
హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ఇద్దరిపై కేసు
ద్వారకాతిరుమల: స్థానిక శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల గ్రౌండ్లో ఈనెల 28న మద్యం సేవించి, వివాదానికి కారణమైన ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై స్థానిక పోలీస్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్ను నడిపే డ్రైవర్ కందికొండ భూషణం, స్కావెంజర్ కొండాబత్తుల సూరిబాబు ఈనెల 28న మధ్యాహ్నం హైస్కూల్ గ్రౌండ్లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా వివాదంగా మారింది. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. దేవస్థానం సెక్యూరిటీ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ మంగళవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన భూషణం, సూరిబాబు లపై పోలీసులు పెట్టీ కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని బత్తులవారిగూడెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలం పాతముప్పర్రుకు చెందిన రంజుల ఏసుబాబు (34) మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మైలవరం వెళ్తుండగా బత్తులవారిగూడెం శివారులో వెనక నుంచి బొలేరో వాహనం వచ్చి ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఏసుబాబును పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందాడు. రూరల్ ఎస్సై జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు.
నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ఏలూరు రూరల్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నట్లు డీఎస్డీఓ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరాల్లో ఈనెల 31వ తేదీ వరకూ 8 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 50 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అథ్లెటిక్స్, అర్చరీ, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఫుట్బాల్, హేండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, కయాకింగ్, స్కేటింగ్ వంటి విభాగాల్లో జిల్లాలో ఎంపిక చేసిన శిబిరాల్లో తర్ఫీదు ఇస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఐసీఎస్ఈ ఫలితాల్లో సెంట్ ఆన్స్ ప్రభంజనం
తాడేపల్లిగూడెం : పదో తరగతి ఐసీఎస్ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించినట్టు పట్టణంలోని సెంట్ ఆన్స్ విద్యాసంస్థల అధినేత అద్దంకి విజయకుమార్ తెలిపారు. తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత శాతం సాధించారన్నారు. బీవీ సూరజ్ 97 శాతం, జి.నేహశ్రీ 95 శాతం, సీహెచ్.కిరణ్ సాయి భాస్కర్ 94 శాతం, టి.మోహన సౌమ్య 93 శాతం, పి.రేవతి లక్ష్మి నరసింహ 93 శాతం, ఎం.హేమ సరిత 92 శాతం, బి.సాహితి 91 శాతం సాధించారన్నారు. 90 శాతం పైగా మార్కులు సాధించిన వారు ఏడుగురు, 80 శాతం పైన మార్కులు సాధించిన వారు 35 మంది, 70 శాతం పైగా మార్కులు సాధించిన వారు 58 మంది, 60 శాతం మార్కులు పైగా 70 మంది సాధించారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐసీఎస్ఈ కరిక్యులం అవలంభించడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ఇద్దరిపై కేసు