
పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!
పరకాల: వాతావరణ కాలుష్యంతో పాటు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించే ప్లాస్టిక్ విక్రయాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ పరకాల మార్కెట్లో మాత్రం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని కూరగాయల మార్కెట్తో పాటు కిరాణాషాపుల్లో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేశారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు 10కిలోల నుంచి 20 కిలోల వరకు బరువును మోయగల సామర్థ్యమున్న ప్లాస్టిక్ కవర్లను కూరగాయలు, కిరాణా దుకాణాల ఎదుట ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జోరుగా ప్లాస్టిక్ వ్యాపారం..
పరకాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో వాటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. దుకాణాల్లోనే కాకుండా రహస్యంగా ఏర్పాటు చేసిన గోదాంల నుంచి కొందరు ప్లాస్లిక్ కవర్లను వ్యాపారస్తులకు కావాల్సిన సైజుల్లో డెలివరీ చేస్తూ రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారుల ప్రేక్షక పాత్ర..
పరకాల మున్సిపల్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ వినియోగదారులు పట్టించుకోకపోవట్లేదనే ఆరోపణలున్నాయి. అలాగే అవసరాలకు వాడుకొని చెత్తాచెదారం అంతా కవర్లలో నింపి రోడ్ల పక్కన పడేయడం పరకాలలో మామూలైపోయింది. పశువులు వాటిని తింటూ అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. భూమి కలుషితమవుతోంది.
అధికారులు చర్యలు తీసుకోవాలి..
పరకాలలో వ్యాపారస్తులు, వినియోగదారులు ప్లాస్టిక్ కవర్లు విక్రయించకుండా, వినియోగించకుండా మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా నోరులేని పశువులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
– సూర రాజేందర్, అధ్యాపకుడు, పరకాల
పరకాలలో విచ్చలవిడిగా
ప్లాస్టిక్ విక్రయాలు
వినియోగంపైనా కరువైన అవగాహన

పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!