
కొబ్బరి బొండాలకు గిరాకీ
ఉంగుటూరు: ఏప్రిల్లోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం సహజమైన కొబ్బరి నీరు తాగే ఎండ తీవ్రత పెరగడంతో కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగింది. బాటిల్ కొబ్బరి నీరు ధర రూ.120 నుంచి రూ.150 పలుకుతోంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. శక్తి నివ్వడంతో పాటు డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. శరీరంలో నీటి శాతం పెంచి శక్తిని ఇస్తుంది. బొండంలో సుమారు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మూత్ర, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇది చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు ఒంటిలో వేడిని తగ్గిస్తాయి. అలాగే మంచి ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది.
ఎండ దెబ్బకు పెరిగిన అమ్మకాలు
ఎండలు పెరగడంతో ఉమ్మడి ఏలూరు జిల్లా నుంచి కొబరి బొండాల అమ్మకాలు బాగా పెరిగాయి. దాంతో కొబ్బరి రైతులకు గిట్టుబాటు అవుతోంది. వ్యాపారులు ఆటోలు, మిని లారీలు, లారీల మీద బొండాల తీసుకెళ్లి చిల్లర వ్యాపారులకు అమ్ముతున్నారు. అలాగే లారీల మీద ఏలూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి. పలు చోట్ల జాతీయ రహదారి మీద చిరు వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
ఏలూరు జిల్లాలో 35,000 ఎకరాలలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. పెదవేగి, పెదపాడు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి. అక్కడనుంచి కొబ్బరి బొండాలు ఎగుమతులు సాగుతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతంలో చేపలు చెరువుల గట్ల మీద పెంచిన కొబ్బరి చెట్ల నుంచి బొండాలు దింపుతున్నారు.
వేసవి తాపం నుంచి ఉపశమనం
ధర పెరగడంతో రైతులకు గిట్టుబాటు
గిరాకీ పెరగడంతో రైతులకు లాభం
కొబ్బరి బొండాలకు గిరాకీ పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తోంది. ఇటీవల కొబ్బరి బొండాలు అమ్మకాలు భారీగా పెరిగాయి. వైద్యులు కూడా బొండాలు తాగమని సూచించడంతో ఎక్కువ మంది తాగుతున్నారు. ఎకరాకు రూ.60 వేలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తోంది.
–దేవదానం, హార్టీకల్చర్ ఏఓ, ఉంగుటూరు