
చేతివృత్తులను ఆదరించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులకు రక్షణ కల్పించి చేతివృత్తిదారులను ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఏలూరు స్ఫూర్తి భవనంలో మంగళవారం చేతి వృత్తిదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం సాధారణ చేతి వృత్తి దారులను ఏ మాత్రం ఆదుకోలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదన్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో చేతి వృత్తిదారులు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉత్పత్తుల నుంచి పోటీ తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తిదారులకు సాంకేతిక యంత్ర పరికరాలు, సబ్సిడీ రుణ పరపతి, భూమి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గొర్రెల, మేకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టేలు పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే చేనేత, తదితర వృత్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి రామాంజనేయులు