
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పర్వతగిరి: రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు పర్వతగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అని పేర్కొన్నారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట నిరుపేదలను గత ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుందన్నారు. మా కుటుంబ సభ్యులు అంతా పుట్టి పెరిగిన నేల పర్వతగిరి అని తెలిపారు. పర్వతగిరి బిడ్డగా తానెప్పుడూ రుణపడి ఉంటానని, ఇక్కడి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇక్కడి ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారం
భూ భారతి చట్టంలో అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. మండలంలోని అన్నారం గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ సత్యశారదతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఎంపీ కడియం కావ్య