
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
నెక్కొండ: ఖరీఫ్ ప్రారంభం కాకముందే మండలంలో విత్తన షాపులు, రికార్డులను ఇటు వ్యవసాయ శాఖ, అటు పోలీస్ శాఖ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో అక్కడక్కడా నకిలీ విత్తనాలు విక్రయిస్తుండడంతో జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా శక్రవారం నెక్కొండ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఏడాది సీజన్ ముందు ప్రతీ విత్తన షాపును తనిఖీ చేస్తామన్నారు. కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేని షాపుల్లో విత్తనాలను రైతులు కొనుగోలు చేయొద్దని సూచించారు. సన్న రకం వరి విత్తనాలతోపాటు పత్తి, మొక్కజొన్న విత్తనాలు అధికంగా కల్తీవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవి అయితే.. రశీదు ఆధారంగా రైతులకు పరిహారం అందే వీలుంటుందని, రైతులు రశీదులను పంట కాలం పూర్తయ్యేవరకు జాగ్రత్త చేయాలని సూచించారు. అనంతరం షాపుల్లోని రికార్డులు, నిల్వలు, కాలం చెల్లినవి ఏమైన ఉన్నాయా.. అనే కోణంలో తనిఖీలు చేశారు. దాడుల్లో నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఏఓలు గోపాల్రెడ్డి, నాగరాజు, ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, ఏసీపీ రవీందర్రెడ్డి
నెక్కొండలోని ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు