
బిందు సేద్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
స్క్రీన్ ఫిల్టర్ శుభ్రత అత్యంత కీలకం
బోర్లు, బావుల నుంచి వచ్చే నీటితో సన్నటి మన్ను, ఇసుక వస్తుంది. దీనివల్ల లెటరల్ పైపుల నుంచి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీని నివారణకు బోరు వద్ద నుంచి లెటరల్ పైపులకు నీరు వచ్చే ముందు స్క్రీన్ ఫిల్టర్ అమర్చుతారు. దీనిని వారం రోజులకు ఒకసారి శుభ్రపర్చుకోవాలి. ఫిల్టర్పై సన్నని రంధ్రాలు పూడిపోకుండా జాగ్రత్తపడాలి. కొత్తగా వేసిన బోరు నీరు ఉపయోగిస్తున్నట్లయితే కొన్నిరోజుల వరకు రోజుకు ఒక్కసారి ఫిల్టర్ను శుభ్రం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. బావుల నుంచి నీటిని తీసుకునేటప్పుడు సాండ్ ఫిల్టర్ను అమర్చకోవాలి. రెండు ఫిల్టర్లతో రెండు దఫాలుగా వడపోత జరిగి లెటరల్ పైపుల్లోకి మట్టి, ఇసుక రాకుండా ఉంటుంది.
త్రిపురారం: వ్యవసాయంలో బిందు సేద్యం వల్ల తక్కువ నీరు ఉన్నా వివిధ రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే భూగర్భ జలాల నుంచి వచ్చే సన్నటి ఇసుక, మట్టి రేణువులతో పాటు పైపుల ద్వారా రసాయన ఎరువులు అందిండచం వల్ల బిందు సేద్యంలో ఉపయోగించే పరికరాలు త్వరగా దెబ్బతిని మోటార్లు మోరాయించే అవకాశం ఉంది. బిందు సేద్యం పరికరాలను భద్రపుర్చుకోవడంతో పాటు సరైన జాగ్రత్తలు పాటించి శుభ్రం చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచిస్తున్నారు. బిందు సేద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..
లెటరల్ పైపులకు యాసిడ్ ట్రీట్మెంట్
బిందు సేద్యం పరికరాల ద్వారా అందించే ఎరువులు వల్ల లిబరల్ పైపులకు ఉన్న రంద్రాలు పూడుకపోయి నీరు కిందకు రావడం పలు సందర్భాల్లో నీరు నిలిచి మొక్కలకు అందవు. ప్రతి ఏటా పైపులను శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం తక్కువ గాడత గల హైడ్రోక్లోరిన్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ను వాడొచ్చు. యాసిడ్ను ఉపయోగించి పైపులను శుభ్రపరిచేందుకు రెండు పద్ధతులను పాటించవచ్చు. పంట లేని సమయంలో లెబరల్ పైపులను శుభ్రం చేసుకోవాలి.
1. ఎకరం పొలంలో గల లెబరల్ పైపులను శుభ్రం చేసుకునేందుకు 30 నుంచి 40 లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. 10మీ హూస్పైప్ను యూ ఆకారంలో ఉండేలా అమర్చుకోవాలి. ఇందుకోసం రెండు వైపుల కట్టెలను పాతి వాటికి హూస్పైపును కట్టి పైపును యాసిడ్లో ఉంచాలి. గాడత తక్కువ గల యాసిడ్ను మాత్రమే ఉపయోగించాలి.
2. ఎరువులను వదిలే ప్లాస్టిక్ పెర్టిగేషన్ ట్యాంకు ద్వారా శుభ్రపర్చాలి. పంట లేని సమయంలో మాత్రమే ఈ పద్ధతి అవలంబించాలి. ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకును ముందుగా శుభ్రపర్చుకోవాలి. ఆ తర్వాత తక్కువ గాఢత గల యాసిడ్ను నింపి నీటిని అందులోకి పంపాలి. ఈ ప్రక్రియను నెమ్మదిగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇనుప పెర్టిగేషన్ ట్యాంకు ఉన్నట్లయితే వెంచూరి సహాయంతో లెటరల్ పైపులను శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
డ్రిప్ పరికరాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. పంట కాలం సమయంలో యాసిడ్ ద్వారా డ్రిప్ పైపులను శుభ్రం చేయకూడదు.
2. డ్రిప్ కంపెనీలు సూచించిన యాసిడ్ను వారు నిర్ధేశించిన మోతాదులోనే వాడాలి.
3. నీటిలో యాసిడ్ కలపాలి. యాసిడ్ ఉన్న ట్యాంక్లో నీటినిపై నుంచి ధారగా పోయరాదు.
4. ఫెర్టిగేషన్ లేదా వెంచూరి సహాయంతో యాసిడ్ను పంపేటప్పుడు నీటిని వాడకుండా చర్యలు తీసుకోవాలి.
5. డ్రిప్ పైపులు శుభ్రపడిన అనంతరం ఎండ్ క్యాప్లను తీసివేసి యాసిడ్ కలిపిన నీటిని వదిలివేయాలి.
6. శుభ్రపరిచిన పైపులను మరోసారి నీటితో కడగడం లేదా సబ్లైన్కు బిగించి నీటిని పారనివ్వాలి.
7. శుభ్రపరిచే సమయంలో రైతులు ముఖానికి చేతులకు తొడుగులు ధరించాలి. చలువ కళ్లద్దాలు వినియోగించడం ఉత్తమం.
ఫ కేవీకే కంపాసాగర్ సేద్యపు విభాగం
శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు

బిందు సేద్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..