
మనిషి మనిషిగా ఉంటే శత్రువులు ఉండరు
ద్వారకాతిరుమల: మనిషి మనిషిగా ఉంటే అతడికి శత్రువులు ఉండరని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. ద్వారకాతిరుమల విర్డ్ ఆస్పత్రిని శుక్రవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ముందుగా ఆస్పత్రికి విచ్చేసిన చిన్న జీయర్ స్వామికి శ్రీవారి దేవస్థానం ఈఓ, అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఆస్పత్రి ట్రస్టీ ఐవీఆర్ సుధాకర్, వి.నారాయణమూర్తి, డాక్టర్ భవ్యచంద్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి ఆవరణలో కొలువైన చినవెంకన్న విగ్రహానికి హారతులిచ్చారు. అనంతరం ఆస్పత్రిని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఆ తరువాత ఆస్పత్రి ఆవరణలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఏలూరు (ఆర్ఆర్పేట): సమస్త సృష్టిని నడిపించే చైతన్య స్వరూపమే భగవత్ తత్వమని చినజీయర్ స్వామిజీ అన్నారు. ఏలూరు ఆర్ఆర్ పేట వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న సుదర్శన కలశ ప్రతిష్ఠోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రతువును ముందుకు నడిపించారు. దేవస్థానంలో 36వ వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్ఠోత్సవం, మహాకుంభాభిషేక మహోత్సవం ఈ నెల 3 నుంచి కొనసాగుతున్నాయి. శుక్రవారం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, చతుఃస్థానార్చన తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. చినజీయర్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.