రేషన్‌కార్డుదారులూ.. ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డుదారులూ.. ఆందోళన వద్దు

Jun 6 2025 12:56 AM | Updated on Jun 6 2025 12:56 AM

రేషన్‌కార్డుదారులూ..  ఆందోళన వద్దు

రేషన్‌కార్డుదారులూ.. ఆందోళన వద్దు

న్యూశాయంపేట: ‘ప్రభుత్వం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 3 నెలలకు సరిపడా రేషన్‌ బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది.. పంపిణీలో కొంత జాప్యం జరుగుతున్నా.. జూన్‌ మాసాంతం వరకు అందరికీ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటాం’ అని వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంధ్యారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవిషయాన్ని రేషన్‌ డీలర్లు వినియోగదారులకు వివరించాలని, షాపుల వద్ద క్యూలైన్‌ లేకుండా ప్రతీ రోజు కొంత మందికి టోకెన్లు అందించి క్రమపద్ధతిలో బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు.

మొక్కలు నాటి.. ప్రతిజ్ఞ చేసి

పర్వతగిరి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మండల ప్రత్యేక అధికారి, డీసీఓ ఎం.నీరజ అన్నారు. ఈమేరకు మండలంలోని అనంతారం గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో మొక్కలు నాటి ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సోమారం గ్రామంలోని కిరాణా దుకాణాదారులకు షాప్‌లో ప్లాస్టిక్‌ కవర్లు వాడకూడదని అవగాహన కల్పించారు. అనంతరం జమలాపురం గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్‌నాయక్‌, హౌసింగ్‌ ఏఈ డి.ఉదయశ్రీ, సోమారం, జమలాపురం కార్యదర్శులు, జమాల్‌పురం ఇందిరమ్మ కమిటీ సభ్యులు జిల్లా కనకయ్య, ఏఫ్‌ఏలు, మహిళా సంఘం సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అలాగే రోళ్లకల్‌లో తహసీల్దార్‌ వెంకటస్వామి, అన్నారం గ్రామంలో మండల పంచాయతీ అధికారి శేషాంజన్‌స్వామి మొక్కలు నాటారు.

ప్లాస్టిక్‌ నియంత్రణపై ర్యాలీ

గీసుకొండ: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని డీఆర్డీఓ కౌసల్యాదేవి అన్నారు. గురువారం మండలంలోని మచ్చాపూర్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌ నియంత్రణ, మోదుగ ఆకులతో విస్తర్ల తయారీపై నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. డీపీఓ కటకం కల్పన, డీఎల్పీఓ వేదవతి, స్పెషల్‌ ఆఫీసర్‌ సురేశ్‌, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్‌, ఏపీఎం చంద్రకాంత్‌, పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘నిట్‌ను అగ్రగామిగా నిలబెడదాం’

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుదామని నిట్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్‌పర్సన్‌, ఐఐటీ హైదరాబాద్‌, రూర్కీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బీవీఆర్‌.మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నిట్‌ వరంగల్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్‌ పర్సన్‌గా ఎంపికై న సందర్భంగా తొలిసారిగా వరంగల్‌కు విచ్చేసిన మోహన్‌రెడ్డి గురువారం నిట్‌ క్యాంపస్‌ను పరిశీలించి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్‌ను విద్యార్థులకు అందజేయాలని నిట్‌ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ మోహన్‌రెడ్డికి పూలబొకే అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement