నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం | - | Sakshi
Sakshi News home page

నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం

Jun 6 2025 1:08 AM | Updated on Jun 6 2025 7:35 AM

నిండు

నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం

నరసాపురం రూరల్‌ /పెనుమంట్ర: అతివేగంతో వచ్చిన ఓ ఐస్‌ కంటైనర్‌ నిండు ప్రాణాన్ని బలిగింది. ఐస్‌ కంటైనర్‌ కారును ఢీకొన్న ఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం పాలవ్వగా వ్యాన్‌ నుంచి దూకేసి ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్సై జి.వాసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం విద్యాశాఖ కార్యాలయంలో సమగ్రశిక్ష విభాగంలో సైట్‌ ఇంజనీర్‌గా కర్రి వెంకటరెడ్డి (45) పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా గరువారం వేకువజామున ఆయన రాజమండ్రికి కారులో బయలుదేరారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి వంతెన పైకి చేరుకున్న సమయంలో బంటుమిల్లి వెళుతున్న ఐస్‌ కంటైనర్‌ ఎదురుగా వస్తున్న వెంకటరెడ్డి కారును ఢీకొంది. తీవ్రంగా గాయాలపాలైన వెంకట రెడ్డిని 108 వాహనంలో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జుయింది. ఐస్‌ కంటైనర్‌ కారు ఢీకొన్న అనంతరం వంతెన రైలింగ్‌ ఢీకొని కాల్వ వైపునకు వెళ్లి నిలబడింది. ఆ సమయంలో అప్రమత్తమైన లారీ డ్రైవర్‌ కవురు లీలాకృష్ణ, ఐస్‌ ప్యాకింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్న కోమటితిప్పకు చెందిన శీలం ప్రియాంకవర్మ కాలువలోకి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నారు. వీరిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటకరెడ్డి భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. కాగా మృతుడు వెంకటరెడ్డిది స్వగ్రామం పెనుమంట్ర మండలం నెగ్గిపూడి. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తెతో పాటు ఒక సోదరుడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం రాత్రి నెగ్గిపూడి శ్మశానవాటికలో నిర్వహించారు.

కారును ఢీకొన్న ఐస్‌ కంటైనర్‌

ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం

వ్యాన్‌ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్‌, మరో వ్యక్తి

నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం 1
1/1

నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement