ఒంటరి మహిళలే టార్గెట్‌గా.. | - | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే టార్గెట్‌గా..

Jun 7 2025 1:20 AM | Updated on Jun 7 2025 1:20 AM

ఒంటరి మహిళలే టార్గెట్‌గా..

ఒంటరి మహిళలే టార్గెట్‌గా..

కమలాపూర్‌ : తాళాలు వేసి ఉన్న ఇళ్లు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న వంగపల్లికి చెందిన చిలువేరు ప్రశాంత్‌ (30)ను అరెస్ట్‌ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కమలాపూర్‌ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రశాంత్‌ డ్రైవింగ్‌ వృత్తి చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనికితోడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి నష్టపోయి అప్పులు చేశాడు. సులువుగా డబ్బులు సంపాదించడానికి తాళం వేసిన ఇళ్లు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 30న వంగపల్లిలోని తన తల్లిగారింట్లో ఒంటరిగా ఉన్న గర్భవతి తోట దివ్యపై రాడ్‌తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె చనిపోయిందని భావించి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లాడు. అదేవిధంగా తాళం వేసి ఉన్న పసుల రమాదేవి ఇంట్లో 4 తులాలు, కోడెపాక మధుసూదన్‌ ఇంట్లో తులం బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తాను చోరీ చేసిన బంగారం అమ్మేందుకు వెళ్తూ కమలాపూర్‌ బస్టాండ్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. గమనించిన పోలీసులు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.4.10 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీఐ హరికృష్ణ, ఎస్సై వీరభద్రరావు, కానిస్టేబుళ్లు మోహన్‌, ఉదయ్‌కుమార్‌, వెంకటేశ్‌ను ఏసీపీ అభినందించారు.

గర్భిణిపై దాడి చేసి

బంగారం లాక్కెళ్లిన నిందితుడి అరెస్ట్‌

8 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement