యూట్యూబ్‌లో చూసి నకిలీ విత్తనాల తయారీ | - | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో చూసి నకిలీ విత్తనాల తయారీ

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

యూట్య

యూట్యూబ్‌లో చూసి నకిలీ విత్తనాల తయారీ

సూర్యాపేటటౌన్‌: యూట్యూబ్‌లో చూసి నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సూర్యాపేట సీసీఎస్‌ పోలీసులు, తిరుమలగిరి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.4.62లక్షల విలువ గల 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, విత్తనాల తయారీకి ఉపయోగించే మిషన్‌, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సింగారపు యాదగిరిస్వామి తిరుమలగిరి శివారులో భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేశాడు. ఆశించినంత దిగుబడి రాకపోవడంతో తాను పండించిన పత్తి నుంచి గింజలు వేరు చేసి, యూట్యూబ్‌లో చూసి పత్తి విత్తనాలు తయారుచేసే మిషన్‌ను కొనుగోలు చేసి నకిలీ పత్తి విత్తనాలను తయారు చేయడం ప్రారంభించాడు. మొదట 308 కేజీల నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి ప్యాకింగ్‌ చేశాడు. వాటిని తనకు పరిచయం ఉన్న నందపురం గ్రామానికి చెందిన నవీన్‌, చిర్రగూడూరుకు చెందిన సోమనారాయణకు కిలోకు రూ.1500 చొప్పున 10 కిలోలు విక్రయించాడు. వారిద్దరు కలిసి స్థానిక రైతులకు అధిక ధరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీంతో మళ్లీ పత్తి విత్తనాలు కావాలని యాదగిరిస్వామిని కోరడంతో.. నవీన్‌కు 50 కిలోలు, సోమనారాయణకు 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సూర్యాపేట సీసీఎస్‌ పోలీసులు, తిరుమలగిరి పోలీసులు యాదగిరి స్వామి కౌలుకు తీసుకున్న భూమిలో తనిఖీలు చేయగా.. నకిలీ పత్తి విత్తనాలు తయారుచేస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి నకిలీ విత్తనాలు తయారుచేసే యంత్రం, విత్తనాల నిగారింపునకు ఉపయోగించే రంగులు, ముడిసరుకుతో పాటు 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. యాదగిరి స్వామి ఇచ్చిన సమాచారం మేరకు.. అతడి వద్ద విత్తనాలు కొన్న నవీన్‌, సోమనారాయణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాల తయారుచేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలు తయారుచేసే వారి గురించి సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ముగ్గురి అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

రూ.4.62 లక్షల విలువైన 308కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

యూట్యూబ్‌లో చూసి నకిలీ విత్తనాల తయారీ1
1/1

యూట్యూబ్‌లో చూసి నకిలీ విత్తనాల తయారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement