ప్రోగ్రామ్ల నిర్వహణ
● విత్తన పరీక్ష (భౌతిక స్వచ్ఛత, ఆకురోత్పత్తి పరీక్ష)
● రైతుల సామర్థ్యం పెంపు, ఉత్తమ నిర్వహణ పద్ధతుల వ్యాప్తి, పొలంబడి, పద్ధతి ప్రదర్శనలు మొదలైనవి.
● స్మార్ట్ టీవీ(డిజిటల్ సిగ్నేజ్) క్రాపు నిపుణులచే సాంకేతిక సెషన్ల చిరునామాను ప్రత్యక్ష ప్రసారం చేయడం
● స్ప్రేయర్స్ వంటి చిన్న వ్యవసాయ పరికరాలు అద్దెకు తీసుకోవడం
● బీజామృతం మొదలైన సహజ, ఉత్పత్తులపై ప్రదర్శనలు నిర్వహించడం
● అన్ని ప్రభుత్వ పథకాలకు సేవా కేంద్రం
● రైతుల డేటాబేస్, నేల ప్రొఫైల్ను నిర్వహించడం
● జంతు ఆరోగ్యకార్డుల జారీ
● ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, జంతువుల ప్రథమ చికిత్స
● ఇ– క్రాపు బుకింగ్ ద్వారా పశుగ్రాసం అవసరాన్ని లెక్కించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం
● ఇక మీదట ఈ సేవలు ఆర్ఎస్ఎస్కేలు లేని ఊర్లలో స్థానికంగా అందవు. దీంతో రైతులకు కష్టాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.
ఆర్బీకేల ద్వారా గతంలో అందించే సేవలు
రేషనలైజేషన్ పేరుతో కుదింపు
రైతు సేవా కేంద్రాల తగ్గింపు
కొన్ని ఊర్లలో మూతపడుతున్న వైనం
సిబ్బంది సర్దుబాటు
ఇక రిక్రూట్మెంట్ లేనట్లే

ఆర్ఎస్కేల కోత.. రైతుకు వెత

ఆర్ఎస్కేల కోత.. రైతుకు వెత

ఆర్ఎస్కేల కోత.. రైతుకు వెత

ఆర్ఎస్కేల కోత.. రైతుకు వెత