
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం వరంగల్ మండల పరిధిలోని ఏనుమాములలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతు ల సందేహాలను నివృత్తి చేశారు. తహసీల్దార్, నా యబ్ తహసీల్దార్ నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు రెండు గ్రామాల్లో సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్డెస్క్, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్ తదితర సి బ్బంది పాల్గొన్నారు. అనంతరం బాలాజీ నగర్లో రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా క్రమపద్ధతిలో బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి రేషన్సక్రమంగా అందుతుందా అని ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ వివరాలు ప్రజల కు కనిపించే విధంగా ఫ్లెక్సీ ప్రదర్శించాలన్నారు.
‘సూపర్ స్పెషాలిటీ’ బలోపేతానికి చర్యలు
ఎంజీఎం: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన బృందం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎంలో అత్యవసరంగా కావాల్సిన అవసరాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు, వారి అటెండెన్స్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద