వరంగల్‌లో కరోనా బెల్స్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో కరోనా బెల్స్‌

Jun 4 2025 1:08 AM | Updated on Jun 4 2025 7:28 PM

వరంగల్‌లో కరోనా బెల్స్‌

వరంగల్‌లో కరోనా బెల్స్‌

ఎంజీఎంలో ఓ పీజీ వైద్యురాలికి పాజిటివ్‌? 

మరో ఆరుగురికి కూడా.. ప్రైవేట్‌లో చికిత్సలు

నిర్ధారించని వైద్యాధికారులు

ఎంజీఎం : వరంగల్‌ నగరంలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగాయి. ఎంజీఎం ఆస్పత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో పీజీ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వైద్యురాలు దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని తన స్వృగృహానికి ఐసోలేషన్‌కు వెళ్లిపోయింది. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ప్రభుత్వపరంగా తమ వద్ద ఎలాంటి నిర్ధారణ పరీక్షలు జరగలేదని తెలిపారు. ప్రైవేట్‌ ల్యాబ్‌ కేంద్రంగా చేసిన పరీక్షల్లో వస్తే తాము పాజిటివ్‌గా నిర్ధారించలేమని పేర్కొన్నారు.

మరో ఆరుగురికి కూడా..

వరంగల్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. వీరంతా వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ అధికారులను వివరణ కోరగా, తమ వద్ద ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని పేర్కొంటున్నారు.

లోపించిన పాలన..

గ్రేటర్‌ వరంగల్‌లో పరిధిలోని ప్రైవేట్‌ ల్యాబ్‌లు, క్లినిక్‌లపై వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీలు, సిబ్బంది వివరాలు, వివిధ కేసుల నమోదుపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోకపోవడంతో ఎవరి ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లు, క్లినిక్‌ల అనుమతులు, రెన్యువల్‌ విషయాల్లో పెద్ద ఎత్తున చేతులు తడుపుతున్న క్రమంలో ప్రైవేట్‌ నిర్వాహకులు కీలకమైన వ్యాధి నిర్ధారణ విషయాలు అధికారులకు అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలతో ఈ విషయం స్పష్టమవుతుందన్న వాదన వినిపిస్తోంది.

20 పడకలతో ప్రత్యేక వార్డు..

ఎంజీఎంలో కరోనా చికిత్స కోసం 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచాం. గతంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పనిచేసిన వైద్యులు, వారి బృందం అందుబాటులో ఉంది. దీనికితోడు 500 నుంచి 800 ఆక్సిజన్‌ బెడ్లు కూడా ఉన్నాయి. ఎంత పెద్ద ఆపద వచ్చినా ఆదుకునేందుకు ఈ పెద్దాస్పత్రి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కరోనాతో ఎంజీఎంలో ఎవరూ చేరలేదు.

– కిశోర్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌

 

రెండు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల బెడ్‌ల సంఖ్య వివరాల సేకరణపై దృష్టి

గతంలోనే 1,100 పడకలతో సేవలందించిన ఎంజీఎం

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరోనా కిట్‌లు రాగానే పరీక్షలు షురూ

ఇప్పటివరకు కరోనా ప్రభావం లేదంటున్న వరంగల్‌, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు

సాక్షి, వరంగల్‌: మున్ముందు కరోనా మహమ్మారి వస్తే కట్టడి చేసేందుకు వరంగల్‌, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్య విభాగాధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ మెమోరియల్‌(ఎంజీఎం) ఆస్పత్రితోపాటు గతంలో సేవలందించిన వివిధ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ జాబితాను ఆయా జిల్లాల విభాగాధికారులు కలెక్టర్‌ల ద్వారా ఉన్నతాధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేసేలా సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న వైద్యులు, ఒకవేళ ప్రబళితే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కరోనా ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లలో పాజిటివ్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించి వేలాది మంది ప్రాణాలు కాపాడిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికీ 500 నుంచి 800 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండడంతో ఏ పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండడం కలిసొచ్చే అంశమని వరంగల్‌ జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు భావిస్తున్నారు. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్‌ యాంటీ జెన్‌, ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు రాష్ట్ర ప్రభుత్వంనుంచి జిల్లాలకు రాగానే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు చేసే వీలుంటుందని అంటున్నారు.

వాతావరణ మార్పులతో జ్వరాలు..

మే నెల మూడో వారం నుంచి వాతావరణం చల్ల బడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలోని ఫీవర్‌ వార్డులోనూ పదుల సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి సీజన్‌ వ్యాధులుగానే పరిగణించి వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకొని భయపడవద్దని, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయని అంటున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జిల్లాలో కరోనా నియంత్రణ కోసం వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లుకొట్టాయి. అదంతా అవాస్తవం. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే సీజనల్‌ వ్యాధులే. ఈ ప్రకారం వైద్యులు ట్రీట్‌మెంట్‌ అందించాలి. – డాక్టర్‌ సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement