రావిలంక తీరంలో విషాద ఛాయలు | - | Sakshi
Sakshi News home page

రావిలంక తీరంలో విషాద ఛాయలు

May 29 2025 12:47 AM | Updated on May 29 2025 2:07 PM

బాలుర మృతదేహాలు లభ్యం

పెనుగొండ: ఆచంట మండలం రావిలంక గోదావరిలో గల్లంతైన ముగ్గురు బాలుర మృతదేహాలు బుధవారం లభ్యం కాగా తీరప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గన్నవరం మండలానికి చెందిన కేతా ప్రవీణ్‌ (15), సానబోయిన సూర్యతేజ (12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పెదలంకకు చెందిన నీతిపూడి పాల్‌కుమార్‌ (15) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రావిలంక గోదావరిలో మంగళవారం సరదాగా స్నానానికి వచ్చారు. అమావాస్య కారణంగా గోదావరికి సముద్రపు పోటు తగలడంతో నీటిమట్టం పెరిగి ముగ్గురు బాలురకు ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. 

బయట పడిన మరో ఇద్దరు బాలురు ఘటనా స్థలం నుంచి హుటాహుటిన వారి తల్లిదండ్రుల వద్దకు చేరి సమాచారం అందించారు. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపులో తొలుత కేతా ప్రవీణ్‌ మృతదేహం లభ్యం కాగా అనంతరం సానబోయిన సూర్యతేజ మృతదేహం లభ్యమైంది. అయితే నీతిపూడి పాల్‌కుమార్‌ మృతదేహాం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శ్రమించాల్సి వచ్చింది. చివరకు యలమంచిలి మండలం కనకాయలంక సమీపంలో అతడి మృతదేహం లభ్యమైంది. 

దీంతో పోలీసులు కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి మృతదేహాలను తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పెనుగొండ సీఐ రాయుడు విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో ఆచంట, గన్నవరం ఎస్సైలు కేవీ రమణ, శివకృష్ణ, తహాసీల్దారులు జి కనకరాజు, శ్రీపల్లవి మృతదేహాలు లభ్యమయ్యే వరకూ ఘటనా స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. బాలుర మృతితో రావిలంక వద్ద తీరమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మృతదేహాల గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించారు.

 

రావిలంక తీరంలో విషాద ఛాయలు 1
1/1

రావిలంక తీరంలో విషాద ఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement