
ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధ్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం భద్రకాళి దేవాలయం సమీపంలోని ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.1.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన(వేదపాఠశాల) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రకాళి ఆలయం ఎదుట రాజగోపురం నిర్మాణం పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరైన వసతులతో వేదపాఠశాల లేక విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని, వేదపాఠశాల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తిచేయాలన్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. దేవాలయాల భూముల్లో ఆయా ఆలయాలకు ఉపయోగపడేలా వేదపాఠశాలలు, గోశాలలు, ధ్యానమందిరాలు, ప్రవచన మండపాలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. భద్రకాళి ఆలయం అభివృద్ధిలో భాగంగానే మాడవీధుల నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరు అయ్యాయన్నారు. భద్రకాళి చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇక ముందు వరంగల్లోని అన్ని ఆలయాలను, పురావస్తుశాఖ పరిధిలోని దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దీనివల్ల టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాలను పరిశీలించి సరైన మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద్ హరిని సూచించినట్లు తెలిపారు.
వైభవంగా పూజా కార్యక్రమం..
అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది సాల్రగామశిలలను (బ్లాక్ గ్రానైట్) కలశాలపై ఉంచి వాస్తునాభి పూజ, హోమం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యే శిలాన్యాసం చేయడంతో పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం రాజగోపుర నిర్మాణాలకు శిలా న్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డీఈఈ సీహెచ్.రమేష్బాబు, కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషు భారతి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మంత్రి కొండా సురేఖ
రూ. 1.30కోట్ల వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన
భద్రకాళి ఆలయ రాజగోపుర
నిర్మాణ పనులకు సైతం..