
నకిలీ విత్తనాలతో జాగ్రత్త..
సాక్షి, వరంగల్: వానాకాలం సీజన్కు ముందుగానే రైతులు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకతాయని, అవి రాష్ట్రానికి చేరుకోవడానికి జూన్ మొదటి వారం అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే మిర్చి, పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆయా మండల కేంద్రాలు, వరంగల్ నగరంలోని షాపులకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో పల్లెల్లో కమీషన్ల కోసం రైతులకు కొందరు నకిలీ విత్తనాలను అంటగడుతున్న సందర్భాలున్నాయి. కొంతమంది రైతులు గతేడాది ఓ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు సాగుచేసి దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ముఖ్యంగా పత్తి, వరి, మిరప, మొక్కజొన్న వంటి విత్తనాల్లో నకిలీవి ఎక్కువగా ఉన్నాయి. కొనేముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పంట దిగుబడి, పంట కాలం వృథా అయ్యే ప్రమాదంతో పాటు రైతు అప్పులపాలు కావడం ఖాయమని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అందుకే విత్తనాలు కొన్న రైతులు కచ్చితంగా రసీదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇటీవల వరంగల్ నగరంలోని విత్తన దుకాణాల్లో వ్యవసాయ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి రూ.6.84 లక్షల విలువచేసే పత్తి, మిరప విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీ విత్తనాల అమ్మకాలకు అనుమతి రెన్యువల్ చేయలేదు. దుకాణంలో నిల్వ ఉన్న పత్తి, మిరప విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
విత్తన ప్యాకెట్లను పరిశీలించాలి..
లైసెన్స్ ఉన్న అధీకృత దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి. విత్తన మొలక శాతం సరిగా ఉందో లేదో చూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై లాట్నంబర్, ప్యాకింగ్ తేదీ, లేబుల్ తదితర వివరాలను పరిశీలించాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మొబైల్తో స్కాన్ చేస్తే విత్తనాల పూర్తి వివరాలు ఆన్లైన్లో కనిపిస్తాయి. విత్తే ముందు కొన్ని విత్తనాలు తీసుకొని మొలక శాతం పరీక్షించుకోవాలి. విత్తన సంచులు, రసీదులను భద్రపరుచుకోవడం మంచిది. తెలిసిన షాపుల్లో విత్తనాలు కొంటే ఇంకా మంచిది.
– అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి
రైతులు ఏమరుపాటుగా ఉంటే దిగుబడి, పంటకాలం కోల్పోవాల్సిందే..
సీడ్స్ కొనుగోలు చేస్తే రసీదు తీసుకోవాలి
వ్యవసాయ, పోలీసు అధికారుల సూచన
దుకాణాల్లో విస్తృత తనిఖీలు
రెన్యువల్ చేసుకోని కంపెనీల సీడ్స్ ప్యాకెట్లు సీజ్
మచ్చుకు కొన్ని..
గతేడాది నర్సంపేట మండలానికి చెందిన రైతు రాజు పత్తి సాగు చేశాడు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పత్తి ఏపుగా పెరిగినా కాయ కాయలేదు. దీంతో రెండున్నరెకరాల్లో రూ.మూడు లక్షల వరకు నష్టపోయాడు.
వర్ధన్నపేటకు చెందిన శ్రావణ్ అనే రైతు రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. కంపెనీ విత్తనమేనంటూ కొనుగోలు చేసి నాటాడు. తీరా చూస్తే ఏముంది దిగుబడి రాలేదు. కొనుగోలు సమయంలో రసీదు తీసుకోకపోవడంతో ఆయన నష్టపోయాడు.

నకిలీ విత్తనాలతో జాగ్రత్త..